Design a site like this with WordPress.com
Get started

రైతులకు భరోసాగా… విల్లామార్ట్!

మనదేశంలో రైతులు పడుతున్న కష్టాల గురించి, ఎదుర్కొంటున్న నష్టాల గురించి ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తోంది. కానీ ‘సామాన్యులుగా మనం చేయగలం’ అనే భావనతోనే చాలామంది ఉన్నారు. కానీ ఒడిశాకు చెందిన రమేశ్ మాత్రం ఊరికే కూర్చోలేదు. విదేశాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి, ఇక్కడి రైతుల కోసం పాటుపడుతూ వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాడు. విల్లా మార్ట్ పేరుతో రైతులు పండించిన పంటను ఎప్పటికప్పుడు తీసుకెళ్లి మొబైల్ బండిపై రాష్ట్రంలోని ఎన్నో గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. దానిద్వారా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ, పండిన పంటను వృథా కాకుండా చేస్తున్నాడు ఐఐటీయన్ రమేశ్.

2016లో రమేశ్ అమెరికాలో మెటీరియల్ సైన్స్ లో పోస్ట్ డాక్టోరియల్ స్టడీస్ చేస్తున్న సమయంలో భారతీయ రైతుల ఆత్మహత్యల వార్తలు కనిపించాయి. ఇంట్లో వాళ్లతో మాట్లాడినప్పుడు ఈ సమస్య గురించి మరింత లోతుగా తెలుసుకున్నాడు. అమెరికాలోనూ రైతులున్నారు కానీ వాళ్లు ఇన్ని చిక్కుల్లో లేరని తెలుసుకున్నాడు. దానికి కారణం మన రైతులు టెక్నాలజీని ఉపయోగించుకోకపోవడమే అనుకున్నాడు. ఇంత చదువుకుని ఏం ఉపయోగం? వాళ్లకేదైనా చేస్తేనే తనకు సంతోషం! అనిపించింది. దాంతో 2016లోనే భారతదేశానికి తిరిగి వచ్చేశాడు.

‘‘మా నాన్న కూడా రైతే. ఎన్నోకష్టాలు పడి మమ్మల్ని ఇంతస్థాయికి తీసుకొచ్చాడు. అలా రైతుల కష్టం నాకు తెలిసొచ్చింది. ఎంతోమంది రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక, బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే నా డిగ్రీలను, తెలివితేటలను నా దేశానికి ఉపయోగించాలని వచ్చేశాను. మా గ్రామంలో నాలాగే ఆలోచించే వ్యక్తులను కలిసి ఒక బృందంగా ఏర్పాటు చేశాను. రైతుల కోసం కచ్చితంగా ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాం. అయితే అది కొత్తగా, ఖర్చు తక్కువగా ఉండాలి అనుకున్నాం. అప్పడే రైతులు ఎక్కడికో వెళ్లి తమ పంటను అమ్ముకోకుండా.. మంచి గిట్టుబాటు ధరతో ఒకేదగ్గర అది కూడా తమ పొలంలో విక్రయిస్తే బాగుంటుందని అనుకున్నాం. అలా 2017లో మొదలైందే.. ‘విల్లా మార్ట్’. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు అన్నీ కొని, వాటిని గ్రామాలకు తిరుగుతూ మేము విక్రయిస్తున్నామ’’ని ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన రమేశ్ చెప్తున్నాడు.

అమెరికా మోడల్ అయిన వాల్ మార్ట్ విజయాన్ని ప్రేరణగా తీసుకుని రమేశ్ ఈ విల్లామార్ట్ ని ప్రారంభించాడు. అయితే ఆఫ్ లైన్ స్టోర్ గా పెడితే.. ప్రజలంతా అక్కడికి వచ్చే కొనాల్సి ఉంటుంది. అందుకే మొబైల్ మండిని ప్రవేశపెట్టాడు. ఒక బండిని ప్రత్యేకంగా తయారు చేయించి, ఊరూరా తిప్పుతూ కూరగాయలు, ధాన్యాలు, పండ్లను అమ్ముతోంది విల్లా మార్ట్ టీమ్. ఆయా వస్తువులను వివిధ గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు స్థిరంగా కొంటున్నారు.

మొదట 2017లో ఒకే ఒక్క వ్యాన్ తో మొదలై ఇఫ్పుడు ఏడు వ్యాన్లతో బిజినెస్ నడుస్తోంది. ప్రస్తుతం విల్లా మార్ట్ తో ఒడిశా వ్యాప్తంగా 3వేల మంది రైతులు కలిసి పని చేస్తున్నారు. అలాగే రైతుల పంటను 110 గ్రామాల్లోని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రమేశ్ AI టెక్నాలజీని ఉపయోగించి, రైతుల పంటను గ్రేడ్ల వారీగా వేరు చేసి, అవసరమైన వాటిని నిల్వ చేస్తున్నాడు. త్వరలోనే పెద్ద ఎత్తున మండి (మార్కెట్)ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రమేశ్ అంటున్నారు. గతేడాది నాలుగు కోట్ల టర్నోవర్ తో విల్లా మార్ట్ విజయవంతంగా నడిచింది. రైతుల బాగుకోసం, వాళ్ల జీవితాలను కాపాడాలన్న ఉద్దేశంతో కొత్త ఆవిష్కరణలను మొదలుపెట్టిన రమేశ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

#villamart #walmart #farmers #organicfarming #touchalife #talradio #talblogs

పిల్లల దగ్గరకే పాఠశాల

విద్య అందరి హక్కు అని అందరికీ తెలుసు. కానీ లోకంలో ఎంతమందికి ఈ విద్య అందుబాటులో ఉంటోంది? ఎంతమంది తమ పిల్లలందరికీ చదువు చెప్పించగలుగుతున్నారు? ముఖ్యంగా… కరోనా సమయంలో కాస్త ఆర్థికంగా నిలకడగా ఉన్నవాళ్లు తమ పిల్లలకు ఆన్ లైన్ ద్వారా చదువులు చెప్పించారు. కానీ ఎంతోమంది నిరుపేదలు ఆ పరిస్థితి లేక పిల్లలను చదువు మాన్పించారని నివేదికలు చెబుతున్నాయి? ఆ పిల్లలు ఇప్పటికీ బడి దారి పట్టకుండా, వివిధ పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్లందరి గురించి ఆలోచించింది బెంగళూరుకు చెందిన ‘ఆహ్వాహన్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ.

ఈ సంస్థ కర్ణాటక వ్యాప్తంగా ఎన్నోరకాల సేవా కార్యక్రమాలు చేస్తోంది. కేవలం విద్య మాత్రమే కాకుండా వైద్యం, మహిళా సాధికారత, కమ్యూనిటీ లివింగ్ మొదలైన ఎన్నో అంశాల్లో విస్తృతంగా పని చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 2023 జనవరి నుంచి అహ్వాహన్ ఫౌండేషన్ పేద విద్యార్థుల కోసం ‘ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ల ఇంటి దగ్గరికే విద్యను తీసుకెళ్లింది. అదెలాగంటారా? ఒక మొబైల్ ఇనిస్టిట్యూషన్ నే తయారు చేసి, విద్యార్థులకు చేరువవుతోంది!

ఆహ్వాహన్ సంస్థ ఇప్పటివరకు మూడు బస్సులను ప్రారంభించింది. అందులో బయోలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ మొబైల్ ఇనిస్టిట్యూట్ లో ఒక గ్రంథాలయం కూడా ఉంది. వాటిని బస్సుకు 150మీటర్ల దూరంలో ఉన్నవాళ్లంతా వచ్చి ఉపయోగించుకోవచ్చు.

చదువుతో పాటు విద్యార్థులకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తోంది ఈ సంస్థ. యూపీఎస్సీ, జేఈఈకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఆహ్వాహన్ సంస్థలో ఆరుగురు పర్మనెంట్ టీచర్లు, నలుగురు వాలంటీర్లు, ఏడెనిమిది మంది పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్లలో మాస్టర్స్ చేసిన వాళ్లతో పాటు పీహెచ్ డీ చేసిన వాళ్లూ ఉన్నారు.

‘‘ఏ మార్పు అయినా ఆలోచన నుంచే వస్తుంది. మన ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రయాణిస్తూ ఉంటాయి కదా. అందుకే నేను చేసే పని కూడా ప్రయాణించాలనే అనుకున్నాను. అలా పేద పిల్లలకు మొబైల్ ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యను అందించాలని సంకల్పించుకున్నాను. దానికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లను చేస్తున్నాను. మాతో ప్రస్తుతం 208 స్కూళ్లు కలిసి పని చేస్తున్నాయి. మా దగ్గరకు వచ్చే విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు అందించేందుకు వాళ్లు సాయం చేస్తున్నార’’ని చెబుతున్నారు ఆహ్వాహన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బ్రజా కిషోర్ ప్రధాన్.

2020లో ఈ సంస్థ ల్యాప్ టాప్ బ్యాంక్ ని ఏర్పాటు చేసింది. దాతలెవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇందులో కొత్త ల్యాప్ టాప్ లను అందించాలని ప్రధాన్ కోరుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ మొత్తం 433 ల్యాప్ టాప్స్ ని విద్యార్థులకు అందించినట్లు ఆయన చెప్తున్నారు. ఇలాంటి కొత్త, మంచి ఆలోచనలు చేస్తున్న ప్రధాన్ లాంటి వాళ్లు తప్పకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అలాగే విద్యాదానం అంత గొప్ప పని ఏదీ లేదని పెద్దలు చెప్పిన మాటను నిజం చేస్తారు.

#talradiotelugu #talradio #Aahwahan #laptopbank #education #EducationOnWheels

సామాన్యులకు అండగా… ట్విట్టర్ వారియర్!

ఎదుటి మనిషి కష్టాలను తన సొంత కష్టంలా భావించడానికి గొప్ప మనసుండాలి. అలాంటి మనసుంటే ఎవరి కష్టాన్నయినా తొలగించే మార్గముంటుంది అన్న మాటను అక్షరాలా నిజమని నిరూపిస్తున్నాడు ఒడిశాకు చెందిన ఉపేంద్ర మహానంద్. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ను ఉపయోగించుకుని, తన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల కష్టాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ప్రభుత్వం నుంచి వాళ్లకు ఏ సహాయం అందట్లేదో తెలుసుకుని, సదరు అధికారికి ఆ సమస్యను వివరిస్తూ ట్యాగ్ చేస్తుంటాడు ఉపేంద్ర. దాంతో వెంటనే ఆ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నారు. అలా డిజిటల్ యాక్టివిస్ట్ గా ఉపేంద్ర చేస్తున్న మంచి పనులు ఎన్నో ఉన్నాయి. అందువల్లే ఆయన్ని మీడియా ‘ట్విట్టర్ వారియర్’గా గుర్తిస్తోంది.

సంబల్ పూర్ జిల్లా, కినలోయ్ గ్రామపంచాయితీకి చెందిన 41 ఏళ్ల ఉపేంద్ర 2016 నుంచి ఇలా ట్విట్టర్ ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నాడు. రోజూ తన మోటార్ బండిపై నాలుగైదు గ్రామాల్లో పర్యటిస్తాడు. దారిలో కనిపించే వాళ్లను ఆపి మరీ, వాళ్ల సమస్యలేంటో తెలుసుకుంటాడు. వెంటనే వాళ్ల సమస్యకు సంబంధించిన ఫొటో, ఆ వ్యక్తి ఫొటో తీసి సదరు అధికారికి సమస్యను వివరిస్తూ ట్వీట్ చేస్తాడు. దీంతో ట్విట్టర్ ద్వారా వెంటనే ఆ అధికారి లేదా ఆ శాఖకు చెందిన ప్రముఖులు స్పందించి సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నారు.

‘‘మొదట్లో నాకు ట్విట్టర్ అంటే కూడా తెలియదు. తెలుసుకున్నాక కూడా ఎలా వాడాలో అర్థమయ్యేది కాదు. తర్వాత అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అయితే ప్రజల్లో కూడా మొదట్లో నా మీద నమ్మకం లేదు. నేను వాళ్లకోసం నిజంగానే పని చేస్తానా లేదా అని సంకోచించారు. ఒకటి, రెండు కేసుల్లో పరిష్కారం లభించాక నన్ను నమ్మడం ప్రారంభించారు. అందుకే పలకరించిన వాళ్లంతా నాకు వాళ్ల సమస్యలను నిర్మొహమాటంగా చెప్తారు. వాళ్ల ఇంట్లో బిడ్డలాగా నాతో మాట్లాడతారు. మొదట మా ఊరు, పక్క ఊళ్లో వాళ్లకే నా పేరు తెలుసు. కానీ ఇప్పుడు చాలా గ్రామాల్లో, ఇతర జిల్లాల్లో కూడా నన్ను గుర్తుపడతారు. నేనూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అందుకే నాకు పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని కష్టసుఖాలన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి పక్కవాళ్లు కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోయేవాణ్ని. అందుకే నేను ఈ పనిని ఎంచుకుని ఇందులో ఎంతో సంతృప్తిని పొందుతున్నాను’’ అంటారు ఉపేంద్ర.

పేదలకు రేషన్ కార్డులు, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్.. ఇలా ఎవరికి ఏది అందకపోయినా, ఉపేంద్ర వెంటనే వీళ్లకు సంబంధించిన వివరాలు, సమస్యను సంబంధిత అధికారికి ట్విట్టర్ ద్వారా తెలియపరుస్తాడు. ఆఫీసుల చుట్టూ తిరిగినా దొరకని పరిష్కారం, ఉపేంద్ర ట్వీట్ల వల్ల అందుతోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘‘కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రజలు, అధికారులు సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ట్విట్లర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. నేను పోస్ట్ పెట్టిన కొంత సమయానికే స్పందించడం నాలో మరింత ఉత్సాహాన్ని అందిస్తోంది. నా ద్వారా ప్రజలు ఎంతోకొంత సంతోషపడ్డా అది నాకు చెప్పలేనంత ఆనందాన్ని అందిస్తోంద’’ని ఉపేంద్ర అంటున్నారు. సాయం చేసే గుణం ఉంటే, ఏవిధంగానైనా మనవల్ల అవతలివాళ్ల కష్టం తీరుతుందని ఉపేంద్రను చూసి అర్థం చేసుకోవచ్చు.

#tweet #twitter #twitterwarrior #touchalife #talradio

వేల మంది మహిళల కోసం… ఏక్ తారా!

నగరాల్లో ఉండే పిల్లలకేంటి? తల్లిదండ్రలు ఉద్యోగాలు చేస్తుంటారు.. పిల్లల్ని మంచి బడిలో చదివిస్తారు అనుకుంటారు చాలామంది. అదే నగరాల్లో ఉండే మురికివాడల గురించి చాలా కొద్దిమందే ఆలోచిస్తారు. అలాంటి మురికివాడల్లో ఉండే ఆడపిల్లలకు విద్యను అందించాలన్న మంచి ఉద్దేశంతో ముందుకొచ్చింది కోల్ కత్తాకు చెందిన ఏక్ తారా అనే స్వచ్ఛంద సంస్థ. 2011లో అంటే పన్నెండేళ్ల క్రితం మొదలైన ఈ సంస్థ ఇప్పుడు వేలమంది ఆడపిల్లలకు కొత్త జీవితాలను అందిస్తోంది.

నాణ్యమైన విద్యతో పాటు జీవనోపాధికి ఉపయోగపడే ఎన్నో అంశాల్లో శిక్షణ ఇస్తోంది ఏక్ తారా. అలాగే కోల్ కత్తా లోని పేద మహిళలకు జీవనోపాధి కల్పించడం కూడా బాధ్యతగా తీసుకుంది. సరాఫ్, సురేఖ అనే ఇద్దరు మహిళలు కలిసి స్థాపించిన ఈ ఎన్జీఓ వేలమంది ఆడపిల్లలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ సంస్థను ప్రారంభించక ముందు వీళ్లిద్దరూ స్లమ్ముల్లోని పిల్లలకు చదువు చెప్తూ, వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవాళ్లు. ఆ సమయంలో మురికివాడల్లో వాళ్లు దగ్గరుండి చూసిన ఎన్నో సంఘటనల కారణంగా, సంస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉంటుందని, తద్వారా మంచి జీవితం గడిపేందుకు బోలెడన్ని అవకాశాలు వస్తాయని వీళ్లిద్దరూ బలంగా నమ్ముతారు.

మురికివాడల్లోని ఆడపిల్లలకు చదువు నేర్పించాలి, అందులోనూ ఇంగ్లిష్ మీడియంలో వాళ్లను చదివించాలన్న ఆశయంతో ముందుకొచ్చిందీ సంస్థ. ఏక్ తారా మురికివాడల్లోని పిల్లలకు కేవలం చదువునే కాదు… సంగీతం, నృత్యం, పెయింటింగ్, ఆత్మరక్షణ మొదలైన అన్ని కళల్లోనూ వివిధ సంస్థలతో కలిసి శిక్షణ ఇస్తోంది. అలాగే విద్యను కేవలం పాఠ్యపుస్తకాల లోంచే కాదు, అంతకు మించి అన్న రీతిలో పలు వర్క్ షాపులు నిర్వహించి వాళ్లలో జ్ఞానాన్ని పెంచుతోంది. ప్రతి ఏడాది వందమంది పిల్లలను స్విమ్మింగ్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ మొదలైన వాటిలో ఎన్ రోల్ చేయిస్తోంది కూడా. అలాగే ఏక్ తారా వ్యవస్థాపకులు ఎప్పటికప్పుడు వివిధ సంస్థలతో అనుసంధానమై వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇలా భాగస్వాములు, స్వచ్ఛంద కార్యకర్తల ప్రోత్సాహంతో పెన్ పాల్ క్లబ్, నేచర్ క్లబ్, సివిక్ లిటరసీ కల్బ్ ఏర్పాటు చేశారు.

మాంటెసోరీ నుంచి ప్రాథమికోన్నత విద్య వరకు మొత్తం 2500 మంది ఆడపిల్లల విద్య కోసం ఏక్ తారా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడాదికేడాది తమ కార్యక్రమాలను, విస్తృతిని పెంచుకుంటూ పోతోంది. అలాగే ఏక్ తారా కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు కృషి చేస్తోంది. స్లమ్ముల్లో ఉన్న మహిళలందరితో దీన్ని నడిపించాలని, తర్వారా వాళ్లకు ఆదాయం, జీవనాధారం దొరుకుతుందని ఏక్ తారా వ్యవస్థాపకులు చెబుతున్నారు.

#talradiotelugu #touchalife #ektara #betipadhao #girleducation #talradio

ప్రాణాంతక సవాళ్లను దాటి… అడుగు ముందుకు!

జీవితంలో ఏదో సాధించాలని అందరూ అనుకుంటారు. దానికోసం తమవంతుగా ప్రయత్నాలూ చేస్తుంటారు. కానీ అనుకోకుండా ఎదురయ్యే ఆటంకాలు, అడ్డంకుల కారణంగా ఆశయాలకు దూరమవుతారు. మానసికంగా కుంగిపోయి ఎలాంటి ఆశలు, ఇష్టాలు, సంతోషాలు లేకుండా జీవితాన్ని యాంత్రికంగా కొనసాగిస్తుంటారు. అలాంటివాళ్లు కచ్చితంగా ముంబైకి చెందిన 43 ఏళ్ల హంస రంఘ్వాణి గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా దేనికీ భయపడకుండా అనుకున్నది చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

మేకప్ ఆర్టిస్టుగా రాణిస్తున్న హంస తన రోజువారీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతుండేది. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే, 24 గంటలూ పని ఉండేది. కాలం ఇలా సాగుతుండగా ఆరోగ్యపరంగా కొంత అస్వస్థతకు లోనయింది హంస. తరచూ బాత్రూమ్ కి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపు దగ్గర బరువు పెరగడం మాత్రం గమనిస్తూ వచ్చింది. కొన్ని పరీక్షల తర్వాత ఎంఆర్ఐ తప్పనిసరిగా చేయాల్సిందేనని డాక్టర్లు సూచించారు. అప్పుడు అందులో హంసకు క్యాన్సర్ అని, అది కూడా నాలుగో దశలో ఉందని నిర్ధారణ అయింది.

‘‘2002, మార్చి 22న నాకు కేన్సర్ అని బయటపడింది. కచ్చితంగా కీమోథెరపీ చేయించుకోవాలని డాక్టర్లు అన్నారు. మొదట ఆ వార్త వినగానే షాకయ్యాను. నెల తర్వాత హాస్పిటల్లో చేరి, మొదటిసారి కీమోథెరపీ చేయించుకున్నాను. ఇలా జరుగుతున్న క్రమంలో, సెప్టెంబర్ నెలలో ఆ కేన్సర్ అండాశయానికీ పాకిందని చెప్పారు డాక్టర్లు. సర్జరీ చేసి, ఆ ట్యూమర్ ని తొలగించాల్సిందేనని, అది కూడా నాలుగు రోజుల్లోనేనని తేల్చి చెప్పారు. నా కుటుంబ సభ్యులు అందించిన ధైర్యంతో సర్జరీ చేయించుకునేందుకు ఒప్పుకున్నాన’’ని హంస చెబుతోంది.

ఆ నాలుగు రోజుల్లో హంస, ఆమె కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురైంది. కడుపు నొప్పి ఎక్కువవ్వడంతో నిమిషం కూడా సరిగా నిల్చోలేకపోయింది. అక్టోబర్ 22న సర్జరీ జరిగింది. హంస శరీరంలోని ఆరు అవయవాలను డాక్టర్లు తొలగించాల్సి వచ్చింది. అండాశయాలు, గర్భాశయం, కోలన్, గాల్ బ్లాడర్, అప్పెండిక్స్ , ఆమెంటమ్ తో పాటు కాలేయంలోని కొంతభాగాన్ని తీసేశారు. ఈ సర్జరీ పూర్తవ్వడానికి ఎనిమిది గంటలు పట్టిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇంతపెద్ద సర్జరీ చేయించుకున్నా, కేన్సర్ కారణంగా ఇన్ని అవయవాలను తీయించుకున్నా… ఆమె ప్రస్తుతం ఎంతో మనోధైర్యంతో జీవితాన్ని కొనసాగిస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ గా ఎన్నోప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇలాంటి వాళ్ల గురించి తెలుసుకుని.. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందడుగు వేయగలరు. మనోధైర్యంతో సగర్వంగా, సంతోషంగా తమ లక్ష్యాలను చేరుకోగలరు.

#touchalife #talradio #talblogs #confidence #challenges

ఆ ఊరికి బస్సొచ్చింది… చదువు తెచ్చింది!

సమాజంలో ఇప్పటికీ ఆడ, మగ అనే వివక్ష ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వివక్షను దూరం చేయగల పెద్ద ఆయుధం ‘విద్య’. ఎప్పుడైతే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలూ పెద్ద చదువులు పూర్తి చేస్తారో అప్పుడు అందరూ సమాన గౌరవాన్ని పొందగలుగుతారు. అయితే చాలాచోట్ల అమ్మాయిలు చదువుకోవడానికి అన్ని సదుపాయాలు లేవు. అలా హర్యానాలోని కర్నల్ జిల్లాలోని దేవిపూర్ గ్రామానికి ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదు. దాంతో చాలామంది ఆడపిల్లలు దూర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు వెళ్లలేక పై చదువులను కొనసాగించట్లేదు. కానీ చదవుకోవాలన్న పట్టుదలతో ఆ ఆడపిల్లల చూపిన చొరవ ఇప్పుడు ఆ ఊరికి బస్సు సౌకర్యం వచ్చేలా చేసింది.

చాలాఏళ్లుగా కొనసాగుతున్న వివక్షతో ఆడపిల్లల చదువు ఎప్పుడూ వెనకబడే ఉంది. అందులోనూ గ్రామాలకు బస్సు సదుపాయం లేక తల్లిదండ్రులు ఆడపిల్లల్ని వేరే ఊళ్లకు పంపించే ధైర్యం చేయడంలేదు. కానీ దేవిపూర్ గ్రామానికి చెందిన ఆడపిల్లలు గతేడాది మే 24న తమ ఊరికి బస్సు సర్వీస్ అందించాలని ఏకంగా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ జస్బీర్ కౌర్ కు ఉత్తరం రాశారు. బస్పు లేకపోవడం వల్ల తమ గ్రామంలోని ఆడపిల్లల చదువు మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తోందని ఆ లేఖలో వాపోయారు.
తమ ఊరికి కనుక బస్సులు నడిపిస్తే, తమ గ్రామంలోని ఆడపిల్లలంతా డిగ్రీ దాకా చదివే అవకాశం ఉందని రాశారు. అంతేకాదు, ‘‘మాకు చదువుకునే అవకాశాలు కల్పించకపోతే, మేము కంటున్న కలలను ఎలా నెరవేర్చుకోగలం’’ అంటూ రాసిన వ్యాఖ్యాలు సీజేఎం మనసును తాకాయి. లేఖ రాసిన కొద్దిరోజులకే దేవిపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లభించింది. ఇక ఆడపిల్లలందరూ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అలాగే ఆ గ్రామంలో పిల్లల కోసం ఒక ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు సీజేఎం జస్బీర్ కౌర్. దాంతోపాటు అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో పీసీఆర్ పోలీస్ సర్వీస్ ప్యాట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

‘‘ఆడపిల్లలు రాసిన లేఖ నన్ను ఎంతో కదిలించింది. చదువుకోవాలన్న వారి సంకల్పం నాకెంతో నచ్చింది. అయినా చదువుకోవడం రాజ్యాంగం మనందరి హక్కు. అందుకే అక్కడి ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లేందుకు వీలుగా బస్సు సర్వీస్ అందించాం. రోజుకు రెండుసార్లు ఆ గ్రామానికి బస్సు వెళ్లి వస్తుంది. నేను చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. ఏ ఆడపిల్ల నుంచీ చదువుకునే హక్కును లాక్కోవద్ద’’ని చెబుతున్నారు జస్బీర్ కౌర్.

దేవిపూర్ ఆడపిల్లలు ఇలా ధైర్యంగా అధికారులకు లేఖ రాసేందుకు ప్రోత్సహించింది ‘అడ్వకసీ ఇన్ హర్యానా వింగ్ ఆఫ్ బ్రేక్ త్రూ’ ఎన్జీఓ మేనేజర్ ముఖేశ్. ‘‘మార్పు అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. మేము ఎన్నోరోజులుగా హర్యానాలోని పలు గ్రామాల్లో తిరుగుతూ యువతీయువకులకు విద్య ఆవశ్యకతను చెప్తూ వస్తున్నాం. అలాగే వాళ్ల తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఈ క్రమంలోనే దేవిపూర్ గ్రామంలో ఆడపిల్లలు పన్నెండో తరగతి తర్వాత చదువును కొనసాగించట్లేదని తెలుసుకున్నాం. కాలేజీలకు వెళ్లి చదవాలని పిల్లలకు, చదివించాలని తల్లిదండ్రులకు ఉందని వాళ్ల మాటల్లో విన్నాం. కేవలం బస్సు సర్వీస్ లేని కారణంగా విద్యార్థినులు డిగ్రీ పట్టా పొందలేకపోతున్నారని గ్రహించి, ఇలా లేఖ రాయమని సలహా ఇచ్చాన’’ని ముఖేశ్ అంటున్నారు.

చదువుకోవాలన్న కోరికతో పాటు తమ హక్కులను సాధించడంలోనూ ఒక గ్రామానికి చెందిన ఆడపిల్లలు ముందుండటం చాలా గర్వించాల్సిన విషయం. ఇలా అందరూ ధైర్యంగా తమకు కావాల్సిన వాటిని సాధించించేందుకు కృషి చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంది.

#womensday2023 #touchalife #talradio #womensday #girleducation #betipadhao

ఆ గ్రామానికి ఆయనే భగీరథుడు!

ప్రకృతి ప్రేమికుడు.. ప్రకృతిలో మమేకమై జీవించినవాడు 82 ఏళ్ల కామె గౌడ. ప్రకృతి, పశువులే జీవితంగా బతికారాయన. గొర్రెల కాపరిగా ఉంటూ… వాటి సావాసంలోనే తన 80 ఏళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఈ క్రమంలోనే మంచి మనసుతో మొదలుపెట్టిన చెరువుల తవ్వకం, ఆయనకు జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. కామె గౌడ గురించి చెబుతూ, ఆయన్ని ‘వాటర్ వారియర్’ గా అభివర్ణించారు.

కర్ణాటకలోని దశనదొడ్డి గ్రామంలో నివసించే కామె గౌడ చిన్నప్పట్నించి గొర్రెలను కాస్తుండేవారు. వాటిని కొండలు, గుట్టల్లో తిప్పుతూ రోజంతా అక్కడే తిరిగేవారు. ఈ క్రమంలో ఎండాకాలంలో పశువులు తాగడానికి నీళ్లకోసం పడే అవస్థను చూసి తట్టుకోలేకపోయారు. దాంతో ఇప్పటివరకు ఆ గ్రామంలో 16 కుంటలను తవ్వారాయన. వర్షాల వల్ల అవి నీళ్లతో నిండి.. అన్నికాలాల్లోనూ నీటికి కొరత లేకుండా అయింది.

మొదట్లో ఆ కుంటలు పశువుల కోసమే తవ్వినా, క్రమంగా ఆ నీళ్లను గ్రామ ప్రజలు కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఈ విషయం ఆలస్యంగానైనా ప్రభుత్వం వరకు చేరింది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చేతులమీదుగా కామె గౌడ ‘కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు’ అందుకున్నారు. దీంతోపాటు బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కామె గౌడకు జీవితకాల ఉచిత బస్ పాస్ అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను మెచ్చి, ఆ కుటుంబానికి రూ.25 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, కామె గౌడ కొడుకుకు రాష్ట్ర అటవీ శాఖలో ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది.

‘‘మా అమ్మనాన్నలకు పదిమంది సంతానం. దాంతో వాళ్లు నాపై ప్రేమ, ఆప్యాయత చూపించేందుకు సమయం ఉండేది కాదు. అలా ఐదేళ్ల వయసు నుంచే నాకు గొర్రెలు, ఇతర పశువులతో అనుబంధం పెరిగింది. వాటి మధ్యే పెరిగాను. అప్పుడే నాకు ఆ పశువులు ఎండాకాలంలో నీటి కోసం పడే తపన అర్థమైంది. వాటికి సాయం చేయలేకపోతే నేను రాక్షసుడిని అవుతాను కదా అనిపించింది. అందుకే 42 ఏళ్ల క్రితమే వాటికోసం కుంటలు తవ్వాను. తర్వాత వాటిలోని నీళ్లు మనుషులకూ ఉపయోగపడటంతో నా పనిని అలాగే కొనసాగించాను. నేను ఏదో ఆశించి ఈ పనికి పూనుకోలేదు. కానీ ఇన్నేళ్లకు నా కష్టాన్ని, ఆశయాన్ని ప్రభుత్వం, ప్రజలు గుర్తించడం ఆనందంగా ఉందన్న’ది కామెగౌడ మాట.

చెరువులను తవ్వడం కోసం తన సంపాదన అంతా ఖర్చు చేశారు కామె గౌడ. జేసీబీలను గంటకు రూ.700 లెక్కన కిరాయికి తీసుకొచ్చి చెరువులను తవ్వించేవారు. చెరువుల్లో నీళ్లు వచ్చాక, వాటిని పశువులు తాగినప్పుడు ఆయనకు బోలెడంత సంతోషం కలిగేదట. దానికోసమే ఇన్నేళ్లుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఈ గొప్ప పనికోసం ఆయన ఎంత కష్టపడుతున్నా, ఏరోజూ దీన్ని ఆపేయమని కుటుంబ సభ్యులు అడ్డుకోకపోవడం విశేషం. పచ్చని జీవితాన్ని గడిపిన కామెగౌడ గత ఏడాది అక్టోబర్ లో చనిపోయారు. ఆయన తవ్వించిన చెరువులు మాత్రం శాశ్వతంగా ఉండబోతున్నాయి.

ఎప్పుడూ మన సుఖం, మన సౌకర్యాల కోసం ప్రకృతి వాడుకుంటున్నాం. కానీ కామె గౌడలాంటి వాళ్లని చూసైనా, ప్రకృతిపట్ల ప్రేమను, బాధ్యతను పెంచుకోవాలి.

#kamegowda #touchalife #talradio #irrigation #environment #WorldWildlifeDay #wildlife

మారుమూల పల్లె నుంచే… 150మంది డాక్టర్లు!

ఓ గొప్ప ఆశయం… ఆ వ్యక్తిని ఉన్నతస్థానానికి తీసుకువెళ్లడమే కాదు, పదిమందికీ స్ఫూర్తిగా నిలబడుతుంది. అందుకు ఉదాహరణ ఇవాళ చెప్పుకోబోతున్నాం.

ఆంధ్రప్రదేశ్ లోని ఒకే గ్రామానికి చెందిన 150 మంది డాక్టర్లు ప్రస్తుతం దేశవిదేశాల్లోని ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. పేరుకు మారుమూల ఊరే అయినా, ఇప్పుడు ఆ గ్రామం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలానికి చెందిన కానుగులవలస గ్రామం. 1970 నుంచి ఇప్పటివరకు మొత్తం ఆ పల్లె నుంచి 150 మంది వైద్యులుగా మారారు.

ఈ తీరుకు ఆద్యులు బెండి చంద్రారావుగారు. ఆయన 1970లలో డాక్టర్ అయ్యారు. ఆయనే ఆ గ్రామానికి చెందిన మొదటి డాక్టర్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ అయ్యారు నూక భాస్కరరావు. తర్వాత వీళ్లద్దర్నీ ఆదర్శంగా తీసుకుంటూ, ఏడాదిలో కనీసం ఇద్దరు నుంచి ఐదుగురు డాక్టర్లుగా మారుతున్నారు. ఈ 150మంది వైద్యులూ… ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, వైజాగ్ లోని కింగ్ జార్జ్ హాస్పిటల్, మంగళగిరిలోని ఎయిమ్స్, హైదరాబాద్ లోని నిమ్స్ మొదలైన ప్రముఖ ఆసుపత్రులలో సేవలు అందిస్తున్నారు.

డాక్టర్ నూక భాస్కరరావు మాట్లాడుతూ.. ‘‘నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు చదువుకోలేదు. కానీ వాళ్ల ప్రోత్సాహంతో నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి 1971లో డాక్టరై ఊళ్లోకి అడుగుపెట్టాను. మా గ్రామంలోని మొదటి డాక్టర్ బెండి చంద్రారావుగారిని ఆదర్శంగా తీసుకునే నేను డాక్టర్ అయ్యాను. మొదట ఆమదాలవలసలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత ప్రభుత్వాసుపత్రిలో చేరాను. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు పదవీవిరమణ పొందాను. నా కొడుకు, కోడలు ఇద్దరూ ఆంకాలజీ రంగంలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. మా తమ్ముడు డాక్టర్ చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పనిచేసి రిటైరయ్యాడ’’ని చెప్తున్నారు.

ప్రస్తుతం ఆ గ్రామానికి నూక అప్పల సూరన్నాయుడు సర్పంచ్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నా నోటి లెక్కప్రకారం మా గ్రామం నుంచి కనీసం 150 మంది డాక్టర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ లెక్క ఎక్కువగానే ఉండొచ్చు. అలాగే ఆయా డాక్టర్ల కుటుంబాల్లోకి వచ్చిన కోడళ్లు, అల్లుళ్లలో కూడా చాలామంది డాక్టర్లే ఉన్నారు. ఇలా మా గ్రామానికి చెందిన ఎంతోమంది డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో పని చేస్తుండటం మాకెంతో గర్వంగా ఉంద’’ని అంటున్నారు.

ఉపాధి కోసం వలసకు వెళ్లే అలవాటు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో… తమకంటూ ఓ స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దాన్ని అందుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ వైద్యుల గ్రామం నిజంగా విశేషమే. వీళ్లలో చాలామంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ, సమాజానికి తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.

#talradio #touchalife #talblogs #medicine #doctors

పాత చీరలే… కొత్త కళారూపాలై!

కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం అన్నిరంగాల్లో చూస్తుంటాం. అందులో కొంతమంది మరింత భిన్నంగా, ప్రత్యేకంగా చేయడంతో గుర్తింపు తెచ్చుకుంటారు. అలా టెక్స్ టైల్ డిజైనింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మహారాష్ట్రకు చెందిన తేజల్ కేయుర్. మొదటి నుంచి దేన్నీ వృథా చేయని మనస్తత్వం గల తేజల్ ఇప్పుడు పాత చీరలతో రకరకాల వస్తువులు తయారు చేస్తోంది. వాటిని మరెక్కడా దొరకనంత ప్రత్యేకమైన డిజైన్లలో తయారు చేస్తుండటం ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండింగ్ గా మారింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే పర్సులు, బ్యాగుల ఫొటోలు చూసి, వస్తువులను వృథా చేయకూడదనే ‘మినిమలిస్ట్’ ఆలోచనలు కలవారు తేజల్ ని ప్రశంసిస్తున్నారు.

ఒకప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మల చీరలను అమ్మలు… అమ్మల చీరలను కూతుళ్లు… వాళ్ల చీరలను మనవరాళ్లు కట్టుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్లకు నచ్చి కొనుక్కున్న చీరలనే నాలుగుసార్లు కట్టిన తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. అలాగే మధ్యతరగతి మహిళలైతే స్టీల్ గిన్నెలకు పాత చీరలను ఇవ్వడం చూస్తుంటాం. అలాంటి చీరలన్నిటినీ సేకరించి, వాటికి తన ప్రతిభను జోడించి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తోందామె.

‘‘మా ఇంట్లో మొదటి నుంచీ దేన్నీ వృథా చేయొద్దనే ఆలోచన ఉండేది. చిన్నప్పుడు కూడా మేము ఏ వస్తువును వాడగానే పారేసేవాళ్లం కాదు. ఆయా వస్తువులను వేరేవాటికి ఉపయోగించేవాళ్లం. నా ఈ టెక్స్ టైన్ డిజైనింగ్ కొనసాగుతుండగా, చాలామంది మహిళలు తమ చీరలను నాలుగైదుసార్లు కట్టి పక్కన పెట్టేయడం గమనించాను. అప్పుడే ఇలా పాత చీరలకు కొత్త రూపం ఇవ్వాలనుకున్నాను. రకరకాల చోట్ల నుంచి పాత చీరలను తెప్పించి, ఫ్యాబ్రిక్ ని బట్టి వాటిని వేర్వేరుగా డిజైన్ చేస్తున్నాను. ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు ఆధునిక డిజైన్లలో పర్సులు, బ్యాగులు డిజైన్ చేస్తున్నాను. వాటిని ‘తేజల్ కేయూర్ టెక్స్ టైల్స్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాను. కాలేజీ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు చాలామంది నా ఉత్పత్తులను ఇష్టపడుతున్నార’’ని తేజల్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే తేజల్ ఎంతోమంది పేద, మధ్యతరగతి మహిళలకు పాత చీరలను వివిధ వస్తువులుగా మార్చడంలో శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వాళ్లకు ఇంటి దగ్గరే ఉండి బ్యాగులను కుట్టే పనిని కల్పిస్తున్నారు. ఈ బ్యాగుల తయారీ కోసం ఉపయోగించే రంగులు, నమూనాలు అన్నీ తేజల్ రూపొందిస్తుంది. ఆమె డిజైన్లలో ఎక్కువ ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. రంగుల కోసం కూడా వాటినే ప్రేరణగా తీసుకుంటుంది. వాటితో పాటు జంతువులు, చారిత్రాత్మక ప్రదేశాలనూ జోడిస్తోంది. బ్యాగులు, పర్సులతో పాటు ఫ్లవర్ వాజులు మొదలైన అలంకరణ వస్తువులనూ తయారు చేస్తోంది తేజల్ బృందం. భవిష్యత్ లో మరిన్ని కొత్త టెక్నిక్స్, డిజైన్లతో పాత చీరలను కొత్త వస్తువులుగా తయారు చేస్తామని, దీనిద్వారా మరింతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తామంటున్నారామె. ఇలా కొత్త పర్యావరణహిత ఆవిష్కరణలు చేయాలనుకునేవారికి ఈ యంగ్ డిజైనర్ ఆదర్శంగా నిలుస్తోంది.

#TejalKeyur #oldsarees #sustainability #reuse #recycling #repurpose #indiantextiles

ఈ జాబ్ పోర్టల్… దివ్యాంగులకు మాత్రమే!

ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అర్థం చేసుకున్నా, వాళ్ల కష్టాలను తీర్చే తీరిక చాలామందికి ఉండదు. మంచి మనసుంటే, దానికి ఆలోచన తోడైతే, అది ప్రయత్నంగా మారితే… ఇలాంటివన్నీ అసాధ్యం కాదు అంటున్నారు బెంగళూరుకు చెందిన వినీత్ సరాయ్ వాలా. ఆయన బెంగుళూరులోని ఐఐఎంలో చదువును పూర్తి చేసి, పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. డీజెనరేటివ్ డిజార్డర్ తో వినీత్ తన కంటిచూపును దాదాపు పూర్తిగా కోల్పోయారు. అయినా తనలాగా అవయవ లోపాలున్న వాళ్ల కష్టాలను అర్థం చేసుకున్నారు. 2020లో కొవిడ్ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వికలాంగుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే.. ‘ఎటిపికల్ అడ్వాంటేజ్’ అనే ప్లాట్ ఫామ్. దీనిద్వారా దివ్యాంగులకు వాళ్ల అర్హతలను బట్టి ఉపాధి కల్పిస్తున్నాడు.

‘‘ఫార్చూన్ గ్రూప్ లో నేను ఇన్ క్లూజన్ లీడ్ గా పని చేశాను. అందులో నా పని దివ్యాంగులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం. కొవిడ్ మొదలైన తర్వాత మా కంపెనీకి ఇలాంటి దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా రావడం మొదలైంది. నా స్థాయికి నేను అందర్నీ ఉద్యోగాల్లోకి తీసుకోలేను కదా! ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నాలాంటి వాళ్లందరి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. ఆరేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఈ సామాజిక సంస్థను మొదలుపెట్టాను. దానికి నా సహోద్యోగి వెంకట కృష్ణన్ బాగా ప్రోత్సహించారు. అలాగే నా సోదరుడు అనూజ్ కూడా నా వెన్నంటే ఉండి నడిపిస్తాడు. ఆయన కూడా నాలాగే చూపు దూరమైనవారు, అయినా బాగా చదువుకుని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మా ఎటిపికల్ అడ్వాంటేజ్ లో 1000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 500 మందికి ఉపాధి కల్పించామని చెప్పడానికి గర్వపడుతున్నామ’’ని అంటున్నారు వినీత్.

ఎటిపికల్ అడ్వాంటేజ్ లో రిజిస్టర్ చేసుకున్నవాళ్లు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసేవాళ్లే కాదు, వివిధ కళాకారులు కూడా ఉన్నారు. ఈ ప్లాట్ ఫామ్ లో ఆ కళాకారుల ప్రొఫైల్, వాళ్లు గీసిన చిత్రాలు మొదలైనవి ఉంటాయి. దాంతో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఆ చిత్రాలను కొనుగోలు చేసేలా వినీత్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఎంతోమంది గాయకులు, నర్తకులు, రచయితలు, కవులు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీళ్లందరికీ ఈ వేదిక ద్వారా పూర్తిస్థాయి ఉద్యోగాలే కాకుండా… ప్రదర్శనల అవకాశం, ఫ్రీలాన్స్ వర్క్ కూడా లభిస్తోంది. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అర్హత గల వాళ్లకు తమ సంస్థలో పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నారు.

‘‘మా పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజు తీసుకోవట్లేదు. అలాగే బయటినుంచి విరాళాలు కూడా సేకరించడం లేదు. పైగా కళాకారుల ప్రొఫైల్ ని మరింత గొప్పగా తయారు చేసి పెడతాం. అంతేకాదు, అవసరమైన వాళ్లకు నైపుణ్య శిక్షణ కూడా ఉచితంగా అందిస్తున్నాం. మా సహకారంతో ఉద్యోగం వచ్చినవాళ్లు, ఫ్రీలాన్స్ గా పని చేస్తున్నవాళ్లు తమవంతుగా కొంత డబ్బు ఇస్తుంటారు. వాటిని సంస్థ ఖర్చుల కోసం ఉపయోగిస్తామ’’ని వినీత్ సరాయ్ వాలా చెప్తున్నాడు.

వినీత్ లాంటి వ్యక్తులు సమాజంలో అడపాదడపానే కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్ల సంఖ్య పెరగాలని, సమాజంలో మంచి ఎఫ్పుడూ ముందంజలో ఉండాలని కోరుకుందాం.

#atypical #Atypicaladvantage #touchalife #talradio #talblogs

See less

See less