• శాశ్వత నీటి పరిష్కారం కోసం విశ్వనాథన్ ప్రయాణం!

    బెంగళూరు లాంటి మహానగరంలో బావులు నిర్మించడం అంటే… కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా!
    చుట్టూ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, కాంక్రీట్ రోడ్లు, బిజీ లైఫ్… అలాంటి నగరంలో బావి అంటే అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.

    కానీ అది సాధ్యమే.. అని చెబుతూ బెంగళూరులో బావులను నిర్మిస్తూ, పాత వాటిని మళ్ళీ వినియోగంలోకి తీసుకువస్తున్నాడు.. విశ్వనాథన్ శ్రీకాంతయ్య!
    అంతేకాదు… నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితిని మార్చడానికి, భూగర్భ జలాలను పెంచడానికి బావులనే పరిష్కారంగా ఎంచుకొని, బెంగళూరులో ఏకంగా పది లక్షల బావులు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

    ఒకప్పుడు బావి అంటే మన ఇంటి నీటి అవసరాలకు ఆధారం… ఇప్పుడు ఆ బావి కనిపించాలంటే జ్ఞాపకాల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి. నగరాలు పెరిగాయి… ఇళ్లు, అపార్ట్మెంట్లు పెరిగాయి… కానీ భూమిలోకి వెళ్లాల్సిన వాన నీటికి దారులు మాత్రం మూసుకుపోయాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీళ్ల కోసం ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో… మనం మర్చిపోయిన బావులనే మళ్లీ పరిష్కారంగా చూపిస్తూ, బెంగళూరులో ఏకంగా 10 లక్షల బావులను నిర్మించాలనే ఆలోచనతో పని చేస్తున్నారు విశ్వనాథన్ గారు.

    శతాబ్దాలుగా బావులు తవ్వడం ఒక సాంప్రదాయ వృత్తి. కానీ రోజులు మారుతున్న కొద్దీ ఈ వృత్తికి ఆదరణ తగ్గిపోయింది. ఎన్నో కుటుంబాలు తమకు తరతరాలుగా వచ్చిన ఈ నైపుణ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అలాంటి వారిని గుర్తించి… మళ్లీ వారికి పని కల్పిస్తున్నారు. వారు చేసే పనిని గర్వపడేలా చెయ్యడంతో పాటు… తమ నైపుణ్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎలా చేరువ చెయ్యాలో కూడా నేర్పిస్తున్నారు. ఒకప్పుడు తమ చేతులతో బావులు తవ్విన వాళ్లే… ఇప్పుడు అదే పనిని గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో కొనసాగించేలా చేస్తున్నారు.

    బావులు మనకు అంత ముఖ్యమా?

    అవును. ఎందుకంటే బావి అంటే కేవలం భూమిలోకి ఒక గుంత తవ్వడం కాదు. అది వాన నీటిని భూమిలోకి పంపించే ఒక సహజమైన మార్గం. మన పూర్వీకులు ప్రకృతిని అర్థం చేసుకుని నిర్మించుకున్న అద్భుతమైన నీటి వ్యవస్థలో ఇదీ ఒక భాగం. బావులకు దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. సిమెంట్, ఇసుక లేకుండా కేవలం రాళ్లతో నిర్మించిన కొన్ని బావులు 300 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అప్పటి నిర్మాణ నైపుణ్యం మాత్రమే కాదు… నీటిని భద్రపరచాలనే మన పూర్వీకుల ఆలోచనా విధానం కూడా ఇందులో కనిపిస్తుంది.

    అందుకే ఇతను కర్ణాటక చుట్టుపక్కల పాడుబడిపోయిన ఎన్నో బావులను గుర్తించి పునరుద్ధరిస్తున్నారు. అంతటితో ఆగకుండా… బెంగళూరులోని ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో కొత్త బావులు, ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు. వాన నీటిని ఎలా సంరక్షించుకోవాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

    మొదట్లో ప్రజలకు ఈ ఆలోచనను అర్థం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. తమ ఇంట్లో కూడా బావి ఉండాలని కోరుకుంటూ యజమానులే స్వయంగా వీరిని సంప్రదిస్తున్నారట. ఇప్పటికే ఈ కార్యక్రమం చేపట్టిన చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది.

    ఒకవైపు నీటిని భూమిలోకి పంపిస్తున్నారు… మరోవైపు ఆ నీటిని భూమి నుంచి బయటకు తీసే నైపుణ్యం ఉన్న మనుషులకు మళ్లీ జీవనోపాధి కల్పిస్తున్నారు. అంటే… ఒక బావి తవ్విన ప్రతిసారీ అక్కడ కేవలం నీరు మాత్రమే పుట్టడం లేదు. ఒక వృత్తికి గౌరవం వస్తోంది. ఒక కుటుంబానికి ఉపాధి వస్తోంది. భూగర్భ జలాలకు జీవం వస్తోంది.

    ఇప్పుడు ఈ కార్యక్రమం బెంగళూరుకే పరిమితం కాకుండా భారతదేశంలోని మహా నగరాలన్నింటికీ విస్తరించగలిగితే… మన నీటి సమస్యను చాలా వరకు మనమే పరిష్కరించుకోగలం. ఎందుకంటే నీటి కోసం కొత్త వనరులు వెతకడం కంటే… మన దగ్గర ఉన్న సహజ వనరులను కాపాడుకోవడమే చాలా ముఖ్యం.

    ఒకప్పుడు మన నగరాల్లో చెరువులు, కాలువలు, బావులు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండేవి. బ్రిటిష్, నిజాం, రాజుల కాలం నాటి ఎన్నో నీటి వనరులు మన నగరాల జీవనంలో భాగంగా ఉండేవి. ఒక్క హైదరాబాద్ మహానగరాన్నే తీసుకుంటే… ఒకప్పుడు 3000లకు పైగా చెరువులు ఉండేవని చెబుతారు. ఇప్పుడు వాటిలో సుమారు 300 మాత్రమే మిగిలాయి. మిగిలిన వాటిలో కూడా ఎన్నో అక్రమ కట్టడాలకు గురయ్యాయి.

    ఇక మరి బావుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అసలు మన నగరాల్లో ఇప్పుడు ఎక్కడైనా బావి కనిపిస్తే… అది మనకు ఆశ్చర్యంగా అనిపించేంతగా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో బావి ఉండటం సాధారణం. ఇప్పుడు ఇంట్లో బోర్‌వెల్ ఉందా? ట్యాంకర్ వస్తుందా? నీటి సమస్య ఉందా? అనేదే మన చర్చ. ఇక్కడ సమస్య కేవలం నీటి కొరత మాత్రమే కాదు… మనం మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని మరిచిపోవడమే అసలు సమస్య.

    అందుకే కనీసం ఇప్పుడు అయినా మనం ఆలోచించాలి. మన ఇంట్లో బావి తవ్వించే అవకాశం ఉంటే ఎందుకు ఆలోచించకూడదు? అది సాధ్యం కాకపోతే కనీసం ఒక ఇంకుడు గుంత అయినా ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు? వాన నీటిని వృథాగా డ్రైనేజీలోకి పంపించే బదులు… భూమిలోకి ఎందుకు పంపకూడదు? ప్రయత్నం చిన్నదే కావచ్చు… కానీ రేపటి నీటి భద్రతకు అదే ఒక పెద్ద అడుగు అవుతుంది.

    ఎందుకంటే… నీటిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడం.. భవిష్యత్తును నిర్మించుకోవడం!

    #TALRadioTelugu #TALBlogs #ViswanathanSrikantaiah #BengaluruWaterCrisis #WaterConservation #RainwaterHarvesting #GroundwaterRecharge #WellRevival #SaveWater #WaterSecurity #SustainableBengaluru #UrbanWaterManagement #WaterHeroes #EnvironmentalAction #TouchALifeFoundation

  • మనకు ఒక ప్రాంతం గురించి బయటి వ్యక్తుల నుంచి తెలిస్తే ఒకలా ఉంటుంది… అదే ప్రాంతంలో పెరిగిన మనుషుల నుంచి తెలిస్తే మరోలా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం, అక్కడి జీవితంతో ముడిపడిన అనుభవాలు, చిన్ననాటి జ్ఞాపకాలు… ఇవన్నీ ఆ కథను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. అలాంటి వాళ్ల చేతిలో కెమెరా ఉంటే… ఆ ప్రాంతంలోని జీవితాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు.

    ఇదే ఆలోచనతో చెన్నైకి చెందిన ఫోటోగ్రాఫర్ పళని కుమార్ ఒక మంచి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతకు ఉచితంగా ఫోటోగ్రఫీ, జర్నలిజం నేర్పిస్తూ… తమ జీవితాలను, తమ ప్రాంతాలను, తమ చుట్టూ ఉన్న మనుషుల కథలను వాళ్లే చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆయన ప్రారంభించిన People’s Photographers Collective ద్వారా కెమెరా ఎలా ఉపయోగించాలో మాత్రమే కాకుండా… తమ చుట్టూ ఉన్న విషయాలను ఎలా గమనించాలి, ఒక ఫోటో ద్వారా ఒక కథను ఎలా చెప్పాలి అనే విషయాలను కూడా నేర్పిస్తున్నారు. తమ కుటుంబం, వీధి, స్నేహితులు, పని చేసే మనుషులు, రోజూ చూసే జీవితాన్ని కెమెరాలో బంధించేలా యువతను ప్రోత్సహిస్తున్నారు.

    చెన్నైతో పాటు తమిళనాడు, ఒడిశాలో కూడా వర్క్‌షాపులు నిర్వహిస్తున్న ఈ Collective ఇప్పటివరకు 50 మందికి పైగా యువతకు ఫోటోగ్రఫీలో శిక్షణ ఇచ్చింది. కెమెరాలు వాడటంలో అవసరమైన శిక్షణ, మార్గదర్శనం అందిస్తూ… తమ జీవితాలను, తమ ప్రాంతంలో కనిపించే విషయాలను వాళ్లే ఫోటోల ద్వారా చెప్పుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకసారి “Our Street Our Stories” అనే ప్రాజెక్టు ద్వారా North Chennai యువత తమ ప్రాంతంలోని ప్రజలు, వారి జీవితం, రోజువారీ అనుభవాలను ఫోటోలుగా తీసి అందరికీ పరిచయం చేశారట. అప్పుడు బయటివాళ్లు ఒక ప్రాంతాన్ని ఎలా చూస్తారో కాకుండా… అక్కడే పెరిగిన యువత ఆ ప్రాంతాన్ని ఎలా చూస్తున్నారో ఈ ఫోటోలు అందరికీ తెలిపాయట.

    పళని కుమార్ ప్రయాణం కూడా సరిగ్గా ఇదే ఆలోచనకు దగ్గరగా ఉంటుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పు తీసుకుని తన మొదటి కెమెరాను కొన్నారట. ఆ తర్వాత ఫోటోగ్రఫీని తన వృత్తిగా మార్చుకుని ఎంతో మంది జీవితాలను తన కెమెరా ద్వారా అందరికీ చూపించారు. ఒకప్పుడు తనకు లభించిన ఆ అవకాశమే ఇప్పుడు యువతకు లభించాలని భావించి… తనకు తెలిసిన ఫోటోగ్రఫీని వాళ్లకు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు వంటి సదుపాయాలు తక్కువగా ఉన్నా ఈ ప్రయత్నం మాత్రం కొనసాగుతోంది.

    పళని కుమార్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. మనకు వచ్చిన ఒక అవకాశం మన జీవితాన్ని మార్చొచ్చు… కానీ అదే అవకాశాన్ని ఇంకొకరికి అందిస్తే వారి జీవితంలో కూడా కొత్త దారి మొదలవుతుంది. ఒకప్పుడు తన చేతిలో కెమెరా పట్టుకుని తన కథను వెతుక్కున్న ఆయన… ఇప్పుడు మరికొంతమంది చేతుల్లో కెమెరాలు పెట్టి వాళ్ల కథలను ప్రపంచానికి చూపించేలా చేస్తున్నారు.

    ఒక కెమెరా ఒక ఫోటోను మాత్రమే తీస్తుంది. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న కథ ఒక మనిషి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక ప్రాంతాన్ని మనకు పరిచయం చేయగలదు. తమ కథను తామే చెప్పుకునే అవకాశం ఇస్తే… మనం చూడని ఎన్నో నిజమైన కథలు మన ముందుకు వస్తాయి. People’s Photographers Collective చేస్తున్న పని కూడా ఇదే.

    #TALRadioTelugu #TALBlogs #WorldPhotographyDay #PeoplesPhotographersCollective #PalaniKumar #OurStreetOurStories #PhotographyForChange #StoriesThroughPhotography #VisualStorytelling #YouthEmpowerment #SocialImpact #ChennaiStories #Photography #CommunityStories #InspiringIndia #ChangeMakers #TALRadio #TouchALifeFoundation

  • ప్రకృతిని ప్రేమించడం అంటే… చెట్లు, జంతువులను ఇష్టపడటం మాత్రమే కాదు. వాటిని రేపటి తరాలు కూడా కాపాడేలా చేయడం. అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు కర్ణాటకలోని దాండేలికి చెందిన రాహుల్ బవాజీ. వన్యప్రాణుల సంరక్షణలో పనిచేస్తూనే… అడవులను కాపాడుతున్న కుటుంబాల పిల్లలకు చదువు చెప్తూ అండగా నిలుస్తున్నారు. ఒకవైపు అడవులు, జంతువులను కాపాడుతూనే… మరోవైపు ఆ అడవులతో కలిసి జీవించే పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

    రాహుల్‌కు చిన్నప్పటి నుంచే దాండేలి అడవులు, అక్కడి జంతువులంటే చాలా ఇష్టం. అతను ఆరో తరగతిలో ఉన్నప్పుడు క్వార్టర్స్‌లోకి ఓ పాము వచ్చింది. అందరూ భయపడుతుంటే… రాహుల్ మాత్రం దాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు.

    ఆ సంఘటన తర్వాత వన్యప్రాణుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనలో మరింత పెరిగింది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ దాండేలి అడవులపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చివరికి 2011లో ఉద్యోగాన్ని వదిలి దాండేలికి తిరిగి వచ్చి వన్యప్రాణుల సంరక్షణలో పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు. ఈ రంగంలోని సమస్యలను మరింతగా అర్థం చేసుకోవడానికి Law కూడా చదివారు.

    అడవుల్లో పనిచేస్తున్న సమయంలో… కాళీ టైగర్ రిజర్వ్‌లోని మారుమూల యాంటీ-పోచింగ్ క్యాంపుల్లో పనిచేసే సిబ్బంది కుటుంబాల పరిస్థితిని రాహుల్ దగ్గర నుండి గమనించారు. అడవులను కాపాడుతున్న వారి పిల్లలకు చదువుకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా అందడం కష్టంగా ఉండేది.

    మొదట్లో చిన్న చిన్న వస్తువులు అందించి, సహాయం చేసిన రాహుల్… పిల్లల చదువుకు అండగా నిలవడం మరింత అవసరమని గుర్తించారు. అలా ఒక స్కూల్‌తో మొదలైన సహాయం 13 స్కూళ్లకు విస్తరించింది. ప్రస్తుతం 8 స్కూళ్లలోని దాదాపు 300 మంది గిరిజన పిల్లలకు ప్రతి సంవత్సరం చదువుకు అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. ఇటీవల స్కూల్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న 10 మంది విద్యార్థులకు సైకిళ్లను కూడా ఏర్పాటు చేశారు.

    తన కుమార్తె కోసం ఉంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఉపయోగించి దాదాపు 400 మంది విద్యార్థులకు పుస్తకాలు అందించారు. తన తన దగ్గర ఉన్న డబ్బులోనే కొంత భాగాన్ని పిల్లల చదువుకు కేటాయించారు. అంతే కాకుండా వన్యప్రాణుల సంరక్షణలోనూ రాహుల్ తన కృషిని కొనసాగిస్తున్నారు. ఒక హార్న్‌బిల్ గూడును దాదాపు మూడేళ్ల పాటు గమనించి డాక్యుమెంట్ చేశారు. ఈ కృషికి హార్న్‌బిల్ ఫెస్టివల్‌లో గుర్తింపు కూడా పొందారు.

    ప్రతి వారం రిజర్వ్‌ అడవుల్లోని స్కూళ్లకు వెళ్లి పిల్లలకు వన్యప్రాణులు, జీవ వైవిధ్యం, పాములపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలే అడవిలో మంటలు, గాయపడిన జంతువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందిస్తున్నారు.

    రాహుల్ బవాజీ ప్రయాణం చూస్తే… చిన్న వయసులో మొదలైన ప్రకృతిపై ప్రేమ, ఒక పెద్ద బాధ్యతగా మారింది. వన్యప్రాణులను కాపాడటంతో పాటు… వాటిని కాపాడే కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు కూడా ఆయన అండగా నిలిచారు. ఒకరి ఆలోచన మారితే ఒక జీవితం మారొచ్చు… కానీ ఆ ఆలోచన బాధ్యతగా మారితే, ఒక సమాజంలోనే మార్పు మొదలవుతుంది.

    #TALRadioTelugu #TALBlogs #RahulBavaji #WildlifeConservation #NatureConservation #Dandeli #KaliTigerReserve #TribalEducation #WildlifeWarrior #ForestConservation #SaveWildlife #SaveForests #HornbillConservation #Biodiversity #InspiringIndia #Changemakers #UnsungHeroes #PositiveIndia #InspiringStories #NatureLovers #WildlifeStories #IndiaInspires #SocialImpact #TALRadio #TouchALifeFoundation

  • పట్టుదల ఉంటే… పరిస్థితులు ఎలా ఉన్నా విజయాన్ని చేరుకోవచ్చు. ఆదిలాబాద్‌కు చెందిన టెంబేకర్ వెంకటరమణ జీవితం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. 27 ఏళ్లుగా శారీరక సమస్యలతో బాధపడుతున్న ఆయనకు సొంతంగా కూర్చోవడం, నడవడం కూడా సాధ్యం కాదు. ప్రతి చిన్న పనికీ తల్లిదండ్రుల సహాయం అవసరం. అయినప్పటికీ తన పరిస్థితిని చూసి నిరాశ చెందకుండా, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగారు. టెక్నాలజీని అవకాశంగా మార్చుకుని ఈ రోజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. “వైకల్యం శరీరానికే కానీ… ఆశయాలకు కాదు” అనే మాటను తన జీవితంతో నిరూపిస్తున్నారు.

    మొబైల్‌నే అవకాశంగా మార్చుకున్నాడు!

    వెంకటరమణకు చిన్నప్పటి నుంచి టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. శారీరక పరిస్థితుల కారణంగా స్కూల్ కి వెళ్లి చదువుకునే అవకాశం లేకపోయినా… ఇంట్లోనే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకున్నారు. మొబైల్ ఫోన్‌ను కేవలం వినోదం కోసం కాకుండా… తన భవిష్యత్తుకు ఒక సాధనంగా మార్చుకున్నారు. ఆన్‌లైన్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు నేర్చుకున్నారు. నాలుగు నెలల ట్రైనింగ్, రెండు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి… తన నైపుణ్యాలను పెంచుకున్నారు. అలా చేసిన ఆయన కృషే ఇప్పుడు తనకు ఉద్యోగ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

    డిగ్రీ లేకపోయినా… నైపుణ్యంతో గుర్తింపు!

    చాలామంది ఉద్యోగం కోసం డిగ్రీలు, అర్హతలు అవసరం అనుకుంటారు. కానీ వెంకటరమణ మాత్రం తన ప్రతిభ, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు అవకాశాలు వస్తాయని నిరూపించారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్‌గా పనిచేస్తూ నెలకు మంచి ఆదాయం పొందుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆయన చేసే పనులన్నీ మొబైల్ లోనే… మీటింగ్స్‌కు హాజరు కావడం, క్లయింట్లతో మాట్లాడటం, ఆఫీస్ పనులను నిర్వహించడం వంటి ఎన్నో పనులను తన మొబైల్ సహాయంతోనే చేసేస్తారు.

    వెంకటరమణ అభిప్రాయం ప్రకారం… మొబైల్ ఫోన్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, కొత్త అవకాశాలకు కూడా ఒక వేదిక. చాలా మంది సమయాన్ని వృథా చేసే ఈ సాధనాన్నే ఆయన తన భవిష్యత్తును నిర్మించుకునే సాధనంగా మార్చుకున్నారు. శారీరక పరిమితుల కారణంగా బయటకు వెళ్లి నేర్చుకునే అవకాశం లేకపోయినా, మొబైల్ ద్వారానే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఉద్యోగం సంపాదించారు. “మొబైల్‌ను ఎంతసేపు ఉపయోగిస్తున్నామన్నది కాదు… దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం” అని చెప్పే వెంకటరమణ, సరైన దిశలో ఉపయోగిస్తే టెక్నాలజీ మన జీవితాన్ని మార్చగలదని నిరూపించారు.

    తల్లిదండ్రులకు ధైర్యంగా మారిన కుమారుడు

    వెంకటరమణ తల్లిదండ్రులు.. సంతోష్ కుమార్, సురేఖ ఇద్దరూ ఉపాధ్యాయులు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి కారణంగా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఆందోళనలు ఎదుర్కొన్నారు. అయితే వెంకటరమణ ఎప్పుడూ నిరాశ చెందకుండా, నేర్చుకుంటూ ముందుకు సాగడం చూసి వారికి కూడా ధైర్యం వచ్చింది. ఒకప్పుడు అతని భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన వారు, ఇప్పుడు అతని ఆత్మవిశ్వాసం మరియు విజయాలను చూసి గర్వపడుతున్నారు.

    కంపెనీకి కూడా స్ఫూర్తిగా

    వెంకటరమణ ప్రతిభ ఆయన పనిచేస్తున్న సంస్థను కూడా ఆకట్టుకుంది. సాధారణంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌తో చేసే అనేక పనులను ఆయన కేవలం మొబైల్ ద్వారానే సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, సమస్యలను ఎదుర్కొనే తీరు సహచరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని వెంకటరమణ తన జీవితంతో నిరూపించారు.

    శరీర పరిమితులను దాటి సాగిన ప్రయాణం

    పరిస్థితులు ఎలా ఉన్నా, మనపై మనకు నమ్మకం ఉంటే చాలు ముందుకు సాగవచ్చని నిరూపించారు వెంకటరమణ. శారీరక పరిమితులు ఆయన అడుగులను ఆపినా, ఆయన ఆలోచనలను మాత్రం ఆపలేకపోయాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ, తన కృషితో ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. జీవితంలో విజయాన్ని నిర్ణయించేది మన పరిస్థితులు కాదు, వాటిని ఎదుర్కొనే మన సంకల్పమే… ఇదే ఈయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం!

    #TALRadioTelugu #TALBlogs #dwarf #InspiringStory #VenkataRamana #inspiration #Telangana #Motivation #SuccessStory #NeverGiveUp #LifeLessons #Determination #HardWork #PositiveThinking #PersonalGrowth #Leadership #MindsetMatters #Resilience #GoalSetting #MotivationalStory #HumanSpirit #ChangeMakers #StoryOfHope #InspiringPeople #TouchALifeFoundation

  • మనం హిమాలయాలకు వెళ్తే ఏం చేస్తాం? బాగా ఎంజాయ్ చేస్తాం. అక్కడి మంచుకొండలను చూస్తాం, ఫొటోలు దిగుతాం, జ్ఞాపకాలను సొంతం చేసుకుని తిరిగి వచ్చేస్తాం. కానీ ఈయన మాత్రం అక్కడి అందాలను కాదు… ఆ అందాల మధ్య దాగి ఉన్న సమస్యల్ని చూశారు… ప్రకృతి నిశ్శబ్దంగా భరిస్తున్న బాధను గుర్తించారు. ఇప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించి, ఆ బాధల్ని తీర్చడాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు.

    మంచుతో నిండిన ఎత్తైన పర్వతాలు, నిశ్శబ్ద లోయలు, గుండెలను తాకే స్వచ్ఛమైన గాలి… ఇలాంటి వాతావరణంతో నిండిన హిమాలయ పర్వత ప్రాంతాల్లో జీవితంలో ఒక్కరోజైనా గడపాలని చాలా మంది అనుకుంటారు కదా. అచ్చంగా అలాగే ప్రదీప్ సంగ్వాన్ కూడా ఆ పర్వతాల అందాన్ని ఆస్వాదించాలనే కోరికతో మొదటిసారి హిమాలయాల్లో అడుగుపెట్టారు. కానీ అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ మురిసిపోతున్న సమయంలో, కనిపించిన ఒక సంఘటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. పర్యాటకుల రాకతో పర్వత మార్గాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, వ్యర్థాలు ఆ పవిత్రమైన ప్రదేశాల రూపురేఖలను నాశనం చేస్తుండటం ఆయనను బాగా ఆలోచింపజేసింది.

    చాలామంది ప్రయాణికులు అలాంటి చెత్తను చూసి అసహ్యించుకుని తమ దారిన తాము వెళ్లిపోతున్నారు. కానీ ప్రదీప్ అడుగులు మాత్రం ముందుకు పడలేదు. “ప్రకృతి మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, మనశ్శాంతిని ఉచితంగా ఇస్తోంది కదా! మరి దానికి ప్రతిఫలంగా మనం తిరిగి ఏమి ఇస్తున్నాం? ఈ చెత్తనా?” అంటూ ఆయన మనసులో తీవ్రమైన ఆందోళన మొదలైంది. అదే క్షణంలో ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అందాలను ఆస్వాదించే ప్రయాణికుడిగా అక్కడికి వచ్చిన ప్రదీప్, ఆ కొండల గాయాలను మాన్పే రక్షకుడిగా మారాలని మనసులోనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు.

    వెంటనే ప్రదీప్ తన స్నేహితులతో కలిసి ఒక చిన్న సంచి పట్టుకుని పర్వత మార్గాల్లో పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరడం మొదలుపెట్టారు. చలిగాలులు వణికిస్తున్నా, నిటారైన కొండ దారుల్లో నడవడం కష్టమైనా ఆయన వెనకడుగు వేయలేదు. మొదట్లో ఆయన్ని చూసి అందరూ వింతగా నవ్వుకున్నారు. కానీ, ప్రదీప్ తన లక్ష్యాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగారు. క్రమంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, సందర్శకులకు పర్యావరణం గురించి అర్థమయ్యేలా చెప్పడం ప్రారంభించారు. ప్రతి రోజూ ఎంతోకొంత చెత్తను మోస్తూ కొండ దిగుతుంటే, ఆ పర్వతాలే తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్టు ఆయనకు అనిపించేదట.

    ఆయన గుండెల్లో రగిలిన ఆ చిన్న ఆశయ జ్వాల క్రమంగా ఒక మహా ఉద్యమంగా మారింది. అలా 2016లో Healing Himalayas Foundation ను స్థాపించారు. ఒకరిద్దరితో మొదలైన ఈ ప్రయాణానికి ఇప్పుడు వేలాది మంది యువతీ యువకులు చేరడం మొదలుపెట్టారు. ప్రమాదకరమైన శిఖరాల పైనుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వాటిని సురక్షితంగా తరలించి రీసైక్లింగ్ చేయించడం ఇలా పనులన్నీ జరిగిపోతున్నాయి. హిమాలయాలంటే కేవలం ఫొటోలు తీసుకునే ప్రదేశం మాత్రమే కాదు, అది మన ప్రకృతి ఇచ్చిన విలువైన బహుమతి అని.. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేశారు.

    ఈ రోజు ప్రదీప్ సంగ్వాన్ జీవితం ఒక ప్రేరణాత్మకమైన కథగా నిలిచింది. ఒకప్పుడు హిమాలయాల అందాలను చూడటానికి ఒక సామాన్య పర్యాటకుడిగా అడుగుపెట్టిన వ్యక్తి, నేడు అదే పర్వతాల గుండెల్లో నిలిచి వాటికి రక్షణ కవచంగా మారారు. ఆయన చేస్తున్నది కేవలం కొండల్లో చెత్తను శుభ్రం చేయడం మాత్రమే కాదు… మనుషులకు, ప్రకృతికి మధ్య తెగిపోయిన ఆత్మీయ బంధాన్ని మళ్లీ అల్లుతున్నారు. హిమాలయాల ఒడిలో అడుగుపెట్టిన ఆ ప్రయాణం… ఆ పర్వతాల శ్వాసగా మారి, నేటికీ కొత్త అధ్యాయాన్ని రాస్తూనే ఉంది.

    #TALRadioTelugu #TALBlogs #PradeepSangwan #HealingHimalayas #SaveHimalayas #CleanHimalayas #Himalayas #Environmentalist #EcoWarrior #NatureConservation #PlasticFreeHimalayas #ClimateAction #Sustainability #ProtectNature #MountainCleanup #EnvironmentalAwareness #SocialImpact #Changemaker #InspiringStories #PositiveNews #GreenInitiative #VolunteerForNature #RecycleForFuture #HumanityFirst #TouchALifeFoundation

  • AIకి ఒక పెద్ద సమస్య ఉంది… అది మనుషుల్లా పాత సమాచారాన్ని గుర్తుంచుకోలేదు. గతంలో జరిగిన సంభాషణలను, నేర్చుకున్న విషయాలను గుర్తు పెట్టుకుని వాటి ఆధారంగా స్పందించడం AIకి అంత సులభం కాదు. ఈ సమస్యను గమనించిన ముంబైకి చెందిన యువకుడు ధ్రవ్య షా… AIకి కూడా “జ్ఞాపకశక్తి” ఉండేలా, గత సమాచారాన్ని గుర్తుపెట్టుకుని మరింత తెలివిగా స్పందించేలా చేసే ఓ సరికొత్త టెక్నాలజీని తయారుచేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాడు.

    కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆయన స్థాపించిన Supermemory అనే స్టార్టప్, ఇప్పుడు AI గత సమాచారాన్ని గుర్తుంచుకుని మరింత తెలివిగా పనిచేయడానికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆలోచనే ధ్రవ్య షాకు ప్రపంచ టెక్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతు, కోట్ల రూపాయల పెట్టుబడులు, సిలికాన్ వ్యాలీ గుర్తింపుతో… ఆయన ప్రయాణం ఇప్పుడు ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

    ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ధ్రవ్యకు చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. తనంతట తానే కోడింగ్ నేర్చుకుని, యుక్తవయసులోనే అనేక ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు తయారు చేశాడు. 16, 17 ఏళ్ల వయసులోనే రెండు చిన్న టెక్ కంపెనీలను నిర్మించి విక్రయించడం ద్వారా తన ప్రతిభను నిరూపించాడు.

    ఒక ఆలోచన… ప్రపంచ దృష్టిని ఆకర్షించింది!

    కాలేజీలో ఉన్న సమయంలో ధ్రవ్య తనకు తానే ఒక సవాలు విసురుకున్నాడు. వరుసగా 40 వారాలు, ప్రతి వారం ఒక కొత్త ప్రొడక్ట్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 37వ వారంలో రూపొందించిన ఒక చిన్న ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ విపరీతంగా వైరల్ అయింది.

    “Any Context” అనే ఆ ప్రాజెక్ట్ ద్వారా వినియోగదారులు తమ సేవ్ చేసిన సమాచారంతో AIని మాట్లాడించగలిగారు. కొద్ది రోజుల్లోనే వేలాది మంది డెవలపర్లు దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. GitHubలో భారీ ఆదరణ లభించింది. అదే ఆలోచన తరువాత “Supermemory”గా రూపాంతరం చెందింది.

    AIకి జ్ఞాపకశక్తిని అందించే ప్రయత్నం

    ప్రస్తుతం ధ్రవ్య స్థాపించిన Supermemory, AI టూల్స్ కు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని అందించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. మనుషులు గత అనుభవాలను గుర్తుంచుకుని వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నట్లే, AI కూడా గత సమాచారాన్ని గుర్తుంచుకుని మరింత తెలివిగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది.

    ఈ ఆలోచన సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులను సైతం ఆకట్టుకుంది. ఫలితంగా Supermemory కోసం 3 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ లభించింది. గూగుల్ AI చీఫ్ జెఫ్ డీన్, OpenAI మరియు Meta సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ స్టార్టప్‌కు మద్దతు తెలిపారు.

    అంతేకాకుండా, తన ప్రతిభను గుర్తిస్తూ అమెరికా ప్రభుత్వం ధ్రవ్యకు ప్రతిష్టాత్మకమైన O-1 “Extraordinary Ability” వీసాను కూడా మంజూరు చేసింది.

    ఒక సమస్యను గమనించడం నుంచి మొదలైన ఒక చిన్న ఆలోచన… ఇప్పుడు AI భవిష్యత్తునే మార్చే ఒక ప్రయత్నంగా మారింది. కొత్తగా ఆలోచించి, సవాళ్లకు పరిష్కారాలు వెతికే ఈ తరం ఏదైనా సాధించగలదని ఈ పిల్లోడి ప్రయత్నాన్ని చూస్తేనే మనకు అర్థమవుతోంది.

    #TALRadioTelugu #TALBlogs #ChangeMakerOfTheWeek #DhruvyaShah #Supermemory #AIInnovation #ArtificialIntelligence #StartupStory #IndianStartup #YoungEntrepreneur #TechInnovation #FutureOfAI #AIStartup #InnovationStory #TechFounder #StartupIndia #OpenSource #GitHub #SiliconValley #Entrepreneurship #TechNews #InspiringYouth #Innovation #TALRadio #TouchALifeFoundation

  • ఒక్కసారి ఊహించండి… మన కళ్ల ముందే, మన ప్రాంతంలో ఉన్న పచ్చని అడవిని కొందరు స్వార్థం కోసం తొలగిస్తుంటే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనసు విలవిలలాడుతుంది. అధికారులకు ఫిర్యాదు చేస్తాం, చట్టపరంగా ఆపాలని ప్రయత్నిస్తాం. ఒక్కోసారి వ్యవస్థలతో పోరాడలేక, ఒంటరిగా ఏం చేయగలమని నిరాశ చెంది, వెనకడుగు వేసి, ఒక సామాన్యుడిగా మన పరిధి ఇంతేనేమో అని సరిపెట్టుకుంటాం. కానీ, మనలో కొందరు మాత్రమే ఆ మౌనాన్నే ప్రయత్నంగా మార్చుకుంటారు. ఆ కొందరిలో ఒకరే… జమునా టుడు!

    జమునా టుడు కథ 1990లో ప్రారంభమైంది. పెళ్లి తర్వాత ఆమె జార్ఖండ్‌లోని ఒక గ్రామానికి వెళ్లింది. గ్రామం చుట్టూ ఉన్న అడవులను కొందరు అక్రమంగా నరికేస్తుండటం.. ఆమెను బాగా కలచివేసింది…. ఆ అడవులపైనే గ్రామ ప్రజల జీవనం ఆధారపడి ఉండేది. కానీ రోజురోజుకూ చెట్లు తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో పెద్ద సమస్యలు వస్తాయని గుర్తించింది.

    ఈ సమస్యను ఎలాగైనా అరికట్టాలని.. మొదట ఆమె కొంతమంది మహిళలను కలిసి, వారిని ఏకం చేసి అడవిని కాపాడే ప్రయత్నంలో మునిగిపోయింది. ఆ తర్వాత ఈ ప్రయత్నం క్రమంగా పెద్దదైంది. గ్రామాల వారీగా మహిళా బృందాలు ఏర్పడ్డాయి. అడవిలో అక్రమంగా చెట్లు నరికే వారిని అడ్డుకోవడం, అడవిని పర్యవేక్షించడం, కొత్త మొక్కలు నాటడం వంటి పనులు మొదలయ్యాయి. ఒక మహిళ ప్రారంభించిన ఈ ఉద్యమం కొన్ని రోజుల్లోనే వేలాది మంది భాగస్వామ్యమయ్యే స్థాయికి చేరుకుంది.

    ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అక్రమంగా చెట్లు నరికే వారిని అడ్డుకోవడం అంత సులభం కాదు. బెదిరింపులు వచ్చాయి. భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయినా జమునా వెనక్కి తగ్గలేదు. భవిష్యత్తు తరాలకు ప్రకృతిని అప్పగించాల్సిన బాధ్యత మనదే అని గుర్తించింది. అందుకే ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన పోరాటాన్ని కొనసాగించింది.

    రోజులు గడుస్తున్న కొద్ది ఉద్యమ ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఒకప్పుడు నరికివేతతో బీడుగా మారుతున్న ప్రాంతాల్లో మళ్లీ పచ్చదనం చిగురించింది. చెట్ల సంఖ్య పెరిగింది. అడవులు పునరుద్ధరించబడ్డాయి. స్థానిక ప్రజల్లో కూడా పర్యావరణంపై అవగాహన పెరిగింది. అడవి అంటే… కేవలం చెట్ల సమూహం మాత్రమే కాదు, మన జీవన వ్యవస్థలో కీలక భాగమనే విషయం ప్రజలకు అర్థమైంది.

    దీంతో… జమునా టుడు పేరు తర్వాత దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైంది. ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించడం ద్వారా ఆమె కృషికి మరింత గౌరవం దక్కింది. కానీ అవార్డులు, గుర్తింపులు వచ్చినా ఆమె లక్ష్యం మాత్రం మరవలేదు. ప్రకృతిని కాపాడడం, ప్రజల్లో బాధ్యత పెంచడం అనే దిశలోనే ఆమె ప్రయాణం కొనసాగింది.

    ఈమె కథలో గొప్ప విషయం ఏంటంటే… ఆమెకు పెద్ద పెద్ద పదవులేమీ లేవు, మంచి పేరున్న సంస్థలు అసలే లేవు, కోట్ల రూపాయల నిధులు అంతకన్నా లేవు… కేవలం ఉన్నది ఒక్క సంకల్పం మాత్రమే. అదే సంకల్పంతో ఆమె వేలాది మందిని లక్ష్యం కోసం ముందుకు నడిపించింది. ఈరోజు పర్యావరణం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, చర్చలు చేయడం సులభమే. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పనులు చేసి, మార్పు తీసుకురావడం చాలా కష్టం. జమునా టుడు అదే చేసి చూపించారు.

    ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, నీటి కొరత వంటి సమస్యలతో పోరాడుతోంది. సమస్య ఏదైనా సరే దాన్ని మనదిగా భావించి, ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు మనతో పాటు వందలాది మంది తోడవుతారు… ఇదే ఈమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం!

    అందుకే జమునా టుడు కథ కేవలం ఒక మహిళ కథ కాదు. ఒక వ్యక్తి సంకల్పం ఎంతటి మార్పును తీసుకురాగలదో చెప్పే ఒక చక్కటి ఉదాహరణ. పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వాల పని మాత్రమే కాదు, మనందరి బాధ్యత అనే విషయాన్ని ఆమె జీవితం చాలా స్పష్టంగా చెబుతోంది.

    #TALRadio #TALBlogs #ChangeMakerOfTheWeek #JamunaTudu #LadyTarzan #ForestWomanOfIndia #PadmaShri #EnvironmentalHero #ForestConservation #SaveForests #SaveTrees #Afforestation #EnvironmentalAwareness #ClimateAction #ClimateChange #GreenIndia #NatureConservation #EcoWarrior #WomenEmpowerment #InspiringWomen #RealLifeHero #TALRadioTelugu #TouchALifeFoundation

  • పుట్టిన బిడ్డకు మొట్ట మొదటి ఔషధం ఏంటో తెలుసా? తల్లి పాలు! కానీ అదే అందక వేలాది మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్… ఆ పరిస్థితిని మార్చేందుకు తన జీవితాన్నే అంకితం చేశారు.

    ప్రపంచంలో ప్రతి శిశువూ పుట్టిన వెంటనే తల్లి ఒడిలో పెరగాలని, తల్లి పాలతోనే తన జీవితాన్ని ప్రారంభించాలని మనమంతా కోరుకుంటాం. కానీ ప్రతి బిడ్డకు ఆ అదృష్టం దక్కట్లేదు. కొంతమంది పిల్లలు నెలలు నిండక ముందే జన్మిస్తారు. మరికొందరి తల్లులు అనారోగ్యం కారణంగా పాలు ఇవ్వలేరు. అలాంటి సమయంలో ఆ పసిప్రాణాలను కాపాడేది ఎవరు?

    ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ… ఒక డాక్టర్ తన జీవితాన్నే అంకితం చేశారు. ఆమె పేరే… ఆర్మిడా ఫెర్నాండెజ్!

    ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ను స్థాపించి భారతదేశంలో శిశు సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ఆమె చేసిన ఈ కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2026లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందించింది.

    డాక్టర్ ఆర్మిడా ఫెర్నాండెజ్ ప్రయాణం.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో మొదలైంది. ఆమె తండ్రి ఆర్మాండో మెనెజెస్ గారు ఒక గొప్ప విద్యావేత్త, రచయిత. వారి ఇంట్లో చిన్నప్పటి నుండే చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించారు. హుబ్బళ్లిలో డాక్టర్ చదువు పూర్తి చేసిన ఆర్మిడా.. నవజాత శిశువుల ఆరోగ్యంపై (Neonatology) ప్రత్యేక శ్రద్ధతో ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఆమె చేసిన కృషి భారత వైద్య రంగ చరిత్రనే మార్చేసింది.

    మనసును కలిచివేసిన ప్రశ్న..

    ఆర్మిడా 1970ల కాలంలో ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు.. ప్రతిరోజూ ఆమె కళ్ళ ముందు జరిగే విషాదకర సంఘటనలు ఆమె మనసును కలిచివేసేవి. పట్టుమని పది రోజులు కూడా గడవని పసిబిడ్డలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. దీనికి కారణం ఏంటని ఆమె లోతుగా ఆలోచించారు. తల్లి పాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ పసిపిల్లలకు బయట దొరికే పాలు పట్టించేవారు. దానివల్ల ఇన్ఫెక్షన్లు సోకి, విరేచనాలై ఆ చిన్నారులు ప్రాణాలు వదిలేవారు. ఆ దృశ్యాలు చూసి ఆమె గుండె తల్లడిల్లిపోయింది. “ఒక బిడ్డకు సొంత తల్లి పాలు అందకపోతే.. కనీసం మరో తల్లి ఇచ్చే పాలైనా ఆ బిడ్డకు అందాలి కదా!” అని ఆమె బలంగా అనుకున్నారు.

    ఆసియాలోనే తొలి అడుగు..

    అదే పట్టుదలతో 1989లో ముంబైలోని సియాన్ ఆసుపత్రిలో ఆసియాలోనే మొట్టమొదటి ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించారు ఆర్మిడా. అయితే అప్పట్లో ఇది అంత సులభంగా ఏం ముందుకు వెళ్ళలేదు. “వేరే తల్లి పాలు పట్టించడం ఏంటి?” అనే సందేహాలు, భయాలు ఎదురయ్యాయి. కానీ ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. ఆరోగ్యంగా ఉన్న తల్లుల నుంచి పాలను సేకరించి.. వాటిని శాస్త్రీయంగా శుద్ధి చేసి భద్రపరిచే ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించారు.

    ఆమె చేసిన ఆ చిన్న ప్రయత్నమే ఇప్పుడు వేలాది మంది చిన్నారులకు ప్రాణదాతగా మారింది. ఆర్మిడా గారు చూపించిన ఆ బాటలోనే ఈరోజు మన దేశంలో వందకు పైగా హ్యూమన్ మిల్క్ బ్యాంకులు పని చేస్తున్నాయి. తల్లి లేని బిడ్డలకు లేదా పాలు పడని తల్లుల పిల్లలకు ఆకలి తీర్చి, ప్రాణం పోస్తున్న ఆ మిల్క్ బ్యాంకుల వెనుక ఆర్మిడా గారి జీవితకాలపు కృషి దాగి ఉంది.

    ఇప్పుడు ఆమె ఒక డాక్టరుగానే కాకుండా, లక్షలాది మంది పిల్లల పాలిట ఒక ‘అమ్మ’గా చరిత్రలో నిలిచిపోయారు.

    #TALRadioTelugu #TALBlogs #ChangeMakerOfTheWeek #DrArmidaFernandes #ArmidaFernandes #PadmaShri #PadmaShriAwardee #HumanMilkBank #BreastMilkBank #Neonatology #NewbornCare #BreastfeedingAwareness #DonateBreastMilk #SaveNewbornLives #HealthcareHeroes #ChildHealth #Motherhood #BabyCare #SocialImpact #IndianWomen #HealthcareInnovation #MilkBank #TouchALifeFoundation

  • కొడుకును కోల్పోయిన బాధ ఇప్పుడు అతన్ని కొన్ని వేల మందికి కొడుకుగా మార్చింది! మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం మనల్ని కుంగదీయవచ్చు. కానీ కొంతమంది మాత్రమే ఆ బాధను సమాజానికి ఉపయోగపడే సేవగా మార్చుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన మహమ్మద్ షరీఫ్. ఈయన గురించి తెలిస్తే… మానవత్వం ఎంత గొప్పదో మనకే అర్థమవుతుంది!

    మహమ్మద్ షరీఫ్ అయోధ్యలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. జీవితం అలా సాఫీగా సాగుతోంది. కానీ ఒకరోజు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పనిమీద బయటకు వెళ్లిన ఆయన కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. కొంతకాలం తర్వాత అతను రైలు ప్రమాదంలో మరణించినట్టు తెలిసింది. అయితే అతని మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో అనాథ శవంగా భావించి అధికారులు అంత్యక్రియలు చేసేశారు.

    కొన్ని రోజులకు విషయం తెలుసుకున్న షరీఫ్ చాల బాధపడ్డారు. తన కొడుకుకే ఇలా జరిగిందంటే… కుటుంబ సభ్యులు లేని, గుర్తింపు దొరకని మృతదేహాల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించారు. ఆ ఒక్క సంఘటనే ఆయన జీవితాన్ని ఒక కొత్త దారిలోకి నడిపించింది. అప్పటి నుంచి అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు.

    ఆ తర్వాత ఆయన ప్రయాణం అస్సలు ఆగలేదు. ఎప్పుడు పోలీసుల నుంచి సమాచారం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లి, ఆ మృతదేహం ఏ మతానికి చెందిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు… హిందువులైతే హిందూ సంప్రదాయం ప్రకారం… ముస్లింలైతే ముస్లిం ఆచారాల ప్రకారం… వారి మతాన్ని గౌరవిస్తూ అంత్యక్రియలు నిర్వహించడం మొదలు పెట్టారు. వ్యక్తి ఎవరైనా సరే తన చివరి రోజుల్లో సైతం గౌరవంగా ఉండాలన్న ఆయన సంకల్పమే ఆయన్ను ఇంతటి పనులు చేసేలా ముందుకు నడిపిస్తోంది.

    ఈ సేవ చేయడానికి ఆయనకు పెద్ద పెద్ద సంస్థల సపోర్ట్ ఏమీ లేవు… మానవత్వంతో నిండిన మనసు మాత్రమే ఆయనకు ప్రేరణ. తన సంపాదనలో కొంత, మంచి మనసున్న వారి సహాయం కొంత… ఇలా ఎన్నో కష్టాల మధ్య కూడా ఈ సేవను కొనసాగిస్తున్నారు. వర్షాలు పడినా, ఎండలు పెరిగినా, పగలు అయినా, చీకటి అయినా… విషయం తెలిస్తే చాలు.. వెంటనే వెళ్లి తన బాధ్యతగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

    కొన్ని రోజులకు ఆయన చేస్తున్న నిస్వార్థ సేవ గురించి ప్రపంచానికి తెలిసింది. అనాథ శవాలకు అంతిమ వీడ్కోలు పలికే ఒకే ఒక్కడిగా దేశమంతా ఆయన పేరు మారుమోగిపోయింది. అలా ఇప్పటివరకు ఏకంగా 25 వేల మందికి పైగా అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు… వేలాది మందికి ఆఖరి నిమిషంలో ఒక కొడుకులా, అన్నలా నిలిచిన గొప్ప మానవత్వానికి నిదర్శనం!

    ఆయన చేసిన ఈ అద్భుతమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. కానీ, ఆయనకు అసలైన సంతృప్తి మాత్రం ఆ అవార్డులో లేదు… ఆఖరి ప్రయాణంలో ఎవరూ లేని వారికి ‘నేనున్నాను’ అని ఒక మనిషిగా తోడు నిలబడటంలోనే ఉంది.

    సేవ చేయడానికి కోట్ల రూపాయల ఆస్తి గానీ, పెద్ద పెద్ద పదవులు గానీ అక్కర్లేదు… మనసులో కాస్త మానవత్వం ఉంటే చాలని నిరూపించారు మహమ్మద్ షరీఫ్ గారు. మనిషిగా పుట్టడం గొప్ప కాదు… తోటి మనిషి కోసం నిలబడటమే నిజమైన జీవితం అని చాటిచెప్పిన ఆయన ప్రయాణం, మనందరికీ ఒక గొప్ప పాఠం!

    #TALRadioTelugu #TALBlogs #MohammadSharif #PadmaShri #Ayodhya #Humanity #Kindness #UnsungHero #RealHero #SocialService #Compassion #Inspiration #HumanValues #ServeHumanity #RespectForLife #FinalJourney #PositiveStories #IndiaInspires #TALRadio #TouchALifeFoundation

  • ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు నిరుపేదల కోసం సేవ… సమాజంలో మార్పు కోసం తపించే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి రవికుమార్ గారి రోజూవారి జీవితం ఇది. చదువు మధ్యలో ఆపేస్తున్న పిల్లల్ని చూసి ఆయన మొదలు పెట్టిన ఈ ప్రయత్నం, ఈ రోజు ‘చేయూత ఫౌండేషన్’ రూపంలో వందలాది మందికి ఆసరాగా నిలుస్తోంది.

    ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజూ వందలాది మంది ఆకలి తీర్చడం, రక్తం దొరక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా పిల్లల కోసం క్యాంపులు పెట్టడం, ఆదివారం వచ్చిందంటే చాలు కాకినాడ బీచ్‌లో ప్లాస్టిక్ ఏరడానికి రంగంలోకి దిగడం, పేద పిల్లలను చదివించడం… ఇలా ఎన్నో అద్భుతమైన పనులతో ఈ సంస్థ కాకినాడలో ఒక మంచి మార్పు తీసుకొస్తోంది.

    అటెండర్ నుండి ఐఏఎస్ అధికారుల వరకు ఒకే టీమ్

    ఈ ఫౌండేషన్‌లో ప్రస్తుతం 272 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో అటెండర్ నుండి మొదలుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు అందరూ గ్రూపులుగా ఏర్పడి ఈ సేవల్లో పాల్గొంటున్నారు.

    ప్రతి ఒక్కరిలోనూ నమ్మకాన్ని సంపాదిస్తూ, ప్రతి రూపాయికి లెక్క చెబుతూ గత పదేళ్లలో దాదాపు 14.78 లక్షల రూపాయల విలువైన సేవలను అందించింది. రవికుమార్ గారు తన సొంత జీతం నుండి ప్రతి నెల పదివేల రూపాయలను ఈ సంస్థకు కేటాయిస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఈ ఫౌండేషన్‌లో మొత్తం 12 విభాగాలు ఉన్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ వీరు పని చేయడం విశేషం.

    ప్రతిరోజూ 500 మందికి అన్నదానం

    కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఈ సంస్థ ద్వారా ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నారు. లోకల్ లీడర్స్ తో నడిచే క్యాంటీన్ తో ప్రతిరోజూ దాదాపు 500 మంది ఆకలి తీరుస్తున్నారు. కేవలం ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, ఆ ప్యాకెట్ తీసుకున్న వాళ్లతో కనీసం ఐదు నిమిషాలు గడిపి, వారు ప్రశాంతంగా తినేలా చూడడమే వీరి ప్రత్యేకత. గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందించడం విశేషం.

    థలసేమియా పిల్లల కోసం రక్తం, ఉచిత వైద్యం

    ముఖ్యంగా థలసేమియా వ్యాధితో బాధపడుతూ, ప్రతి 21 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు కోల్పోయే చిన్న పిల్లల కోసం వీరు ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో 153 మంది సభ్యులను రిజిస్టర్ చేయించి, ఆ పిల్లలకు రక్తం కొరత లేకుండా చూడడం విశేషం.

    సప్త ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా… హార్ట్ ఆపరేషన్లు లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కోసం రక్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో పాటు దివ్యాంగులు సొంత కాళ్లపై నిలబడటానికి వారికి చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వారి కోసం ప్రత్యేకంగా స్కూళ్లను కూడా నడుపుతున్నారు.

    పర్యావరణ రక్షణ – కాకినాడ బీచ్ క్లీనింగ్

    చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం పూట మూడు గంటల పాటు కాకినాడ బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే కార్యక్రమం ఉంటుంది… దీని ద్వారా మున్సిపాలిటీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా.. ఒకవైపు మొక్కలు నాటడం, ఇంకోవైపు సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించడం లాంటి ఎన్నో పనులు చేస్తున్నారు.

    ఎక్కడైనా తుఫానులు, అగ్నిప్రమాదాలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు సైతం క్షణాల్లో స్పందించి బాధితులకు ఆర్థికంగా, మానసికంగా కొండంత అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఈయన చేసిన సహాయం వల్ల చదువుకుని, ఉద్యోగాల్లో స్థిరపడిన ఎంతోమంది పిల్లలు.. ఇప్పుడు మళ్లీ వచ్చి ఇద్దరేసి పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించడం.. నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి!

    యువత కోసం ‘Help In A Passion’

    యువతను సమాజ సేవ వైపు ఆకర్షించడానికి వీరు ‘Help In A Passion’ అనే ట్యాగ్‌లైన్ ను వాడుతున్నారు. సేవ చేయడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారాలి అనేదే వీరి ఉద్దేశం. వారానికి కనీసం మూడు సార్లు ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటే యువత మైండ్‌సెట్ పాజిటివ్‌గా మారుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని వీరు నమ్మడమే దీనికి ప్రధాన కారణం. దీంతో అటు అవసరం ఉన్నవారికి సహాయం అందుతుంది.. ఇటు యువత ఆరోగ్యమూ బాగుంటుంది.

    చూశారు కదా.. ఉదయం ఉద్యోగం చేస్తూనే, మిగిలిన సమయాన్ని సమాజం కోసం కేటాయిస్తూ రవికుమార్ గారు సృష్టించిన ఇంపాక్ట్ ఎలా ఉందో! ఒక వ్యక్తి తలుచుకుంటే వందలాది మంది జీవితాలను ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఈ ‘చేయూత ఫౌండేషన్’ ప్రయాణమే ఒక మంచి ఉదాహరణ. సేవను ఒక ప్యాషన్ గా మార్చుకుని మన వంతుగా సమాజానికి ఏం చేయగలమో ప్రాక్టికల్‌గా నిరూపించిన వీరి ప్రయాణం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం!

    #TALRadioTelugu #CheyuthaFoundation #RaviKumar #Kakinada #SocialService #CommunityService #VolunteerLife #HelpInAPassion #FoodForAll #BloodDonation #ThalassemiaSupport #BeachCleaning #EnvironmentalAwareness #EducationForAll #HealthcareForAll #YouthInspiration #ChangeMakers #RealHeroes #PositiveImpact #TALBlogs #TALRadio #TouchALifeFoundation

Design a site like this with WordPress.com
Get started