Design a site like this with WordPress.com
Get started

పోరాడితే మార్పు సాధ్యమే – స్ఫూర్తి కొలిపాక

సైన్యం కోసం ఎన్నికయ్యా. కానీ.. 

నేను పుట్టిపెరిగింది అంతా సికింద్రాబాద్‌ లోనే. ఇంజినీరింగ్‌ పూర్తి కాగానే టెక్ మహీంద్రాలో ఉద్యోగం వచ్చింది. అసలు నాకు ఆర్మీలోకి వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉండేది. ఎస్‌.ఎస్‌.బీకి సెలక్ట్‌ అయ్యాను కూడా. అన్ని పరీక్షల్లో నెగ్గాను. కానీ మెడికల్‌ టెస్టులో చిన్న సమస్య వచ్చింది. మడమల సమస్య కారణంగా నన్ను రిజెక్ట్ చేశారు. వాస్తవానికి అది అసలు సమస్య కానే కాదు. కానీ ఈ నిబంధనలు అన్నీ 200 ఏళ్ల క్రితం పెట్టినవి. ఇప్పటి వరకూ వాటిని సమీక్షించలేదు.

మేక్‌ ఎ ఢిఫరెన్స్.. నా జీవితాన్ని మార్చేసింది.. 

సాఫ్ట్‌ వేర్ కంపెనీలో పని చేసేటప్పుడే మేక్‌ ఎ డిఫరెన్స్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరాను. వారాంతాల్లో ఆ సంస్థ కోసం పని చేసేదాన్ని. ఆ సంస్థ స్వరూపం పనితీరు తెలుసుకున్నా. అప్పుడే అనాథ పిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నా. అప్పుడు ఆ చిన్నారుల కోసం డ్రీమ్ క్యాంప్ అని ఓ కార్యక్రమం నిర్వహించాం. దాని కోసం పిల్లలను ఓ మూడు రోజుల పాటు ఏదైనా రిసార్ట్‌లో ఉంచి అనేక అంశాలు నేర్పేవాళ్లం. అలా ఆ డ్రీమ్ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు నాలో ఉన్న మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ ఏంటో నాకు తెలిశాయి. 300 మంది వాలంటీర్లను సమన్వయం చేసేదాన్ని. ఆ సంస్థ కోసం నేను చాలా నిధులు సేకరించాను. మా సంస్థలోని ఉద్యోగుల నుంచి కూడా చాలా మందిని ఒప్పించి నిధులు సేకరించాను. 

అమ్మ పాఠం.. నాకు మలుపు..

మా అమ్మ గురించి చెప్పాలి. ఆమె 50 ఏళ్ల వయస్సులో మళ్లీ చదువు ప్రారంభించింది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి ఇతర బాధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా చదువుకోలేకపోయారు. అందుకే 50 ఏళ్ల వయస్సులో మళ్లీ చదువు ప్రారంభించారు. ఇప్పుడు అమ్మ పీ.హెచ్‌.డీ కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను అమ్మ పుస్తకాల్లో ముంబయిలో ఉన్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్ సైన్సెస్‌ గురించి తెలుసుకున్నా. ఈ సంస్థను 1936 లోనే అంటే స్వాతంత్ర్యానికి ముందే ఏర్పాటు చేశారు. చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ. ఇదే నాకు సరైన వేదిక అనిపించింది. అలా ఆ సంస్థలో చేరాను.

టాటా సంస్థ నేర్పిన పాఠాలు..

టాటా సంస్థలో సోషల్ వర్క్‌ లోని లైవ్లీ హుడ్ – సోషల్ ఎంట్రపెన్యుయర్‌షిప్‌ అనే సబ్జక్ట్ తీసుకున్నాను. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. మొదటి సంవత్సరం అంతా ఫీల్డ్ వర్క్‌ తోనే సరిపోయింది. మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలోని ఓ గిరిజన పల్లెలోనే గడిపాం. అక్కడి సమస్యలను అధ్యయనం చేశాం. వారంలో రెండు రోజులు పూర్తిగా ఆ గ్రామంలోనే గడిపేవాళ్లం. అక్కడ వర్షాలు బాగా పడుతున్నా, నీరు నిల్వ చేసుకునే సదుపాయాలు లేవు. ఆ గిరిజనులకు భూములు లేవు, ఉండటానికి సరైన ఇళ్లు లేవు, సరైన టాయ్‌లెట్స్ ఉండేవి కాదు…  సరైన నీటి సౌకర్యం లేక జనం ముంబయికి వలసపోతుండే వాళ్లు. ఓ ఏడాది పాటు అక్కడే ఉండి వాళ్ల సమస్యలు అధ్యయనం చేశాం. అప్పుడు వాళ్లను భాగస్వామ్యం చేసి వాళ్ల సమస్యలకు పరిష్కారాలు చూపించాం.

టిస్‌.. సమస్యలపై నా దృక్పథం మార్చేసింది..

సోషల్ వర్క్‌ అధ్యయనంలో చాలా అంశాలపై అధ్యయనం చేశాం. పెళ్లిళ్లు, కులాలు… ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేశాం. ప్రత్యేకించి పెళ్లిళ్ల గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుసుకున్నాం. మనం సాధారణంగా పెళ్లి అంటే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కలిసి జీవించడమే అనుకుంటాం. కానీ ఇంత కంటే భిన్నంగా, మన దేశంలోనే అనేక జాతుల్లో అనేక ఆచారాలు ఉన్నాయి. ఒక ఆచారంలో అమ్మాయిని, ఓ అబ్బాయికి కాకుండా ఓ ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయిలందరికీ ఆమే భార్య. బహుశా అమ్మాయిల కొరతతో ఈ ఆచారం వచ్చి ఉంటుంది. ఇలాంటి చాలా తెగల గురించి తెలుసుకున్నాను. చైనాలోని ఓ ద్వీపంలో కేవలం మహిళలే ఉంటారు. పురుషులకు స్థానం లేదు. మనం చూసే ప్రపంచమే కాదు. ఇంకా చాలా ప్రపంచం ఉందని తెలుసుకున్నా. రెండో ఏడాది ఒడిశాలోని మరో గిరిజన తెగ గురించి అధ్యయనం చేశాం. మహారాష్ట్రలోని తెగకూ ఇక్కడి తెగకూ చాలా తేడా ఉంది. ఇక్కడి వాళ్లకు భూములు ఉన్నాయి. డబ్బు ఉంది. అధికారం కూడా ఉంది. అందుకే గిరిజనులు అనగానే ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఈ విషయం నాకు ఒడిశా గిరిజనులను చూశాక తెలిసింది.

ఎంపీసీ, బైపీసీ… ఇంకేమీ చదువులు లేవా?

మీకు ఏం నచ్చుతుందో అదే చదవండి. టెంత్‌ తర్వాత ఓ ఏడాది పాటు మీకు ఏం నచ్చుతుందో ఎక్స్‌ప్లోర్ చేయండి. అప్పుడు నచ్చిన చదువు చదవండి. నేను చాలామందికి ఇదే చెప్పేదాన్ని. మీరు చదివేదానిపై మీకు ఆసక్తి లేకుండా ఎలా చదువుతారు? మన దగ్గర చదువు అంటే ఎంపీసీ లేదా బైపీసీ! ఇప్పుడు కాస్త కామర్స్ చదువుతున్నారు. మనకు ఇవి తప్ప వేరే చదువుల గురించి తెలియదు. పట్టించుకోం కూడా.

అమ్మతో చాలా చర్చించేవాళ్లం

మా అమ్మతో మేం చాలా సంభాషించేవాళ్లం. అమ్మతో అన్నీ షేర్‌ చేసుకునేవాళ్లం. ఇప్పుడు కూడా అనేక అంశాలు మేం అమ్మతో చర్చిస్తాం. ఎంతో భిన్నాభిప్రాయాలు కూడా మాట్లాడుకునేవాళ్లం. ఇలాంటి చర్చల ప్రతి ఇంట్లో జరగాలి. పిల్లల అభిప్రాయాలు తల్లిదండ్రులతో పంచుకోవాలి. మేం మా అమ్మతో పెళ్లి గురించి, ఇల్లరికం గురించి, లింగ సమస్యల గురించి, నా అనుబంధాల గురించి… ఇలా ఎన్నో మాట్లాడుకుంటాం. నేను చెప్పింది మీరు వినాలి అనే ధోరణి తల్లిదండ్రుల్లో ఉండకూడదు. మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. భిన్నాభిప్రాయాలను గౌరవించాలి.  ఈ మార్పు పిల్లలు, తల్లిదండ్రులు ఇరువైపుల నుంచి ఉండాలి.

వరకట్నం మనం విస్మరిస్తున్న పెద్ద సమస్య!

ఇన్నేళ్లయినా మనం ఇంకా వరకట్నం సమస్యను రూపుమాపలేకపోయాం. మనం దాన్ని ఆమోదించేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య హైదరాబాద్‌లో లుఫ్తాన్సా సంస్థలో పనిచేసే ఎయిర్‌ హోస్టన్‌ కూడా వరకట్నం వేధింపులతో మేడ మీద నుంచి దూకి చనిపోయింది. ఎంత దారుణం! ఇప్పటికీ మన స్నేహితులు, స్నేహితురాళ్లు కట్నాలు ఇచ్చిపుచ్చుకునే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నేను చాలామంది అబ్బాయిలను అడిగాను… మీరు కట్నం తీసుకుంటారా అని! వాళ్లు తీసుకుంటామనే అంటున్నారు. అలా తీసుకోకపోతే, ఏదో లోపం ఉందనుకుంటారు అనే పరిస్థితి సమాజంలో ఉంది. అంతే  కాదు. అబ్బాయిలే తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎందుకు ఇలా? ఈ అంశాలపై సమాజంలో చర్చ జరగాలి. అందుకే నేను నో డౌరీ డే అంటూ ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించాను.

తెలంగాణ మహిళాకమిషన్‌ కోసం పోరాడా..

వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడే నో డౌరీ డే గురించి ప్రచారం చేశా. అప్పుడే మహిళా కమిషన్ గురించి తెలుసుకున్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన కమీషన్. ఈ కమిషన్‌కు చాలా అధికారాలు ఉంటాయి. కొన్ని కోర్టు అధికారాలు కూడా ఉంటాయి. అయితే తెలంగాణలో అసలు ఈ కమిషన్‌ పేరుకే ఉండేది. ఆ కమిషన్ ను సంప్రదించాలని ప్రయత్నిస్తే, అసలు  మహిళా కమిషన్‌ కు కొంత కాలంపాటు ఛైర్మన్‌ లేరు, సభ్యులూ లేరని తెలిసింది.  ఇది నా దృష్టికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఆ ఇష్యూ మీద చాలా పోరాటం చేశాం. విజ్ఞప్తులు ఇచ్చాం. గవర్నర్, రాష్ట్రపతి వంటి వారికి లేఖలు రాశాం. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపాం. చివరకు కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలతోనే చివరకు తెలంగాణలో మళ్లీ మహిళా కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించారు. 

అందుకే అవాజ్‌ తెలంగాణ స్థాపించా..

మహిళా కమిషన్‌ గురించి పోరాడుతున్నప్పడే మాకు అనేక సమస్యలపై అవగాహన వచ్చింది. చాలా సమస్యలపై ఇంకా పోరాటం సాగించాలని అర్థమైంది. చాలా మంది మేమూ పోరాడతామని ముందుకు వచ్చేవారు. అందుకే ఆవాజ్ తెలంగాణ అనే సంస్థను స్థాపించాం. తెలంగాణలో మహిళా సమస్యలపై దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. అనేక సమస్యలపై వాలంటీర్లను ఏర్పాటు చేసి, అధ్యయనం చేస్తున్నాం. మహిళా సంక్షేమం గురించి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ చట్టాల అమలు కోసం పోరాడుతున్నాం. కోర్టుల్లో కేసులు వేస్తున్నాం. సమస్యలపై ప్రచారం చేస్తున్నాం.

లింగ వివక్ష గురించి తెలుసుకోవాలి

లింగ వివక్ష అంటే కేవలం ఆడ, మగ మాత్రమే కాదు! గేస్, లెస్బియన్లు, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలి. వారి సమస్యల గురించి ఆలోచించాలి. ఈ ఎల్జీబీటీ వాళ్ల సమస్యలు మరింత దారుణంగా ఉన్నాయి. అలాగే మహిళాసాధికారిత పెంచాలి. పెళ్లాలపై జోకులు మాన్పించాలి. ఇంకా సమాజంలో అనేక వర్గాల పరిస్థితి దారుణంగా ఉంది. వారి గురించి కూడా ఆలోచించాలి. ఈ సమాజం మారదు అనే మాటలు మానేయాలి. సమాజంలో మనమూ భాగమే అనే స్పృహ అందరిలోనూ రావాలి. దానికి మనం ప్రయత్నించాలి. పోరాడితే మార్పు సాధ్యమే అని గ్రహించాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: