రోజురోజుకూ అన్నిరకాల కాలుష్యాలూ పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా చలామణీ అవుతోంది. ఇదంతా మానవ మనుగడకే ప్రమాదమని శాస్త్రవేత్తలు, విద్యావంతులు చెబుతున్నా, పెద్దగా మార్పు కనిపించట్లేదు. కొంతమంది మాత్రం వాస్తవాన్ని గ్రహించి, తమవంతు బాధ్యతగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి ‘ఔరా’ అనిపిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటారు ఔరంగాబాదుకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు. వేలకొద్దీ వాడేసిన ప్లాస్టక్ బాటిళ్లు సేకరించి.. వాటిని ఉపయోగించి ఒక సస్టెయినబుల్ హోమ్ నిర్మించారు!
ఔరంగాబాద్ లోని శంభాజీ నగర్, ఇప్పుడొక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది. అందుకు ఓ ఆకర్షణీయమైన కట్టడమే కారణం. నమిత, కళ్యాణిలు కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ఇద్దరూ 2020 లో ఔరంగాబాద్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక, ఇద్దరూ గువహటిలో అక్షర్ స్కూల్ గురించి విన్నారు. అక్కడి విద్యార్థుల సీట్లను, సిమెంట్ నింపిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేశారని తెలుసుకున్నారు. అప్పుడే భూమికి, వాతావరణానికి మహమ్మారిగా మారిన వేస్ట్ పాస్టిక్ ని రీసైకిల్ చేయాలని అనుకున్నారు. అలా 2021లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మట్టి, ప్లాస్టిక్ బాటిళ్లతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. దీనికి ప్రాజెక్ట్ వావర్ అని పేరు పట్టారు.
‘‘మేము అక్షర్ స్కూల్ వీడియో చూశాక, ఇలా ఇల్లు కట్టాలన్న ఐడియా వచ్చింది. అప్పట్నించి నేను, కళ్యాణి ప్లాస్టిక్ బాటిళ్ల వేటలో పడ్డాం. పారిశుధ్య కార్మికులు, హోటళ్లు, వీధుల్లో వాడేసిన బాటిళ్లను తీసుకుచ్చాం. మొదట మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వ్యతిరేకించారు. రోడ్ల మీద ఇలా చెత్త ఏరడమేంటని కోప్పడ్డారు కూడా. చాలామంది మమ్మల్ని చెత్త ఏరుకునేవాళ్లు, ప్లాస్టిక్ వాలీ, బాటిల్ వాలీ అంటూ హేళన చేశారు. కానీ మేమిద్దరం మా నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకోలేదు. మా పని మేము చేసుకుంటూ వెళ్లాం. అలా మొత్తం 16వేల ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ సేకరించాం. అలాగే సిమెంటుకి బదులు మట్టినే వాడాలనుకున్నాం. అనుకున్నట్లే మట్టి ఇటుకలు, వెదురు, ఇతరత్రా ప్లాస్టిక్ వేస్ట్ ని మాత్రమే ఉపయోగించాం కూడా. ఇతర పాస్టిక్ వేస్ట్ ని 10 వేల బాటిళ్లలో నింపాము. మిగిలిన 6వేల బాటిళ్లలో మట్టిని నింపాము. అయితే ఇల్లు కట్టడానికి ముందు మేమిద్దరం చాలా అధ్యయనం చేశామ’ని చేబుతోంది నమిత.
ఈ స్నేహితులు వాడుతున్న పదార్థాలన్నింటినీ ఔరంగాబాద్లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలోని సివిల్ ల్యాబ్ ఇంజినీర్లు టెస్ట్ చేసి నిర్ధారించారు. ఆ తర్వాత వాళ్లు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మొదట ఓ గోడని నిర్మించారు. ఆ తర్వాత ఎంతో శ్రమకోర్చి మిగతా నిర్మాణం పూర్తి చేశారు. ‘‘ఈ ఇంటిని మేము 6X4 ఫీట్ల ఫరిమాణంతో కట్టాం. మొదట్లో మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండు, మూడుసార్ల తర్వాత విజయవంతంగా కట్టగలిగాం. మొదట మమ్మల్ని తిట్టిన, హేళన చేసినవాళ్లందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నార’’ని సంతోషంగా చెప్తోంది కళ్యాణి.
ఈ ఎకో ఫ్రెండ్లీ కట్టడానికి మామూలు సిమెంట్ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో సగమే అయిందట. రెండు గదులుగా ఉన్న దీంట్లో ఈ ఇద్దరు అమ్మాయిలు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అందులో 15మంది మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఎక్కడెక్కడి నుంచో ఔత్సాహకులు ఇక్కడికి వస్తున్నట్లు చెబుతున్నారీ స్నేహితురాళ్లు. తరచూ ఆవు పేడ, మట్టితో ప్లాస్టరింగ్ చేస్తుంటే, 10-15 ఏళ్ల వరకు ఇలాంటి కట్టడాలు దృఢంగా, సురక్షితంగా ఉంటాయని నిపుణులు కూడా అంటున్నారు. చిన్న వయసులోనే సమాజం, పర్యావరణంపై బాధ్యతతో ఈ అమ్మాయిలు చేసిన ఆలోచన అన్ని వయసుల వారికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
చదువు, ఉద్యోగం, సంపాదన బాగున్నప్పుడు జీవితం సంతోషంగా అనిపిస్తుంది. రోజూ నచ్చిన ఆహారాన్ని తినే స్తోమత ఉన్నప్పుడు జీవితం తృప్తిగా ఉంటుంది. కానీ ఆ చదువు, ఉన్నత కుటుంబం, మంచి జీతం, భరోసానిచ్చే ఉద్యోగం… ఇవేమీ వికాస్ ప్రచండకు సంతృప్తిని ఇవ్వలేదు. పట్టెడన్నం లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు కడుపునింపడంతో అతనిలో అసంతృప్తి తొలగిపోయింది. లక్షల మందికి అన్నదానం చేయాలన్న ఆశయంతో ‘అక్షయ చైతన్య’ అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాడు వికాస్.
‘‘నేను చదువుకునే రోజుల్లో… తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ముంబై అంటే ధనిక, ఆనందకరమైన నగరంగా భావించేవాణ్ని. ఇక్కడ అందరూ సుఖసంతోషాలతో జీవితాన్ని అందంగా గడుపుతున్నారు అనుకునేవాణ్ని. కానీ ఎప్పుడైతే నాకు ముంబైలో మొదటి ఉద్యోగం వచ్చిందో, అప్పుడే కొన్ని సంఘటనలు నన్ను బాధపెట్టాయి. రోజూ ఆఫీసు కిటికీలోంచి చూస్తే, ఆకలితో అలమటిస్తున్న వాళ్లు కనిపించేవాళ్లు. ఆపీసు నుంచి మా ఇంటికి వెళ్లే దారిలో కూడా అలాంటివాళ్లు ఎంతోమంది ఉండేవాళ్లు. అప్పటి నుంచి నేనేదో కోల్పోయానన్న భావన కలిగేది. ఉద్యోగం బదిలీ అయ్యాక దిల్లీకి మకాం మార్చినా, నా మనసు ముంబైలోనే ఉండిపోయింది. దాంతో అక్షయ చైతన్యను మొదలు పెట్టాను. ఇప్పుడు నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను’’ అంటున్నారు వికాస్.
హరేకృష్ణ మూమెంట్ తో కలిసి ఈ అక్షయ చైతన్యను స్థాపించారు. ఆకలితో ఏ ఒక్కరూ నిద్రపోకూడదని, అసలు సమాజంలో ఆకలి అన్న పదమే ఉండకూడదన్న ఆశయంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ముంబైలో చేపట్టారు. మొదట ముంబై నగరంలో స్థలం అద్దెకు దొరకడమే ఆర్థికంగా ఇబ్బందైంది. తర్వాత 8 వేల చదరపు అడుగుల స్థలం దొరికింది. అందులో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేశారు. కొవిడ్ లాక్ డౌన్ వల్ల సీఎస్ఆర్ నిధులు ఆగిపోయాయి. అయినా వికాస్ బృందం వెనకడుగు వేయకుండా ముఖ్యమైన మైలురాళ్లను దాటింది.
ఫండింగ్ విషయానికొస్తే.. అక్షయ చైతన్య 50శాతం గ్రాంట్స్ ను కార్పొరేట్స్ నుంచి సేకరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని వెబ్ సైట్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు అందించే ఆర్థిక సాయంతో సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం ఈ అక్షయ చైతన్య టీమ్ లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇక వాలంటీర్లైతే వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్లంతా సేవా దృక్పథంతో ఉండటంవల్లే ఈ మంచి కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
‘‘మేము నాణ్యత విషయంలో ఒక్కశాతం కూడా రాజీపడం. గత ఏడాది 14 లక్షల మంది ఆకలిని తీర్చగలిగాం. ప్రస్తుతం రోజూ 8050 మంది అన్నార్తులకు భోజనం అందిస్తున్నాం. దీంతోపాటు బాల్ శిక్షణ అహార కార్యక్రమం ద్వారా 53 మున్సిపల్ స్కూల్స్ లో 6000 మంది విద్యార్థులకు రోజూ ఆరోగ్యకరమైన అల్పాహారం అందిస్తున్నాం. అలాగే స్వాస్త్య ఆహారాతో ఆరు ప్రభుత్వాసుపత్రుల దగ్గర రోగుల కోసం వచ్చిన వారి కుటుంబ సభ్యులకు భోజనాలు పెడుతున్నామ’’ని వికాస్ చెబుతున్నారు.
2025కల్లా ముంబై నగరంలో నాలుగైదు సెంట్రలైజ్డ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసుకుని… ప్రతిరోజూ లక్షమంది, ఆకలితో బాధపడుతున్న పేదలకు భోజనం అందించాలన్నది అక్షయ చైతన్య ఆశయం. ఇలాంటి కార్యక్రమాలతో ఆకలి బాధలు లేని ముంబైని చూడాలనుకుంటున్నారు వికాస్.
ఒక తండ్రి ఆశయం.. ఒక కూతురి పట్టుదల… ఇప్పుడో సంచలన వార్తగా మారింది. అవును, కూతురు ప్రతిభను గుర్తించిన ఒక తండ్రి రెక్కలుముక్కలు చేసుకుని మరీ, కూతుర్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని టెన్నిస్ అండర్-14 క్యాటగిరీలో నెంబర్ వన్ గా నిలిచిన తానియా సరాయ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడామె ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్ ర్యాంకింగ్ లో 1709 స్థానంలో ఉండటం గర్వించాల్సిన విషయం.
రాజమండ్రికి చెందిన సామ్సన్ కూతురు ఈ తానియా. చిన్నతనంలో తానియాకు టెన్నిస్ పై ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించాడు ఆ తండ్రి. తానియా కు టెన్నిస్ పై ఆసక్తి కలగడానికి కారణం ఆమె తాతయ్య. ఆయన వరంగల్ జిల్లాలోని నర్సాపూర్ లయన్స్ క్లబ్ తరఫున టెన్నిస్ ఆడేవాడు. ఇలా తానియాకు టెన్నిస్ బాల్యం నుంచే పరిచయమైన ఆట. ఆ ఆసక్తితోనే తన ఆరేళ్ల వయసులో అనంతపూర్ రఫెల్ నాడల్ టెన్నిస్ అకాడమీలో ఆడటం ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు టెన్నిస్ నేర్పించేందుకు ఆ అకాడమీని రఫెల్ నాడల్ ఫౌండేషన్ నడిపిస్తోంది.
టెన్నిస్ లో తన కూతురు కనబరుస్తున్న ప్రతిభను చూసి, సామ్సన్ తన కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులో ఆటో నడిపిస్తూ, తన సంపాదనలో ఎక్కువ శాతాన్ని తన కూతురు టెన్నిస్ కోచింగ్ కే ఖర్చు చేసేవాడు. అలా తానియాను అడ్వాంటేజ్ టెన్నిస్ అకాడమీ చేర్పించాడు. ఏడాదిన్నర తర్వాత తానియా ప్రతిభను మెచ్చి, సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఆ ట్రైనింగ్ సెంటర్ నగరశివార్లలో ఉండేసరికి, అక్కడిదాకా ఆటో నడపడం కష్టం అయ్యేది సామ్సన్ కి. దాంతో తానియా కుటుంబం మణికొండకు మారింది. ప్రస్తుతం వివిధ కోచ్ ల దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఇలా ఆమె ప్రతి అడుగులోనూ తండ్రి సామ్సన్ తో పాటు మొత్తం కుటుంబం అండగా నిలుస్తోంది.
‘‘తానియాకు మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించడం, ఫిజియోథెరపీ, న్యూట్రిషనిస్ట్ ల సంప్రదింపులు, జిమ్ మొదలైన వాటన్నింటికీ ఎంతలేదన్నా నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతోంది. ఆటో నడుపుతూ వచ్చే సంపాదనతో నాకు అయినంత వరకు ఖర్చు చేస్తున్నాను. అది సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడాలి, ఎంతవరకు ఈ కష్టం కొనసాగుతుందో. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా వివిధ టోర్నమెంట్లకు తానియాను తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నాం కానీ, అవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయాలు కదా!’’ అని సామ్సన్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ బాధపడుతున్నాడు.
తానియా ఇటు రాష్ట్రస్థాయి, అటు జాతీయ స్థాయిలలో మొత్తం 128 టోర్నమెంట్లలో ఆడింది. అందులో సింగిల్స్, డబుల్స్ కలిపి మొత్తం 117 టోర్నమెంట్లలో విజయం సాధించింది. ‘‘ఈ ఏడాదిలో కనీసం 16 ఐటీఎఫ్ (International Tennis Federation) టోర్నమెంట్లలో ఆడాలన్న లక్ష్యంతో ఉన్నాను. ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. 2023 చివరికల్లా టాప్ 100లో ఉండాలని కోరుకుంటున్నాన’’ని తానియా ధీమాగా అంటోంది.
ఆమె టెన్నిస్ ప్రయాణం చూసుకుంటే, అందులో తండ్రి సామ్సన్ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్ లో ఎన్నో విజయాలు సాధించి ఆ తండ్రే కాదు, మొత్తం దేశం గర్వించేలా తానియా ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే మంచి మనసుతో తన ప్రయాణలో తోడ్పాటు అందించిన, అందించే స్పాన్సర్లకు తామెప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని ఆ తండ్రీకూతుళ్లు చెప్తున్నారు.
దంపతులిద్దరికీ స్పందించే మనసుంటే, సమాజానికి గొప్ప మేలే జరుగుతుంది. అందుకు ఉదాహరణగా బెంగళూరుకు చెందిన వి.మణి, సరోజల గురించి చెప్పుకోవచ్చు. చాలామంది సమాజం మీద బాధ్యతతో, అనాథలుగా మారిన పిల్లలపై ప్రేమతోనో ఎన్జీఓలు స్థాపిస్తారు. మరి ఈ దంపతులు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎవరికోసమో తెలుసా? పిల్లల కోసమే! కాకపోతే తల్లిదండ్రులు ఉన్నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వాళ్ల కోసం. జైలు జీవితం గడుపుతున్న వాళ్ల పిల్లల కోసం! సమాజంలో ఈ పిల్లల పట్ల తీవ్రమైన వివక్ష కనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకు అండగా ఉంటూ వారి తిండి, చదువు, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలను చేపట్టింది ‘సోసైటీస్ కేర్ (సోకేర్)’.
1990ల్లో మణి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తుండేవారు. ఆయన రోజూ సెంట్రల్ జైలు మీదుగా బ్యాంకుకు వెళ్లేవారు. ఆ క్రమంలోనే జైలు బయట దీనంగా ఉన్న కొందరు పిల్లలను చూసేవారు. అక్కడున్న వాళ్లను వాకబు చేస్తే… వాళ్లంతా ఆ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లలని తెలుసుకున్నారు. ‘‘జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడ్డ ఖైదీల పిల్లలు, జైలు బయట ఎక్కువగా కనిపించేవాళ్లు. వాళ్లంతా బయటికి రాలేని అమ్మానాన్నలను తలుచుకుని ఏడవడం నన్ను బాగా కలచివేసింది. అప్పటి నుంచి నేను ఆ పిల్లల గురించే ఆలోచించేవాణ్ని. వాళ్ల కుటుంబాల గురించి తెలసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు జైలు పాలయ్యారో… అప్పటి నుంచి వాళ్ల బంధువులు ఆ పిల్లలను కూడా తప్పు చేసిన వాళ్లలా చూడటం ప్రారంభించడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని మణి బాధపడేవారు.
పదవీ విరమణ చేసిన తర్వాత మణి, సరోజిలు తాము కూడబెట్టుకున్న ఏడు లక్ష రూపాయలతో ఆ పిల్లల కోసం ఒక నివాసాన్ని ఏర్పాటు చేశారు. అందులో కర్ణాటక జైళ్లలోని ఖైదీల పిల్లలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాళ్లను రోజూ స్కూళ్లకు పంపుతూ, ఆరోగ్యకరమైన భోజనం పెడుతూ… ప్రేమను పంచుతూ రక్షణ కల్పిస్తున్నారు. అలా 1999లో ఈ సొసైటీస్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది.
‘‘చాలా కష్టపడి ఎన్నో జైళ్లు, అందులో ఖైదీల పిల్లల గురించి తెలుసుకుని మరీ.. ఆపదలో ఉన్న పిల్లలను తీసుకొచ్చారు మణిగారు. 2008లో సరోజిగారు, 2011లో వి మణిగారు చనిపోయారు. అయినా సంస్థ సేవలేవీ ఆగలేదు. ఆ విధంగా మణిగారు అన్నీ పక్కాప్రణాళికలతో సంస్థను సిద్ధం చేసి వెళ్లిపోయారు. నేను ఆ దంపతుల స్నేహితుడిని. 2010 నుంచి నేను కూడా సంస్థ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నాను’’ అంటున్నారు సోకేర్ సంస్థ సెక్రటరీ వెంకటరతన్ రాఘవాచారి.
‘‘నా ఐదేళ్ల వయసప్పుడు మా నాన్న ఒక హత్య కేసులో జైలుకి వెళ్లారు. నాన్నకు 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి నన్ను, తమ్ముడిని చుట్టుపక్కల వాళ్లు నాన్న పేరుతో తిట్టేవారు. కానీ సోకేర్ కి వెళ్లగానే మా జీవితం మారిపోయింది. వాళ్లు మమ్మల్ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించారు. తర్వాత నేను దాతల సాయంతో సీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం యాక్సెంచర్ లో అనలిస్టుగా పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుని భర్త, ఒక బిడ్డతో సంతోషంగా ఉన్నాను. దీనంతటికీ ఆ దంపతుల పుణ్యమే’’ అని చెబుతున్నారు సంగీత. సోకేర్ పూర్వవిద్యార్థులను కదిపితే ఇలాంటి కథలెన్నో వినిపిస్తాయి.
ఈ 23 ఏళ్లలో, సోకేర్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ మూడు భవనాలలో తమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. రెండు హాస్టల్స్, ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఉన్నాయి. ఎప్పుడో మంచి మనసుతో ఆ ప్రేమమూర్తులు నాటిన ఇక మొక్క ఎంతోమందికి నీడనిచ్చే వృక్షంగా మారింది!
కరోనా సమయంలో అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపినందుకు నేను చాలా మంది దీవెనలు నేను అందుకున్నాను. ఓ తల్లి… రవి నా కొడుకు అని దీవించారు! ఇప్పుడు మా అమ్మ లేరు కానీ అలాంటి దీవెనలు నాకు చాలా సంతోషం ఇస్తాయి. ఎందకంటే, నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మే! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి పెద్ద సంస్థల్లో చదువుకోకపోయినా… మా అమ్మ, నాన్న నేర్పిన పాఠాలు చాలా విలువైనవని నేను నమ్ముతాను. అప్పట్లో మా అమ్మ, నా చేతిలో కొంత సొమ్ము పెట్టి నువ్వు నచ్చిన చదువు చదువుకో అనే స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను.
ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకున్నా!
వరంగల్ కు 120 కి.మీ. దూరంలో ఉన్న ఊరు మాది. అందులో ఓ 15 కి.మీ. అడవిలో నడిచి వెళ్లాలి. అలాంటి ప్రాంతం నుంచి నన్ను పంపడానికి, మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం! 11 ఏళ్ల వయస్సులో ఊరు వదిలి వరంగల్ నగరానికి వచ్చి ప్రభుత్వ హాస్టల్లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. నేను చదువుకునేటప్పుడే… ట్యూషన్లు చెప్పి నా ఖర్చులకు సంపాదించుకున్నా! ఎలాగూ హాస్టల్ లోనే ఉంటున్నావు కదా, ఖర్చులు ఏముంటాయని డబ్బు ఇచ్చేవారు కాదు! అందుకే నా ఖర్చులు నేనే సంపాదించుకునేవాడిని.
అప్పట్లో పదో తరగతి పూర్తయితే ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో పేరు నమోదు చేసుకునేవారు. అక్కడి నుంచి ఉద్యోగాలు వచ్చేవి. మానాన్న చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. చదువైనా చదవాలి, పనైనా చేయాలి… ఖాళీగా ఉండొద్దని చెప్పేవారు! మాకు వ్యవసాయ భూములు కూడా ఉండేవి. మా ఊళ్లో కొందరు చదివినా ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేం పనులకు వెళ్తే కూలీల ఖర్చు తగ్గుతుందని మా నాన్న అనేవారు. పిల్లలు అటు చదువుకూ.. ఇటు పనికీ పనికిరాకుండా పోతారేమో అన్న భయం ఆయనలో కనిపించేది. అది భయం కాదు జాగ్రత్త అని తర్వాత తెలుసుకున్నాను.
నా వ్యక్తిత్వం… నాన్న నేర్పిన పాఠం!
మా నాన్న వ్యసనాల గురించి మాటిమాటికీ హెచ్చరించేవారు. పేకాట, మద్యం లాంటి వ్యసనాలు.. మనిషిని బాగా ప్రభావితం చేస్తాయని చెప్పేవారు. వ్యక్తిత్వం చాలా ముఖ్యమని నాన్న అనేవారు. చెడు సావాహాలు మనిషిని పాడు చేస్తాయని ఆయన నమ్మకం. ఎప్పుడూ మంచి కోసమే పని చేయాలని చెప్పేవారు. ఆయన చాలా పట్టుదల మనిషి. చాలా ధైర్యస్తుడు. అప్పట్లోనే తన భూమి వివాదాల్లో హైకోర్టు వరకూ వెళ్లి వచ్చారు. రాజులా తినాలి, బంటులా పని చేయాలని చెప్పేవారు. ఆయన ఎలాంటి అనారోగ్యం లేకుండా 90 ఏళ్లు జీవించారు.
నాన్నకు నచ్చని అమెరికా జీవితం..
మా నాన్న కూడా బాగా చదువుకున్నారు. అప్పట్లో ఆయనకు ఉద్యోగం వచ్చినా, ఎవరి దగ్గరో ఎందుకు పని చేయాలంటూ మా తాతగారు నాన్నను ఉద్యోగం చేయవద్దన్నారట. నేను అమెరికాలో స్థిరపడటం చూసి నాన్న సంతోషించారు. ఒకసారి అమెరికాకు వచ్చారు కానీ ఇక్కడి జీవితం ఆయనకు అంతగా నచ్చలేదు. మేం చదివేటప్పుడు కూడా మానాన్న మా చదువుతో తప్పకుండా ఉపాధి దొరకాలి అనే వారు. అందుకే మేం ఉద్యోగాలిచ్చే చదువుల కోసం ప్రయత్నించాను.
అమెరికా… అవకాశాల స్వర్గం!
అమెరికా గురించి చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఇక్కడ దాదాపు అందరూ పని చేస్తారు.. ఇక్కడ ఈ చదువు వచ్చిన వాళ్లే ఈ పని చేయాలని ఏమీ నిబంధన ఏమీ లేదు. చాలా మందికి ఈ విషయంలో అపోహలు ఉంటాయి. నేను సాఫ్ట్ వేర్ ద్వారా వెళ్లాను కదా… మా ఫీల్డులో చాలామంది సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్లేని వారు కూడా పని చేస్తుంటారు. ఇక్కడ అలా అవకాశం ఇస్తారు. ఇది నిజంగానే గొప్ప విషయం.
మేం ఇంటర్లో 300 మందిలో కేవలం ఐదుగురమే పాసయ్యం. అప్పట్లో పదో తరగతిలోనూ చాలా తక్కువ మంది పాసయ్యారు. పది పాస్ కావడం అప్పట్లో గొప్ప విషయం. అలా చదువుకునే విషయంలోనే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అందులో విజయం సాధించాను. ఆ తత్వం నాకు అమెరికాలోనూ ఉపయోగపడింది. నాకు ఇంజినీరింగ్ లో డిగ్రీ లేకపోయినా ఈ తత్వం నాకు సవాళ్లు ఎదుర్కోవడంలో బాగా ఉపయోగపడింది. అనేక ఏళ్ల పాటు ప్రాక్టీసు చేయడం వల్ల పర్ ఫెక్షన్ వచ్చింది. తెలుగు మీడియం నుంచి వచ్చినా ఆంగ్లంపై పట్టు సాధించాను. ఇంటర్, డిగ్రీలో ఇంగ్లీష్ బాగా చదివాను.. పట్టు సాధించాను. అప్పట్లోనే నేను ఇతరులకు కూడా ఇంగ్లీషు ఇతరులకు బోధించేవాడిని. ఇది నావల్ల కాదు అని ఎప్పుడూ భావించే వాడిని కాదు. ఆ దృక్పధం నాకు బాగా తోడ్పడింది.
అప్పుడే చాలా కష్టం అనుభవించా…
ఇక్కడ కరోనా సమయంలో ఫ్లయిట్ సర్వీస్ ప్రాజెక్టు చేసినప్పుడు కూడా ఈ తత్వం నాకు తోడ్పడింది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ఎక్కువ ఆలోచిస్తా. నేను నిర్ణయం తీసుకోవడంలో చాలా నెమ్మదిగా ఉంటా. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని సాధించేవరకూ వదిలిపెట్టను. అమెరికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నడిపే విషయంలో నేను చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. అసలు ఈ ఫ్లయిట్ సర్వీసుల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా భారతీయులకు సేవ చేయాలనే ఆలోచనతోనే దీనిపై దృష్టి సారించా. కరోనా సమయంలో ఇండియా వచ్చేందుకు ఒక్కో ఫ్లయిట్కు 300 సీట్లు ఉంటే 30 వేల మంది అప్లయ్ చేసుకున్నారు. ఆ సమయంలో నాకు ఉన్న పరిచయాల ద్వారా చాలా కష్టపడి ఈ ఫ్లయిట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేశా.
మూడు టైమ్జోన్లలో ఒకేసారి పని చేశా
ఇండియా, అమెరికా విమాన సంస్థలు ఆపరేషన్లకు సిద్ధంగా లేని సమయంలో మిడిల్ ఈస్ట్ నుంచి సేవలు అందించాను. అమెరికా ఎంబసీలో 30 వేల మంది రిజిస్టర్ చేసుకుంటే, నా వద్ద 2వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతో ఒత్తిడి అధిగమించి ఈ ప్రాజెక్టు విజయవంతం చేయడం నా జీవితంలోనే అత్యంత సంతృప్తినిచ్చింది. నేను జీవితంలో ఎక్కువగా కష్టపడింది ఈ ప్రాజెక్టులోనే.
ప్రస్తుతం నేను ప్రథమ్ సంస్థతో కలసి పని చేస్తున్నాను. అది విద్యారంగంలో సేవ చేస్తున్న సంస్థ. మరో ఆంట్రపెన్యువర్ సంస్థలోనూ సభ్యుడిగా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు సాయం చేయాలన్నదే నా అభిలాష. 2018లో ఇవాంకా (నాటి అమెరికా అధ్యక్షుని కుమార్తె) బృందంలో సభ్యుడిగా అతిథిగా అడుగు పెట్టడం చాలా సంతృప్తి ఇచ్చింది.
స్మార్ట్ఫోనే అత్యుత్తమ ఆయుధం..
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యువత చేతిలో ఉంది. దాంతోనే ఏదైనా చేయొచ్చు. నైపుణ్యాలు ఎక్కడైనా ఒక్కటే. ఇంగ్లిష్ రానంత మాత్రాన మనం వెనుకబడిపోవాల్సిన అవసరం లేదు. ఓ చైనా బిజినెస్ మెన్ ఇంగ్లిష్ రాకుండానే అమెరికాలో మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి, భాషతో పని లేదు. మనమీద మనకు నమ్మకం ఉంటే చాలు. మీకు ఉన్న స్కిల్పై ఆధాపడండి చాలు. పెద్దగా ఆలోచించండి… మీరు ఎదగండి… నలుగురికి ఉపాధి కల్పించండి!
ఎప్పుడైనా నా కథని రాయల్సి వస్తే సక్సెస్ స్టోరీ కాకుండా నా ఫెయిల్యూర్ స్టోరీ రాద్దామనుకుంటాను. ఎందుకంటే విజయం… పొగరును అలవాటు చేస్తుంది. మన విజయాన్ని అవతలివారు గుర్తించడం లేదన్న అసంతృప్తిని కూడా ఇస్తుంది. నిజమైన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కాబట్టే… నాకు జీవితకథలు చదవడం అంటే చాలా ఇష్టం. నిష్కర్షగా రాసిన జీవితకథలు ఎంతో నేర్పిస్తాయి. ఆదిభట్ల నారాయణదాసు జీవితకథనే తీసుకోండి. అన్ని కళల సమాహారం అయిన హరికథ ప్రక్రియకు పితామహుడే అయినా.. ఎంతో నిజాయితీగా తన జీవితకథను రాశారు. డైరీల వల్ల కూడా మన జీవితాన్ని నేరుగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు డైరీ రాయడం అన్నా ఇష్టమే!
మాస్కు వెయ్యొద్దు మనసు మీద!
తల్లి కడుపులోంచి బయటకు వస్తూనే ఎవడూ, నేను దుర్మార్గుడిని అనుకుంటూ రాడు! మనుషులందరూ మంచివాళ్లే. కానీ ఇప్పటి పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతోంది. తెలివితేటలు అంటే అగ్ని. అది ఒకరికి వెలుగు కావచ్చు, మరొకరికి మంట కావచ్చు. ఆ విచక్షణ కోసం గురువు అవసరం ఉంటుంది. గురువు… మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేసి, జ్ఞానాన్ని వెలిగిస్తాడు. ఈరోజుల్లో సమాజం ఇంత అస్తవ్యస్తంగా ఉండటానికి కారణం సరైన గురువు లేకపోవడమే!
ఇప్పటి పిల్లలను మార్కులు సంపాదించే యంత్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. అప్పట్లో మాకు అన్ని సబ్జక్టులూ కలిపి 90 వస్తే పండుగ చేసుకునేవాళ్లం. ఇప్పుడు 90 వచ్చినా అసంతృప్తి! పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన వాళ్లని తక్కువ అంచనా వేయడానికి లేదు. పిల్లవాడికి చదువు పట్ల అభిలాష అంతగా లేకపోవచ్చు. కానీ తనలో ఏ నైపుణ్యం ఉందో గ్రహించే ప్రయత్నం చేయాలి. నాకు ఇతర దేశాల్లో నచ్చిన అంశం ఏమిటంటే… అక్కడ చదువుతో పాటు లలిత కళలు, ఆటల పట్ల కూడా తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఆటల వల్ల వ్యాయామంతో పాటు క్రీడాస్ఫూర్తి అలవడుతుంది. ఇప్పుడు అంతా గెలుపు గురించే చెబుతున్నారు. కానీ ఓడిపోతే ఏం భయపడక్కర్లేదని ఎవరూ చెప్పడం లేదు. గెలుపు నీకు ఏదన్నా బహుమతిని మాత్రమే ఇస్తుంది. కానీ ఓటమి ఆలోచింపచేస్తుంది. కాబట్టి ఓటమి నీ గురువు. దాన్ని హ్యాండిల్ చేయడం పిల్లవాడికి నేర్పండి చాలు.
ఆత్మహత్య మహాపాపం!
ఒక మనిషి తను బతకండం కంటే చావడమే మేలు అనే స్థితికి చేరుకున్నాడంటే… వాళ్లు ఎంతగా బాధపడి ఉంటారు. మానసికంగా ఎంత క్షోభను అనుభవించి ఉంటారు. అందుకే కుంగుబాటులో ఉన్నవాడిని గమనించుకోవడం మన బాధ్యత. అలాంటి స్థితిలో ఉన్నవాడి భుజం మీద చేసి నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలిగితే చాలు. అందుకే నేను ఆత్మహత్య ప్రయత్నం గురించి KEY అనే నాటిక రాశాను. అందరూ ఊహించేదానికంటే భిన్నంగా… అందులో చావు పాత్రను చాలా అందంగా తీర్చిదిద్దాను. వెయ్యిచావుల కన్నా ఓ బతుకు గొప్పది అని ఆ చావుతోనే చెప్పించాను. ఆ నాటిక చూసి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు- ‘నేను ఈ ఉగాదికి చనిపోవాలని నిశ్చయించుకున్నాను. కానీ మొన్న మీ నాటకం చూశాక, చనిపోవాలనే ఆలోచనను విరమించుకున్నాను’ అని.
రచయితగా ఎందుకు మారానంటే!
మా గురువుగారు ఓ మాట చెప్పేవారు. మనం చేసే పనుల్లో ఒకటి జాబ్ శాటిస్ ఫాక్షన్ ఇస్తే మరొకటి జేబు శాటిస్ ఫాక్షన్ ఇవ్వాలి అని. రచయితగా చేసిన పనిలో తృప్తి లభించేది. కానీ ఓ పాతికేళ్ల నాడు మా కాలంలో రచయిత అంటే కరివేపాకులా చూసేవారు. మాకు ఓ కాగితాల బొత్తి, కలం ఇచ్చేవారు… కానీ డబ్బు మాత్రం ఇచ్చేవాళ్లు కాదు. నాకు దేవుడిలాంటి రాళ్లపల్లిగారు ఏ లోటూ రాకుండా చూసుకునేవారు కాబట్టి సినిమా కష్టాలు దాటుకుని నిలదొక్కుకోగలిగాను. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నటుడిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాను.
స్త్రీ
మా ఇంట్లో ఏడుగురు అన్నదమ్ములం. కాబట్టి ఆడపిల్లల విలువ మాకు తెలుసు. ఆడపిల్లలంటే దేవతలతో సమానం. అందుకే ఆమధ్య ఓ దుస్సంఘటన జరిగినప్పుడు… ‘ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేవరకూ నిరసనగా నేను నల్లచొక్కానే వేసుకుంటాను’ అని శపథం చేశాను. ఆ ఉరి పడిన రోజే వాటిని తీసేశాను. నేను 50కి పైగా సినిమాల్లో డైలాగులు రాశాను కానీ ఎక్కడా ఓ ద్వందార్థం రాయలేదు. వాళ్లని ఎప్పుడూ ఉదాత్తంగానే చూపించే ప్రయత్నం చేశాను. ‘ఆడవారు లేకపోతే నేను లేను’ అనే భావనే నా దృష్టిలో సమానత్వం. సాక్షాత్తు శివుడైనా సరే శక్తి లేకపోతే చలనం ఉండదు అన్నాడు ఆదిశంకరుడు. అందుకే… స్త్రీని గౌరవించాలి. పురుషుడిని ఆరాధించాలి!
ఓ అవసరం మాత్రమే!
పరిణామక్రమంలో సోషల్ మీడియో ఒక అవసరం. నాగరికత నిప్పు నుంచి ఎదిగింది… దాంతోనే జంతువులను భయపెట్టాడు. వాటిని కాల్చుకు తిన్నాడు. ఆనిప్పులో తను కూడా కాలాడు. ఆ నిప్పులాగే సోషల్ మీడియాను కూడా వాడుకోవాలి. అత్తరులా పూసుకోవాలంతే! ఆ మాటకు వస్తే దేనికీ కూడా అతిగా చలించిపోకూడదు. తామరాకు మీద నీటిబొట్టులాగా attached detachment ఉండేవాడే సుఖజీవి.
ఓ నిరంతర యుద్ధం
ఓ సమయంలో నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, నన్ను అన్న మాటలకి వచ్చిన కన్నీళ్లతో నేను రాసిన అక్షరాలే చెరిగిపోయాయి. మనం అందరం జీవితంలో ఇలాంటి అనుభవాలు చూశాము. ఏడ్చాం, కన్నీరు తుడుచుకున్నాం. ప్రపంచం నిరంతర యుద్ధం. సమాజం నిరంతర యుద్ధం. నిరంతరం నీలో ఒక భారతం జరుగుతోంది. మన మనసే అర్జునుడు, కృష్ణుడు బుద్ధి, పంచపాండవులు పంచేంద్రియాలు, అనంతమైన కోరికలే కౌరవులు. అటు వెళ్లకుండా నియంత్రించుకోవడమే విజయం. సాధన చేస్తేనే అది సాధ్యమవుతుంది.
మంచితనం పంచుకుంటూ…
మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. సాటివారితో ప్రవర్తించేందుకు ఎంతో లౌక్యాన్ని ఉపయోగిస్తాం. చాలాసార్లు అన్యాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండి కూడా భయపడి ఊరుకుంటాం. కనీసం చిన్నచిన్న పనులైనా నిజాయితీగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి కదా! సాటి మనిషి పట్ల కరుణతో మెలగాలి కదా! ఈ ప్రపంచంలో అందమైన కళ్లేవి అని అడిగిన ఆదిశంకరుడు… ‘ఏ కళ్లు కరుణను వర్షిస్తాయో అవే అందమైన కళ్లు’ అని చెబుతాడు. ఆ కరుణను నీ పిల్లలతో మొదలుపెట్టు. మనిషి స్వతహాగా మంచివాడు అని నిరూపించడానికి కరోనా ఓ సందర్భంగా మారింది. ఇది కొనసాగాలి.
కొన్ని మాటలు…
# కళాకారుడు నిత్య యవ్వనుడు. దీర్ఘాయువు.
# అసంతృప్తితో ఉండటం… ఓ మెట్టుఎదగడానికి అవకాశం.
# బిడ్డల పెంపకంలో తండ్రిది ఎప్పుడూ బ్యాక్ స్టేజే. కాబట్టి… రాసేది మగవారే అయినా తల్లి గురించే ఎక్కువగా రాస్తుంటారు. అందుకనే నాకు ఆయన గురించి చెప్పే అవకాశం వచ్చినప్పుడు ‘నాన్న ఎందుకో వెనకబడ్డాడు’ అనే కవితను చదివాను.
#కష్టం వచ్చినప్పుడు దాన్ని కాచుకోవాలి అందుకే ఓ చోట నేను ‘అల వచ్చినప్పుడు తల వంచుకోవాలి’ అని రాశాను.
జీవితం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే… ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ పోవడమే! విజయం అంటే సాధికారికంగా నలుగురితో పంచుకోగలిగేది. నేను సంతోషంగా ఉంటే… ఆ సంతోషం మా అమ్మ కళ్లలో ప్రతిఫలిస్తుంది. ఇతరులకు వాళ్ల జీవితాలకు అర్థం వాళ్లు కనుగొనేలా చేయడం నా జీవితానికి అర్థంగా భావిస్తాను. ఇతరులకు వాళ్ల జీవితానందాన్ని కనుగొనేలా చేయడం… ఆ మార్గంలో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా చేయడం… నా జీవిత లక్ష్యంగా భావిస్తాను. జీవితంలో సాధ్యమైనంతగా ఎక్కువ మందిని ప్రభావితం చేయాలని భావిస్తాను. చాలామందిలో అపరిమితమైన శక్తులు ఉంటాయి. ఆ విషయాలను వాళ్లు గుర్తించడంలో సాయపడాలి. అలా చేయడం ద్వారా నేను ఈ సమాజానికి మేలు చేసిన వాడినవుతాను.
పుస్తకాలే మార్గదర్శకులు
నేను ఓ పుస్తకాల పురుగుని. అసలు పుస్తకాలు లేకపోతే… నేను లేను! చరిత్ర, సైన్స్, సోషల్… ఇలా అన్నిరకాల పుస్తకాల మీదా నాకు ఆసక్తి ఉండేది. ఎన్నో తెలుసుకోవాలని ఉండేది. నా అదృష్టం ఏమిటంటే, ఇంట్లో అందరూ నన్ను పుస్తకపఠనం దిశగా ప్రోత్సహించారు. ప్రతి సందర్భానికీ నాకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు. చందమామ, టింకిల్, అమర్ చిత్రకథ వంటి పుస్తకాలు చిన్నతనంలోనే నా వ్యక్తిత్వంపై ఓ ముద్ర వేశాయి. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు, పాఠశాల, పుస్తకాలు… ఇవే కదా మనల్ని ప్రభావితం చేసేవి. చిన్నప్పుడు చదివిన వివేకానంద, భగత్ సింగ్ లాంటి వారి జీవిత చరిత్రలు నా మనసులో నిలిచిపోయి ఉంటాయనుకుంటాను. నాకు రుద్రవీణలోని ‘తరలిరాద తనే వసంతం… తన దరికిరాని వనాల కోసం’ పాట చాలా ఇష్టం. ఈ పాట పాడితే తాతగారు నాకు చాక్లెట్ బహుమతిగా ఇచ్చేవారు. ఈ పాటకు పియానో వాయించేందుకు కూడా ప్రయత్నించాను.
నాన్నలా మాట్లాడాలని…
నేను సిటీ కుర్రాణ్ని కాదు. ఐదో తరగతి వరకూ నా బాల్యం మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లోనే గడిచింది. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చాం. అయినా నా పట్నాల్లో బాల్యం నాపై చాలా ప్రభావం చూపించింది. అప్పట్లో తల్లిదండ్రులే కాదు, కాలనీ కాలనీ అంతా ఓ కుటుంబంలో ఉండేవాళ్లం. మా నాన్న నాగభూషణరావు ఆరోగ్యశాఖలో పని చేసేవారు. ఆయన తన ఉద్యోగంలో చాలా దూకుడుగా ఉండేవారు. నేను ఇంట్రావర్టుని. ఆయన్ను చూసి… ఇంతగా ఎలా ఆకట్టుకునేలా మాట్లాడతారా అని ఆశ్చర్యపోయేవాడిని! మానాన్న చాలా కవితాత్మకంగా మాట్లాడేవారు. మా అమ్మ కూడా నన్ను ప్రోత్సహించేవారు. మా నాన్న ప్రభావం నాపై చాలా ఉంటుందనుకుంటున్నాను. నా ఈ ఉన్నతిని ఆయన చూడలేకపోయినా.. ఇప్పటికీ ఆయన నాతో ఉన్నారనే భావిస్తాను.
ప్రశ్నలు మీవే…జావాబులూ మీవే!
నా రిఫ్లెక్షన్స్ అనే పుస్తకం… మనతో మనం ఎలా ఉండాలో చెబుతుంది. మనతో మనం నిజాయితీగా ఉంటూ, అలాగే ప్రపంచంతోనూ ఉండాల్సిన అవసరాన్ని ఈ పుస్తకంలో వివరించాను. సెల్ఫ్ డిస్కవరీ అనేది చాలా అవసరం. మనకు ఏం కావాలో క్లారిటీ లేనప్పుడు… ఊరికే ఎవరి కారణంగానో పరుగులు పెడుతుంటాం. అందుకే అసలు మనకు ఏం కావాలో మనం తేల్చుకోవాలి. అప్పుడే దానికి అనుగుణంగా అన్నీ జరుగుతాయి. ముందు ఈ విషయమై స్పష్టత అవసరం. ప్రతి ఒకరూ ఏదో ఒక సమయంలో అసలు నేనేంటి అని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటారు. ఈ రియలైజేషన్ ఎంత త్వరగా వస్తే, ఎంత ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తే… అంత మంచిది. ఎంత ఆలస్యం అయితే… అన్ని అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, ఆలస్యమైన కొద్దీ మనకు అనేక బంధాలు, బాధ్యతలు వచ్చేస్తాయి. అవి అడ్డుగోడలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు కచ్చితంగా అసలు నేనెవర్ని అని ప్రశ్నించుకోవాలి. ఏ విలువల కోసం మీరు బతకదలచుకున్నారో ప్రశ్నించుకోవాలి. ఈ అంశాలన్నీ ఓ కాగితం మీద రాసుకుంటే మనకు ఓ క్లారిటీ వస్తుంది.
మెరుగ్గా మార్చే ప్రతి ఒక్కరూ మార్గదర్శే!
మెంటరింగ్ అనేది మన ఇంట్లో మొదలవుతుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్లను చూసే మనం అలా కావాలని అనుకుంటుంటాం. కానీ పుస్తకాలు చదవడం వల్ల… ఇంట్లో వాళ్లు, ఇరుగు పొరుగే కాకుండా ప్రపంచంలోని వ్యక్తులంతా మన మార్గదక్శకులు అవుతారు. మొదట మనం చదవడం నేర్చుకుంటే… ఆ తర్వాత నేర్చుకోవడం కోసం చదవవచ్చు. చాలా మంది ఫస్ట్ పార్ట్ చేసి సెకండ్ పార్ట్ వదిలేస్తారు. నా జీవితంలో నా కుటుంబ సభ్యులతో పాటు నేను చదివిన పుస్తకాల రచయితలందరినీ నా మెంటార్లుగానే భావిస్తాను. నేను వివేకానంద పుస్తకాలు బాగా చదివేవాడిని. ఎంతగా అంటే… ఒక దశలో అదో వ్యసనంగా మారిపోయింది.
వేల జీవితాలు మార్చేయవచ్చు!
ఇంజినీరింగ్ పూర్తయ్యాక, కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తయ్యాక… జిరాక్స్ సంస్థలో పని చేశాను. మోటరోలా సంస్థ కోసం జీరాక్స్ లో ఇంటర్న్ షిప్ చేశాను. ఇలా ప్రపంచ స్థాయి సంస్థల్లో పని చేయడం వల్ల దృక్పథం పెరిగింది. నేను జిరాక్స్ లో నెంబర్ వన్ ఉద్యోగిగా అవార్డు కూడా అందుకున్నాను. ఓ మంచి వంట నేర్చుకున్నాక, అనేక హోటళ్లలో రకరకాలు వండాలంటే… ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆంట్రప్రెన్యూర్షిప్. చాలామంది తమకు ఉన్న ఉద్యోగాలతో భద్రతగా ఫీలవుతారు. సెటిల్ అవుతారు. కానీ నాలాంటి కొందరికి సాహసాలే ఇష్టం. సరైన ఆలోచనా తీరుతో ఇలాంటి సాహసాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అత్యంత ఆనందకరమైన రోజు
ఒక కంపెనీలో పని చేసి, ప్రాథమిక విషయాలన్నీ నేర్చుకుని, పునాదులు సరిగ్గా పడిన తరవాత… వ్యాపారవేత్తగా మారాను. 2004లో నా ఆంట్రపెన్యూవర్షిప్ మొదలైంది. అడొసిస్ నా మొదటి కంపెనీ. ఇప్పుడు ఆ సంస్థ ఏడాదికి బిలియన్ల లావాదేవీలు సాగిస్తోంది. అలాంటి ఎన్నో కంపెనీలు ప్రారంభించాను. వాటి ద్వారా వేల మంది జీవితాలను తాకగలిగాను. నేను స్థాపించిన సంస్థల ద్వారా ఉన్నత స్థాయికి వెళ్లిన కుర్రాళ్ల తల్లిదండ్రులను కలవడం నా జీవితంలో అత్యంత ఆనందకరమై రోజు. మిమ్మల్ని కలిశాక మా పిల్లల జీవితాలు పూర్తిగా మారిపోయాయని వాళ్లు చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది.
Personal and Professional Lives
బౌద్ధ సాహిత్యంలో ఓ వాక్యం ఉంటుంది… ప్రతిదీ ప్రవహిస్తుంది అని! జీవితంలోనూ అంతే. జీవితంలో గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమయమూ వెళ్లిపోతుంది అని గుర్తు చేసుకుంటాను. సంతోషకరమైన సమయాల్లోనూ దీన్ని గుర్తుచేసుకుంటాను. మూడ్ బాగా లేకపోతే.. లాంగ్ డ్రైవ్ కి వెళ్తాను. పెయింటింగ్స్ వేసుకుంటాను. ఇలాంటి వాటి ద్వారా నా మూడ్ బాగవుతుంది. పని, జీవితం బ్యాలెన్స్ చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తారు. వాస్తవానికి పని, పర్సనల్ లైఫ్ అంటూ వేరుగా ఉండవు. మీరు ఉద్యోగంలో ఓ విజయం సాధిస్తే, దాని ప్రభావం పర్సనల్ లైఫ్ పైనా ఉంటుంది. మీరు ఉద్యోగం నుంచి ఆనందంగా ఇంటికెళ్తే, ఇంటి దగ్గరా ఆనందం కొనసాగుతుంది. అలాగే ఇంటి నుంచి ఆనందంగా ఆఫీసుకు వెళ్తే, అక్కడా ఆ మూడ్ కొనసాగుతుంది. అందుకే రెండింటినీ వేరు చేయలేం. అదో నిరంతర ప్రక్రియ. జీవితంలో వర్క్ అనేది ఓ భాగంగా తీసుకోవాలి.
వాళ్ల నుంచే నేర్చుకుంటున్నా
నా భార్య శిరీష. నేను చేసిన ప్రతి కంపెనీలోనూ, ప్రతి పనిలోనూ తను ఉంది. మేం ఇంజినీరింగ్ కలిసే చేశాం. ఆంట్రపెన్యుర్షిప్ కూడా కలిసే చేశాం. మా పిల్లలు మా ఇద్దరిలో స్నేహితులనూ చూసి ఉంటారు, భార్యాభర్తలనూ చూసి ఉంటారు. నా భార్య చాలా సహృదయురాలు. ఆమె నా జీవితంలో అంతులేని సానుకూలత నింపింది. నేను చేసిన ప్రయాణాలన్నీ, ఆమె సపోర్ట్ లేకపోతే సాధ్యమయ్యేవే కాదు. మా పెద్దబ్బాయి ధనుష్ పది చదువుతున్నాడు. తనకు రోబోటిక్స్ అంటే ఇష్టం. చిన్నవాడు అంకుశ్, సైంటిఫిక్ గై. లాజికల్ గా ఆలోచిస్తాడు. వాళ్లిద్దరూ నా మెంటార్స్ కూడా! వాళ్లు నాకు జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో నేర్పుతున్నారు.
నా చిన్నతనం అంతా శ్రీకాకుళం జిల్లాలో తులగాం అనే ఊరిలో గడిచింది. నాన్నగారు పౌరాణిక ఆర్టిస్టు… చంద్రశేఖర నాయుడు గారు. ఆయన నుంచే నాకు సంగీతం అబ్బింది. ఆయనతో కలిసి నాటకాలు వేసేవారం. వాటిలో భాగంగా సంగీతాన్ని కూడా నిభాయించాల్సి వచ్చేది. అలా నాటకాలు, సంగీతంలో కెరీర్ ప్రారంభం అయింది. కానీ సినిమాల్లో పాడాలనే ఆశ మాత్రం అప్పట్లో ఉండేది కాదు. నేను పాడేది విని, అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఇంకా బాగా పాడాలి అనుకునేవాడిని. అంతే! మా చిన్నాన్న కూడా సురభిలో ఉండేవారు కాబట్టి ఆయన ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది.
చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక కూడా సామాజిక నాటకాలు వేసేవారం. ఆ సమయంలో లీలారాణి అనే నటితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించాను. మా జిల్లా మొత్తానికీ స్టేజి మీద పాటలు పాడటం మొదలుపెట్టింది మేమే. వాటిని పుస్తకాలుగా కూడా రిలీజ్ చేసేవారు. ఏ ఊళ్లో చూసినా, అవి విపరీతంగా అమ్ముడుపోయేవి!
ఓసారి ఏదో నాటకంలో, ఓ బాధాకరమైన పాట పాడుతూ ఉంటే, బండారు చిట్టిబాబు అనే గొప్ప హార్మోనిస్టు విన్నారు. నా గాత్రం నచ్చి నన్ను తన బృందంలో చేర్చుకున్నారు. నేను ప్రత్యేకించి ఘంటసాలగారి పాటలను ఎక్కువగా పాడేవాడిని. నేను ఆయన పాటలు పాడుతుంటే మంచి స్పందన వచ్చేది. ఎక్కడ అలాంటి కార్యక్రమం నిర్వహించినా వేల మంది వచ్చేవారు.
తొలి అవకాశం!
నేను ఓ పాటల పోటీలో పాల్గొన్నప్పుడు, దానికి కె.వి.మహదేవన్, బాలుగార్లు న్యాయనిర్ణేతలుగా వచ్చారు. ఆ పోటీలో నాకు మొదటి బహుమతి రావడంతో నేను బాగానే పాడుతున్నాను అనే ధైర్యం, ఆశ కలిగాయి. పైగా మహదేవన్ గారు ఎప్పుడైనా మద్రాసుకు వస్తే నన్ను కలవమని చెప్పి వెళ్లారు. ఆ ధైర్యంతోనే చెన్నైకి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించాను. పండంటి కాపురంలో తొలి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు… ఘంటసాల, సుశీల, బాలు గార్లతో పాటు నా పేరు పడటం చూసి పొంగిపోయాను.
అదేసమయంలో ఓసారి చంద్రమోహన్ గారి ఇంట్లో పాటలు పాడుతుంటూ… అటునుంచి వెళ్తున్న నవత కృష్టంరాజు గారు విని తన ఆఫీసుకు పిలిపించారు. ఒక ట్యూన్ ఇచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గరకు పంపారు. ఆయన దగ్గర కూర్చుని పాట రాయించుకుంటే… ‘నువ్వు నాతో ఒక మంచి పాట రాయించావు కాబట్టి నేను నీకో మంచి పాటను ఇస్తాను’ అని చెప్పడమే కాకుండా కె.వి.మహదేవన్ గారికి నన్ను సిఫార్సు చేశారు. అలా క్రమంగా నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగని నా ప్రయాణం అంత తేలికగా జరగలేదు. ఘంటసాల, బాలు గార్లు బాగా ప్రాచుర్యంలో ఉన్న సమయంలో సినీరంగంలోకి ప్రవేశించాను కాబట్టి… నిలదొక్కుకోవడం చాలా కష్టమైపోయింది.
అదృష్టవశాత్తు నేను పాడిన పాటలు తక్కువే అయినా… అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ‘ఒక వేణువు వినిపించెను’ లాంటి మంచి పాటలెన్నో పాడే అవకాశం వచ్చింది. ఒక వేణువు పాట పాడేటప్పుడు మ్యూజిక్ డైరక్టర్ వెంకటేష్ గారు ‘ఇది నీ జీవితమే మార్చేస్తుంది’ అని చెబితే నమ్మలేదు కానీ నిజంగానే అది నాకు చాలా మంచి పేరు తీసుకువచ్చింది.
మొదట్లో నా మీద ఘంటసాల గారి ప్రభావం బాగా ఉండేది. ఆ విషయం గమనించిన సంగీత దర్శకుడు సత్యం గారు ‘ఆయనను అనుకరించకుండా… నా సొంత గొంతుకలో ప్రయత్నించమని’ సూచించారు. అప్పటి నుంచి నా సొంత బాణీలో పాడే ప్రయత్నం చేశాను. దాంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి! చక్రవర్తి గారు నాతో ఎన్నో పాటలు పాడించారు. మరీ ముఖ్యంగా మురళిమోహన్ కు నాతో పాడించేవారు. అలాగే బాలుగారు నేను కలిసి ఎన్నో పాటలు పాడాం! అప్పట్లో ఇద్దరూ కలిసి పాడే ద్విగళ గీతాలు వచ్చినప్పుడు… తప్పకుండా వాటిని నేను బాలు గారు కలిసి పాడేవారం.
స్వరమాధురి
నేను అక్కడక్కడా పాడుతూ ఉన్న సమయంలో స్థిరంగా నిలదొక్కుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆర్కెస్ట్రా ప్రారంభించాను. ఆర్కెస్ట్రా స్థాపన వెనకాల మేము ఆర్థికంగా బలపడాలనే ఆలోచనే కాదు, కొత్త తరాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యం కూడా ఉంది. మేం పడ్డ బాధలు వారు పడకూడదన్నది మా తపన. అలా మద్రాసుకు ఎవరు కొత్త గాయకులు వచ్చినా, నా దగ్గరకే చేరుకునేవారు. నా దగ్గర సాధన చేయడం, అవకాశం వచ్చినప్పుడల్లా కచేరీలు చేయడం… అక్కడి నుంచి అవకాశాలు అందుకోవడం జరిగేది. అలా నా ఆర్కెస్ట్రాలో పాడినవారు చాలామంది గొప్పవారయ్యారు.
నా అర్కెస్ట్రా తరఫున ఇప్పటికి ఏడు వేలకు పైగా కార్యక్రమాలు చేశాను. కొన్ని వందలమంది గాయకులు, కళాకారులు మా దగ్గర పనిచేశారు అని గర్వంగా చెప్పుకుంటాను. అంతేకాదు! అభిరుచి ఉన్నవారు స్వయంగా పాడుకునేందుకు, కేవలం బాణీలు మాత్రమే నేపధ్యంలో వినిపించేలా ‘పాడాలని ఉంటే పాడుకోండి’ పేరుతో ట్రాక్స్ తో సీడీలు విడుదల చేశాము.
1991 విశాఖపట్నంలో నా 3,000 వ కార్యక్రమం చేసినప్పుడు… ఆటా షికాగోలో కార్యక్రమం చేయమంటూ ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను. కొన్నాళ్లకు తానా వాళ్లూ కూడా ప్రముఖ గాయకులు సుశీల, లీల, జిక్కి, మాధవపెద్ది వంటి పెద్దలందరితో ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు. ఒకే కార్యక్రమం అనుకుని బయల్దేరిన మేము అసాధారణమైన స్పందన రావడంతో హుస్టన్, డల్లాస్, వాషింగ్టన్ వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టుముడుతూ 30 రోజుల పాటు 30 కార్యక్రమాలు చేశాము.
డబ్బిండ్ డైరక్టర్!
నేరుగా గాంధీ నెంబరు రెండవ వీధి వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం చేయడమే కాకుండా… హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల నుంచి అనువాదమైన నూరు వరకు చిత్రాలకు సంగీత నిర్వహణ చేశాను. హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై లాంటి ఎన్నో అనువాద చిత్రాలకు పనిచేశాను.
నేను నేర్చుకున్నది!
అప్పట్లో పాట ముందే రాశాక స్వరకల్పన జరిగేది. కె.వి. మహదేవన్ గారు అలా చేసేవారు కాబట్టి, మూగమనసులు లాంటి మనసుకు హత్తుకుపోయే పాటలు అందించారు. తనకు భాష రాకపోయినా సరే… భావం తెలుసుకుని మరీ ట్యూన్ కట్టేవారు. సంగీత ప్రపంచంలో మహామహుల దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే… క్రమశిక్షణతో ఉండాలి, అందుకున్న పాటను సాధన చేయాలి, దాన్ని సొంతం చేసుకోవాలి, శృతిబద్ధంగా పాడాలి. స్టేజి మీద పాడటం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక పాట మన చేతికి వచ్చినప్పుడు దాన్ని రచయిత ఏ భావంతో రాశాడు, దర్శకుడు ఏ సందర్భంలో దాన్ని ఉపయోగిస్తున్నాడు అని తెలుసుకుని పాడితే ఎవరైనా మంచి గాయకులు కావచ్చు.
కొన్ని స్వరాలు రికార్డింగుకు నప్పవు. అందరూ గాయకులుగా కీర్తిని గడించలేరు. పైగా ఇప్పుడు వందలాది మంది గాయకులు వచ్చేశారు. వారితో పోటీపడి ఒకటీ, అరా అవకాశాలు దక్కించుకుంటే సరిపోదు. కాబట్టి ఇతర వ్యాపకాలను కొనసాగిస్తూనే ఈ రంగంలో రాణించే ప్రయత్నం చేయాలి. ఈ రంగంలో అపజయాలు రావడం, అవకాశాలు చేజారడం చాలా సహజం. అలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. వాటిని చాలా తేలికగా తీసుకోగలగాలి!
చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ రోజుకో కథ చెప్పిపడుకోబెట్టేది. పిల్లలు కథ చెపితే ఊ కొట్టి నిద్రపోయేవారు. కానీ నేను అలా కాదు… ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అనేవాడిని. అప్పుడు అమ్మమ్మ ఆ కథను ఓ పాటలా పాడి వినిపించేది. అది నాకు బాగా నచ్చేది. అప్పటి నుంచి నేను కూడా కథలను పాటల్లా చెప్పేందుకు ప్రయత్నించేవాడిని. ఇది నాకు చాలా సరదాగా ఉండేది.. అలా పాటలపై ప్రేమ పుట్టింది.
సైకిల్పై పాటల ప్రయాణం.
ఇంజినీరింగ్ అమలాపురంలో చదివాను. అప్పుడు 8 కి. మీ సైకిల్ పైనే వెళ్లే వాడిని. దారిలో అలసట తెలియకుండా సొంతంగా పాటలు సృష్టించుకుని, పాడుకుంటూ వెళ్లే వాడిని. అప్పుడే అనుకున్నాను… పాట మనకు ఇష్టం కదా! దాన్నే బతుకు తెరువుగా ఎందుకు ఎంచుకోకూడదు అని! చిన్నప్పటి నుంచి మా ఊళ్లో వాతావరణం కూడా అలా ఉండేది. గుడిలో పాటలు వస్తుండేవి, పొలాల్లో కూడా పనులు చేసేవారు పాటలు పాడుకునేవారు. అవి కూడా నాకు స్ఫూర్తి నిచ్చాయి.
నా జీవితాన్ని మార్చిన సిరివెన్నెల పాట
నాకు చిన్నప్పటి నుంచి బయాలజీ అంటే ఇష్టం. డాక్టర్ అవ్వాలని ఉండేది. నాన్నేమో అంత డబ్బు పెట్టలేనని చెప్పారు. అందుకే నన్ను ఇంటర్ ఎంపీసీలో చేర్చారు. అది నాకు అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఇంటర్లో ఉన్నప్పుడు సిరివెన్నెల గారి పాట ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాట విన్నా. ఆ పాట నన్ను చాలా కదిలించింది. ఆ పాట విన్న రోజు నాకు నిద్ర పట్టలేదు. అప్పటి వరకూ నాకు పాట అంటే, ఏదో ఇష్టం కొద్ది పాడుకునేదే అన్న ఆలోచన ఉండేది. కానీ ఓ పాట కొందరి మనస్సులను మారుస్తుందని ఆ రోజు నేను గ్రహించా! ఆ పాట విన్న తర్వాత పాటలు రాయడమే నా భవిష్యత్ అవుతుందన్న ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి రాయడాన్ని మరింత బాగా ఇష్టపడ్డాను.
నా జీవితంలో ‘జోష్’ వచ్చింది
ఇంజినీరింగ్లో ఉన్నప్పుడు రూ.150 లతో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. దాన్ని అనేక పోటీలకు పంపాను. అది అన్ని పోటీల్లోనూ మొదటి బహుమతులు గెలుచుకుంది. దాంతో నామీద నాకు నమ్మకం వచ్చింది. నాలో కూడా విషయం ఉందని నేను నమ్మడం ప్రారంభించాను. సినిమాను ఓ కేరీర్గా తీసుకోవచ్చని అనిపించింది. నేను విశాఖలో ఇంజినీరింగ్ ఫైనలియర్లో ఉన్నప్పుడు జోష్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం టీమ్ విశాఖ వచ్చింది. మా స్నేహితులు వెళ్తుంటే నేనూ వెళ్లాను. అక్కడ సినిమాలపై ఆసక్తి ఉన్నవాళ్లు మాట్లాడొచ్చు అన్నారు. నేను స్టేజ్పైకి వెళ్లాను. అదే వేదికపై దిల్ రాజు, వాసువర్మ ఉన్నారని నాకు తెలియదు. విశాఖ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా జోష్ టీమ్ పోటీలు నిర్వహించింది. అన్ని చోట్ల బాగా మాట్లాడిన వారిని హైదరాబాద్ పిలిపిస్తామన్నారు. వాళ్లు అన్నట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా బాగా మాట్లాడిన 80 మందిని హైదరాబాద్ పిలిపించారు. అందులో నేనూ ఉన్నా. ఆ 80 మందికి మళ్లీ పోటీలు నిర్వహించి నాతో పాటు ఐదుగురిని సెలక్ట్ చేశారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతి కూడా ఇచ్చారు. అప్పుడే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే చెప్పొచ్చన్నారు. నేను నా పాటలు చూపించాను. అది చూసి దర్శకుడు ఆశ్చర్యపోయారు. ఓ సినిమా పాటల రచయతకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని మెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వస్తే మంచి పాటల రచయితవు అవుతావని స్టేజీపైనే అందరి ముందు చెప్పారు. అది నా ధైర్యాన్ని మరింత పెంచింది.
గూగుల్కు గుడ్బై.. పాటలకు సైసై..
ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఓ రెండేళ్లు గూగుల్ సంస్థలో పని చేశాను.. కానీ.. పాటల రచయిత కావాలన్న కోరిక కుదురుగా ఉండనివ్వలేదు. మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన నీ మనస్సుకు నచ్చిన పని చేయమన్నారు. 40-50 ఏళ్లు వచ్చాక నేను అలా చేసి ఉంటే బావుండేది అని భవిష్యత్తులో అనుకోకూడదు. నీకు నచ్చింది చెయ్యి అన్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా నీ కాళ్లపై నువ్వు నిలబడేలా ఏ పనైనా సరే చేయమన్నారు. కాకపోతే… నన్ను డబ్బు అడగొద్దు. ఎవరినీ మోసం చేయొద్దు అంటూ షరతులు పెట్టారు! 2012 మే 11 న గూగుల్ వదలాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగంలో సంపాదించిన సొమ్ము, పీఎఫ్ సొమ్ము అన్నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకుని. కచ్చితంగా నెలకు ఇంతే ఖర్చు చేయాలని నిర్ణయించుకుని నా లక్ష్య సాధనవైపు అడుగులు వేశా.
విజయమే లక్ష్యం కాదు… ప్రయాణం ముఖ్యం!
జీవితంలో ఎప్పుడూ విజయాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లకూడదు. మనం చేస్తున్న పనిని మనం ఎంత బాగా ఆనందిస్తున్నామనేది ముఖ్యం. ఓ రైతు ఆకాశాన్ని నమ్ముకుని భూమిలో విత్తనాలు వేస్తాడు. వర్షం కురవకపోతే, దానిపైకి రాళ్లు విసరలేడు కదా. అలా విసిరితే అవి తిరిగి తనపైనే పడతాయి. అందుకే. మళ్లీ వర్షం వచ్చే వరకూ ఎదురు చూడటమే రైతు పని. వర్షాన్ని నమ్ముకుని ముందుకు సాగడమే. అలాగే మనం కూడా మనలోని శక్తిని నమ్ముకుని ముందుకు సాగడమే. విజయం ప్రయాణంలో ఓ మజిలీ మాత్రమే. ఓ వ్యక్తి తనపై నమ్మకం పెట్టుకుని పని చేస్తుంటే, తనలో ఎంత సత్తా ఉందనేది తనకే తెలిసిపోతుంటుంది. ప్రతి వ్యక్తికి స్వీయ మదింపు చాలా అవసరం. అదే సమయంలో మన చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేకపోతే, అది ఫలించదు. స్వీయ మధింపు, చిత్తశుద్ధి లేకపోతే విజయం సాధించలేం. వనరులు లేకపోవడం కూడా కొంతమందికి సమస్యగా మారుతుంది. కానీ ఎక్కడో ఓ చోట జీవితం మనకు ఓ అవకాశం ఇస్తుంది.
ఆ రోడ్డు ప్రమాదం నా దృక్పథం మార్చింది..
ఓ సినిమాకు పాటలు రాశాక నిర్మాత డబ్బులిస్తాను షూటింగ్ స్పాట్కు రమ్మన్నారు. అప్పుడు నా జేబులో కేవలం పాతిక రూపాయలే ఉన్నాయి. షూటింగ్ దగ్గరకు వెళ్లి సాయంత్రం వరకూ ఎదరుచూశా. నాకు డబ్బు ఇవ్వకుండానే నిర్మాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ఆ విషయం తెలిసి చాలా కోపం వచ్చింది. తిరిగి రూమ్కు వెళ్దామని బస్టాప్కు నడుచుకుంటూ వస్తున్నా. సరిగ్గా టికెట్కు సరిపడా మాత్రమే డబ్బులున్నాయి.. ఇంతలో కాలి చెప్పు తెగింది. నాకు జీవితంపై చాలా నిస్పృహ కలిగింది.
అదే సమయంలో నా ముందు వెళ్తున్న ఓ బైక్ను లారీ గుద్దేసింది.. బైక్ మీద భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, ఓ కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. భార్య కాలు విరిగింది. చిన్నబాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఆ మహిళ అలాంటి సమయంలోనూ ఆ చిన్నబాబుకు పాలు పట్టించింది. ఆ దృశ్యం నాకు జీవితాన్ని కొత్తగా పరిచయం చేసింది. ఆమె జీవితం పావుగంటలోనే తలకిందులైంది. అయినా నిబ్బరంగానే ఉంది. ఆమెకు వేరే ఆప్షన్ లేదు. కానీ నాకు చాలా ఉన్నాయి కదా అనిపించింది. మనం విజయం సాధించినప్పుడు మనకన్నా పై వాళ్లతో పోల్చుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనకన్నా కింద వాళ్లతో పోల్చుకోవాలి!
నా మిత్రులే నాకు కొండంత ఆస్తి
నాకు మునిపల్లి మహర్షి, అభిషేక్ మహర్షి అనే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మునిపల్లి మహర్షి 8వ తరగతి నుంచి నా క్లాస్మేట్. టీసీఎస్లో జాబ్ చేసేవాడు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు భరోసా ఇచ్చాడు. నువ్వు సినీరంగంలో స్థిరపడేవరకూ నేను నెలకు రూ. 5000 ఇస్తాను. కావాలంటే నువ్వు విజయం సాధించాక ఆ మొత్తం వెనక్కు ఇవ్వు అని చెప్పాడు. ఉచితంగా ఇస్తే నేను తీసుకోనని వాడికి తెలుసు. ఇక అభిషేక్ మహర్షితో రూమ్ లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా జేబులో రోజూ ఓ వంద రూపాయల నోటు పెట్టేవాడు. ఆ తర్వాత వాడు నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఓ మూడేళ్లు నేను వాళ్ల ఇంట్లోనే పేయింగ్ గెస్ట్లా ఉన్నా. నేను అక్కడ ఉన్నప్పుడే గుర్తింపు రావడం మొదలైంది. నాకు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి. ఇలాంటి మిత్రుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. జీవితంలో డబ్బు ఉండటం ప్రధానం కాదు. మంచి మిత్రులు ఉండటం కూడా చాలా ముఖ్యం.
నిర్మాతకు కావాల్సింది రాసినవాడే గొప్ప రచయిత..
సినీరంగంలో నేను చాలా గొప్పగా రాశాననుకున్న పాటలు కూడా చాలాసార్లు తిరస్కరించేవారు. ఇది కాదు మాకు కావాల్సింది అనే వారు. ఆ తర్వాత ఎందుకిలా జరగుతుందా అని ఆలోచిస్తే అసలు విషయం అర్థమైంది. నిర్మాతకు తన కథకు తగిన స్థాయిలో రచయిత రాయాలి. అంతకు మించి అద్భుతంగా రాసినా ఉపయోగం ఉండదు. ఇల్లు కావాలంటే ఇల్లే కట్టుకోవాలి. తాజ్మహాల్ కాదు. మనకు ఓ బల్ల కావాలనుకుంటే కార్పెంటర్ బల్లే చేయాలి. అంతే కానీ కళాఖండం చేసి ఇది బాగానే ఉంది కదా వాడుకో అంటే వాడుకుంటామా! ఇదీ అంతే. ఈ విషయం గ్రహిస్తే తిరస్కరించబడ్డామనే ఫీలింగ్ ఉండదు.
నువ్వు మాట్లాడొద్దు.. నీ పనే మాట్లాడాలి..
సినీరంగంలో మీ పనే మట్లాడుతుంది. అన్ని విషయాలు, రూమర్లు పట్టించుకోవద్దు. ఎన్నో జరగుతుంటాయి, ఎన్నో అంటారు. అవి ఏవీ పట్టించుకోవద్దు! సినీరంగంలో సముద్రంలో నూనె బొట్టులా ఉండాలి. ఎంత సైలంట్ గా ఉంటే అంత బావుంటుంది. నాకు పనే దేవుడు అనుకున్నవాడే సినీరంగంలో నిలదొక్కుకుంటాడు. జీవితంలో మనం అనుకున్నది ఎప్పుడూ కాదు. ఫలితాన్ని ఊహించుకుంటూ పని చేయకూడదు. ఫలితం అది రావాల్సిందే. ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నా, అది జరగదు. కాబట్టి ఫెయిల్యూర్కు సిద్దపడి ఉండాలి!
అలాంటి పాట రాయాలని ఉంది
సినీ రంగంలోకి రావాలంటే ఫైనాన్సియల్ బ్యాకప్ ఉండాలి. రెండు, మూడు ఏళ్లకు సరిపడా ఆర్థిక వనరులు ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. ఇలా ఉంటే ధైర్యంగా ప్రయత్నాలు చేయవచ్చు. నా తల్లిదండ్రులు నన్ను తలచుకుంటే… మంచి కొడుకునే కన్నాం అని ఫీలవ్వాలి. అదే నా లక్ష్యం. ఇక పాటల విషయానికి వస్తే, ఎప్పటికైనా ఓ మంచి ఓ జోలపాట రాయాలని ఉంది. అది వింటే అన్ని కష్టాలు మర్చిపోయి నిద్రపోయేలా, పాట రాయాలని ఉంది.