Design a site like this with WordPress.com
Get started

పిల్లల కోసం… ఓ అరుదైన ఆవిష్కరణ!

‘వ్యాపారంలో కోటి రూపాయలు వచ్చినా రాని ఆనందం… నా కొడుక్కి ఒక షర్టు కొనిస్తే సంతోషంగా పదిమందికీ చెప్పుకుంటాను’ అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ విషయం అక్షరాలా వాస్తవమని పిల్లలున్న అమ్మానాన్నలంతా ఒప్పుకుంటారు. తమకు ఉన్నా లేకున్నా పిల్లలకు ఏలోటూ రాకుండా పెంచుతారు. కానీ ఎదిగే పిల్లలకు షూ కొనాలన్నప్పుడు అమ్మానాన్నలకు పెద్ద సమస్యే ఎదురవుతుంది. అప్పటికి కరెక్ట్ సైజ్ తీసుకున్నా, కొన్నిరోజులకే పాదాలు పెరగడంతో అవి బిగుతు అవుతాయి. దాంతో ఇబ్బందిపడక తప్పదు. చాలా ఖర్చు చేసి వాటిని కొంటారు కాబట్టి వెంటనే వాటిని పారేయడానికి మనసు ఒప్పదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు పూణెకు చెందిన సత్యజిత్ మిట్టల్. పిల్లల పాదాల సైజు పెరుగుతున్నా ఆయా షూ సాగేలా తయారు చేశాడు మిట్టల్.

ఎదిగే పిల్లల విషయంలో మన దేశంలో, ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాగూ నాలుగు రోజుల్లో పెరుగుతారు కదా అని, బట్టల్లో కూడా పెద్ద సైజునే ఎంచుకుంటారు. కానీ షూ విషయంలో ఇలా ఎక్కువ, తక్కువ సైజుల్లో పిల్లలకు తొడగడం వల్ల వాళ్లకు సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా పదేళ్ల లోపు పిల్లలకు పాదాల సైజుల్లో త్వరగా మార్పులు వస్తాయి. అందుకే తల్లిదండ్రులు షూ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. వీటన్నింటినీ దగ్గర నుంచి చూసిన సత్యజిత్.. ఫూట్ వేర్ స్టార్టప్ ‘ఆరెట్టో’ ను మొదలుపెట్టాడు.

‘‘పిల్లలెవరైనా తమ మొదటి పదేళ్ల జీవితంలో, ఎప్పుడూ కాళ్లకు సరిగ్గా సరిపోయే షూ ను ధరించరు. కారణం ప్రతి మూడు నెలలకు వాళ్ల పాదాల సైజుల్లో మార్పు వస్తుంది. 13 ఏళ్ల వయసు వచ్చేచాక ఒక్కో పిల్లాడు 15 సైజుల షూస్ వాడాల్సి ఉంటుంది. కానీ మనచుట్టూ. మన ఇళ్లలో అది జరుగుతోందా అంటే లేదని చెప్పాలి. అందుకే నేను ప్రొడక్ట్ డిజైనర్ నుంచి ఎంట్రప్రెన్యూర్ గా మారాలనుకున్నాను. ఇప్పుడున్న రోజుల్లో షూ ధరలు బాగా పెరిగాయి. దాంతో తల్లిదండ్రులు తరచూ షూ మార్చే పరిస్థితుల్లో లేరు. రెండేళ్ల పరిశోధన, అధ్యయనం తర్వాత ఈ వ్యాపారం ప్రారంభించాను. ఎదిగే పిల్లల కాళ్లకు సరిపోయే షూ తయారు చేశాను. పాదం పరిమాణం పెరిగినా, షూ సాగేలా తద్వారా పాదాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అదే నా కంపెనీ ప్రత్యేకత కూడా’’ అని సత్యజిత్ మిట్టల్ చెప్తున్నాడు.

2022లో తన స్నేహితురాలు కృతికా లాల్ తో కలిసి ఈ ఆరెట్టా కంపెనీని ప్రారంభించాడు మిట్టల్. వీళ్లు తయారు చేస్తున్న షూలను పీడియాట్రిషియన్ల ఆమోదం పొందాకే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఒక్కో సైజు షూ మూడు నెంబర్ల వరకు సాగగలుగుతాయి. ఈ కంపెనీ ఉత్పత్తులు దిల్లీ, ఫూణె, ముంబై, బెంగళూరులో చాలాచోట్ల అందుబాటులో ఉన్నాయి. అలాగే తమ షూ అమెరికా, యూకేకు కూడా ఎగుమతి అవుతున్నట్లు సత్యజిత్ తెలిపారు.

‘‘ఒకప్పుడు నా కొడుక్కి మేము నెలకో జత షూ కొనేవాళ్లం. దానికోసం రూ.2500 పెట్టేవాళ్లం. అందరి తల్లిదండ్రుల్లాగే మాకూ ఆర్థికంగా ఈ ఖర్చు భారంగా ఉండేది. అలాగని పిల్లలకు షూ కొనకుండా ఉండలేం. ఈ కాలం పిల్లలను బయటికి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా షూ తప్పనిసరి అయింది. అందువల్ల ఇలా పాదాలను బట్టి సాగే షూ మాలాంటి పేరెంట్స్ కి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని చెబుతున్నారు పూణెకు చెందిన శ్రేయ. వీళ్ల కంపెనీ షూల ధరలు రూ.1,800 నుంచి రూ.2,600 మధ్య ఉంటున్నాయి. స్టార్టప్ మొదలైన తొమ్మిది నెలల్లోనే సత్యజిత్ 6 వేల జతల షూస్ విక్రయించాడు. ఇలాంటి సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు పిల్లలకు, అమ్మానాన్నలకు ఎంతగానో తోడ్పడతాయి.

#touchalife #talradio #talblogs

విదేశాల్లో పేదలకు సేవ చేస్తున్న భారతీయ డాక్టర్

చదువుకునే రోజుల్లోనే విదేశాలకు వెళ్లాలని చాలామంది కలలు కంటారు. డాక్టర్ సంజయ్ పైతాంకర్ కూడా ఇలాగే UAE కి 1988లో వెళ్లారు. కొన్నాళ్లు అక్కడ పని చేసి, తిరిగి మన దేశానికి వచ్చి హాస్పిటల్ కట్టాలన్న ఆశతో విదేశాలకు పయనమయ్యారు. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. అదే సంజయ్ జీవితంలోనూ జరిగింది. గత 35 ఏళ్లుగా అక్కడే ఉంటూ పేద కార్మికులకు తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తూ సంతోషంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు 64 ఏళ్ల డాక్టర్ సంజయ్.

యూఏఈకి వెళ్లిన కొన్నేళ్లకే సంజయ్ అక్కడ బ్లూ కాలర్ ఉద్యోగాల్లో పని చేసే కార్మికుల జీవితాలను దగ్గర నుంచి చూశారు. అలా వాళ్లకు తక్కువ ఫీజుతో వైద్యం చేయడం ప్రారంభించారు. ‘‘అబుదాబీలో నేను మొదట క్లినిక్ పెట్టినప్పుడు ఒక పేషెంట్ కన్సల్టేషన్ ఫీజు 10 దీరమ్స్ తీసుకునేవాణ్ని. ఇప్పుడు 30 దీరమ్స్ తీసుకుంటున్నాను. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.670. సాధారణంగా యూఏఈలో ఏ హాస్పిటల్లోనైనా 200 దీరమ్లకు తక్కువ తీసుకోవట్లేదు. అంత ఖర్చును బ్లూ కాలర్ వర్కర్స్ భరించలేరు. బ్లూ కాలర్ వర్కర్స్ అంటే.. రైతులు, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్, పవర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు మొదలైనవాళ్లు. వీళ్లంతా వివిధ దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చినవాళ్లే. అందుకే నా వంతుగా తక్కువ ఖర్చుతోనే వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వాళ్ల పరిస్థితిని బట్టి నా ఖర్చుతోనే మందులు ఇప్పిస్తుంటాను. ఈ పనిలో నాకు ఎంతో సంతృప్తి లభిస్తోంది’ అని చెబుతున్నారు డాక్టర్ సంజయ్.

1988లో కేవలం ఏడు డాలర్లు, అంటే రూ.5000తో యూఏఈకి బయలుదేరిన డాక్టర్ సంజయ్ అక్కడ చాలా కష్టపడ్డారు. పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమించారు. అందుకే ఇప్పుడు కోట్ల ఆస్తి వెంట ఉన్నా, పేదలకు వైద్యం అందించడంలోనే ఆనందం ఉంటుందంటున్నారు సంజయ్. భారతదేశంలో ఆయన మెడిసిన్ చదివి ముంబైలోని జాస్లోక్ హాస్పిటల్ లో పని చేశారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన తాను యూఏఈకి వచ్చాక డబ్బు సంపాదనలో ఎన్నో అవస్థలు పడ్డారు. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదట. అందుకే తిరిగి భారతదేశానికి వచ్చేద్దామనుకున్నారట. కానీ బ్లూ కాలర్ వర్కర్స్ జీవితాలను చూసి చలించి, ఎంత కష్టమైనా తానూ అక్కడే ఉండి పనిచేయాలని నిశ్చయించుకున్నారు. అలా నిరంత కృషి ఫలితమే! ఇంతటి గొప్ప వ్యక్తి మన భారతీయడుని గర్వంగా చెప్పుకోవచ్చు.

#talblogs #touchalife#talradio

కాలుష్యాన్ని వల వేసి పడుతున్నారు!

ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లో కనిపిస్తోంది. దాంతో వాతావరణంలోకీ ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా చేరుతున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఏ ఖాళీ ప్రదేశం చూసినా, ఏ నీళ్ల కుంట అయినా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడం అందరూ గమనిస్తున్న విషయమే. ఈ సమస్యకు పరిష్కారం ఒక్క రోజులో, ఒక్క ఆలోచనతో తీరిపోయేది కాదు. కానీ చిన్నచిన్న ప్రయత్నాలతో అందరూ ఇందులో పాల్గొంటే సమస్య మెల్లిమెల్లిగా దూరమవుతుందని అంటోంది ముంబైకు చెందిన వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ. మడ అడవులు కలుషితం కాకుండా ఉండేందుకు అక్కడికి వెళ్లే నీళ్లను వడగట్టి ప్లాస్టిక్ రహితంగా మారుస్తోంది ఈ సంస్థ.

థాణె క్రీక్ ఫ్లెమింగో శాంక్చరీ దగ్గర్లోని భాండప్ పంపింగ్ స్టేషన్ వద్ద… మడ అడవుల్లోకి వెళ్లే నీటి దారి ఉంటుంది. అక్కడ పెద్ద వలను ఏర్పాటు చేసింది వనశక్తి సంస్థ. వివిధ ప్రదేశాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే నీటిని శుధ్ధి చేస్తారక్కడ. అంటే ఆ నీళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడి వల దగ్గర ఆగిపోయి, కేవలం నీళ్లు మాత్రమే అడవుల్లోకి వెళ్తాయి. మొదటిరోజే మంచి ఫలితాలు కనిపించడంతో పర్యావరణవేత్తలు ఇలాంటి పద్ధతిని అన్నిచోట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అలాగే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు జమయ్యే చోట ఈ వలలను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

‘‘ఎన్నో ఏళ్లుగా మడ అడవులను ఏవిధంగా శుభ్రం చేస్తున్నా, ప్లాస్టిక్ వ్యర్థాలు అడవుల్లో చేరుతూనే ఉన్నాయి. అందుకే మేము ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’ అనే సూత్రానికి కట్టుబడి ఈ వల ఆలోచనతో ముందుకొచ్చాం. ఇలాంటి వలలను మెరైన్ జోన్స్ లో అమర్చడం వల్ల అడవులు, సముద్రాలను ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడ వచ్చని అనిపించింది. పైగా ఈ వలలను అమర్చడం, దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఇదే విషయాన్ని మేము ప్రభుత్వానికి, ఇతర స్వచ్ఛంద సంస్థలకు తెలియజేస్తున్నాం’’ అని చెబుతున్నారు వనశక్తికి చెందిన పర్యావరణవేత్త స్టాలిన్.

ఎప్పుడైతే అడవులు, చెట్ల సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలు కాలుష్యరహితంగా ఉంటాయో, అప్పుడే పక్షులు, జంతువులు ఆరోగ్యంగా ఉంటాయని స్టాలిన్ అంటున్నారు. అలాగే మనుషులు చేస్తున్న తప్పులకు మూగజీవులు బలయ్యే పరిస్థితి అంతమవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం వనశక్తి సంస్థ తమ దగ్గరున్న తక్కువ ఫండ్స్ తో వీలైనన్ని చోట్ల వలలను ఏర్పాటు చేస్తోంది. ఇతర సంస్థలు, ప్రభుత్వం ముందుకొచ్చి తమతోపాటు కాలుష్యరహిత పర్యావరణం కోసం పోరాడాలని ఆ సంస్థ కోరుకుంటోంది. తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితాలను అందించే వలల ఏర్పాటు ఆలోచన చాలా బాగుందని పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలు అభినందిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా పర్యావరణం పట్ల బాధ్యతతో ఉండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే భవిష్యత్తులో మానవ మనుగడకు ప్రమాదం ఉండదన్నది వాస్తవం.

#Vanashakt i#plasticpollution# touchalife #talradio #environment

జీవితం అనే ఆటను గెలిచాడు!

యశస్వి జైశ్వాల్… ఇప్పుడు ఎక్కడ విన్నా అతని పేరే. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యశస్వి తన మెరుగైన ఆటతీరుతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. 2023 ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించి రికార్డుకెక్కాడు. ఇలాంటి రికార్డ్స్ ఇంతకుముందు కూడా కొందరు సాధించారు కదా! మరి యశస్వి గురించే ఎందుకు చెప్పుకోవాలి? అనే ప్రశ్నకు స్ఫూర్తి రగిలించే జవాబు వినిపిస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యశస్వి గోల్డెన్, సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు. నిరుపేద కుటుంబంలో ఆరుగురి సంతానంలో ఒకడిగా, తినడానికే కష్టమైన పరిస్థితుల్లో పెరిగాడు. క్రికెట్ మీద ఆసక్తి, ఇష్టంతో పదేళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటికొచ్చాడు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్నాకే, తిరిగి ఇంటికొస్తానని తల్లికి మాటిచ్చాడు. క్రికెట్ లో రాణించాలంటే ముంబైకి వెళ్తేనే సాధ్యమన్న స్నేహితుల సలహాతో, ఒంటరిగా ముంబై బాటపడ్డాడు జైశ్వాల్. క్రికెట్ గ్రౌండ్ల చుట్టూ తిరుగుతూ, పొట్టకూటి కోసం రోడ్ల మీద పానీపూరీలు అమ్మాడు. చాయ్, బిస్కెట్లతో కడుపు నింపుకుంటూ క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడు.

ఎన్నో రాత్రులు ఆకలితో పడుకున్నట్లు యశస్వి చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ముంబైలాంటి మహానగరంలో ఉండేందుకు ఇల్లు దొరక్క, క్రికెట్ గ్రౌండ్ దగ్గర్లో ఒక టెంట్ కిందకు చేరాడు. నెలల తరబడి అక్కడే ఉంటూ, క్రికెటే ప్రాణంగా జీవనం సాగించాడు. స్కోరింగ్, ఎంపైరింగ్ చేస్తూ, వచ్చే కొంత డబ్బుతో రోజులు గడిపాడు. ఇలా రోజురోజుకూ క్రికెట్ అతని నరనరాల్లోకి ఎక్కేసింది. కసి, పట్టుదలతో మెరుగుపర్చుకున్న తన ఆటతీరుతో అండర్-19 టీమ్ కు ఎంపికయ్యాడు. 2020 అండర్- 19 వరల్డ్ కప్ లో తనదైన ఆటను ప్రదర్శించడంతో 2020 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ యశస్విని రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వెచ్చించి తీసుకుంది. అప్పట్నించి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రంజీలో, అండర్ -19లో తన సత్తా చాటి ఐపీఎల్ మ్యాచులకు ఎంపికయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ లో మంచి స్కోర్ తో పాటు రికార్డులు సృష్టించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఈసారి అతను తప్పకుండా నేషనల్ టీమ్ కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు క్రికెట్ నిపుణులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ క్రికెట్ సంగతి పక్కనపెడితే, యశస్వి జైశ్వాల్ నుంచి చాలా విషయాలు తప్పకుండా నేర్పుకోవాలి. నచ్చిన దానికోసం కష్టపడే తత్వం, ఆశయం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ మడమ తిప్పని నైజం లాంటి లక్షణాల వల్లే యశస్వి ఈ స్థాయి విజయం అందుకున్నాడు. జీవితంలో దేన్నైనా సాధించాలనే తపన ఉంటే చాలు… ఎలాంటి పరిస్థితినైనా దాటగలమని, ఏ సవాలునైనా ఎదుర్కోగలం అని నిరూపిస్తున్నాడు.

#IPL #RR #RajasthanRoyals #IPL2023 #YashasviJaiswal

అమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యంఅందిస్తున్న టీనేజర్‌- మాన్యా సింగ్

ఈ రోజుల్లో బడికి వెళ్లే పిల్లల నుంచి కాలేజీలకు వెళ్లే టీనేజర్ల వరకు అందరికీ జీవితం గురించి స్పష్టత ఉంటోంది. బాగా చదువుకోవాలి… మంచి ఉద్యోగం తెచ్చకోవాలి… స్థిరంగా సంపాదించాలి. ఈ ఆలోచనతోనే ఉంటున్నారు చాలామంది. కానీ అదే టీనేజీలో ఉన్న ఒక అమ్మాయి తన అమ్మలాంటి మహిళలకోసం గొప్ప ఆశయంతో ముందడుగు వేసింది. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలందర్నీ ఒక చోటుకు చేర్చి వాళ్లకు ఎన్నో విధాల తోడ్పాటు అందిస్తోంది. 2020లో ఆమె స్థాపించిన ‘Incuba-Naari’ ద్వారా మహిళా ఎంట్రాప్రెన్యూర్లకు మెంటరింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ మొదలైన ఎన్నో అంశాలపై ఉచితంగా శిక్షణ అందిస్తోంది బెంగళూరుకు చెందిన మాన్య సింగ్.

ఇన్క్యూబా-నారీ మొదలుపెట్టడానికి ముందు మాన్య దేశమంతటా తిరిగి, 40 మంది ఎంట్రాప్రెన్యూర్లను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ల అనుభవాలు, లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. ఆ ఇంటర్వ్యూలను స్టోరీలుగా మలచి ఇన్క్యూబా-నారీ ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్ లో రాసుకొచ్చింది. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని మాన్య చెప్తోంది.
‘‘ఈ ఆలోచనంతా నాకు మా అమ్మను చూశాకే వచ్చింది. మేము పుట్టక ముందు మా అమ్మ కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేది. తర్వాత మమ్మల్ని చూసుకోవడానికి ఉద్యోగం మానేసింది. అయినా తన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఇంట్లోని గ్యారేజ్ స్థలంలో మట్టితో కళాకృతులు చేయడం మొదలుపెట్టింది. తర్వాత దాన్ని పాటరీ స్టూడియోగా మార్చి, ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, రకరకాల వస్తువులు తయారు చేసి విక్రయించేది. అప్పుడే నాకు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఎంత ముఖ్యమో అర్థమైంది. తర్వాత ఇతర మహిళా ఎంట్రాప్రెన్యూర్లను కలిశాక, మరింత లోతుగా విషయాలను అర్థం చేసుకున్నాను. 95శాతం మంది మహిళలు తాము ఆర్థికంగా స్వంత్రులుగా ఉండాలనే కోరుకుంటున్నారని మా అధ్యయనం తెలిపింది. అయితే ఇక్కడున్న చిక్కల్లా వారికి… మెంటర్ షిప్, నెట్ వర్కింగ్, డిజిటల్ యాంప్లిఫికేషన్ మొదలైన అంశాల్లో యాక్సెస్ లేదు. అలాంటి సమస్యకు పరిష్కారం అందించేందుకే మా ఇన్క్యూబా-నారీ కృషి చేస్తోంది’’ అని మాన్య తెలిపింది.

మాన్య 2022లో డాక్టర్ శివ కుమారి ఎంవైపీ స్టూడెంట్ ఇన్నోవేటర్స్ గ్రాంట్ కు అప్లై చేసింది. అది ‘ఇంటర్నేషనల్ బ్యాకలరేట్’ అనే సంస్థ అశోకా ఫౌండేషన్ తో కలిసి సోషల్ ఎంట్రాప్రెన్యూర్లకు అందించే ప్రోత్సాహం. అలా మాన్యకు ఆరున్నర లక్షల రూపాయల గ్రాంట్ వచ్చింది. ఆ మొత్తాన్ని ఆమె ఇన్క్యూబా-నారీ కార్యక్రమాలకు వినియోగించింది. మహిళా ఎంట్రాప్రెన్యూర్లకు బెంగళూరులో మూడు నెలల ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తోంది. అందులో వాళ్లకు నిపుణుల ద్వారా ట్రైనింగ్, మెంటరింగ్ చేయిస్తోంది. అంతేకాదు వాళ్లందరికీ సీడ్ ఫండింగ్ చేసే సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.
తమ బిజినెస్ ఈవెంట్ కోసం ఎట్సీ ఇండియా అనే కంపెనీతో భాగస్వాములై మహిళా ఎంట్రాప్రెన్యూర్లు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఒక మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు మరో 100మంది మహిళా ఎంట్రాప్రెన్యూర్లను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్తున్న మాన్య లాంటి టీజేజ్ అమ్మాయిలు ఎంతోమందికి ఆదర్శం. ఎలాంటి లాభం ఆశించకుండా ఇంతటి గొప్ప పని చేస్తున్న మాన్యలాంటి వాళ్లను చిన్నాపెద్దా అంతా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.

#mothersday #incubanaari #touchalife #talradio #manyasingh #Mothersday2023

ఆదివాసీల ఆరోగ్యం కోసం…ఓ నర్సమ్మ సాహసం

మారుమూల పల్లెల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండటం చూస్తుంటాం. మరి పల్లెలు దాటి అడవుల్లో జీవించే అడవిబిడ్డలకు ఉండే సదుపాయాల గురించి ప్రత్యకంగా చెప్పుకోనక్కర్లేదు. అలాంటి ప్రాంతంలో ఓ తెగ ప్రజలకు గత 22 ఏళ్లుగా వైద్యం అందిస్తున్నారు అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నర్సు శాంతి టెరెసా లక్రా. ఆమె అక్కడ ఓంజెస్ అనే తెగలో 2001 నుంచి పని చేస్తున్నారు. తన సేవలకుగాను ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

అండమాన్ తెగల్లో విస్తృతంగా పనిచేస్తున్న శాంతిది మొదటి నుంచి సేవతత్వమే. అందువల్లే నర్సుగా మారాలని అనుకున్నారు. ఓంజెస్ తెగతో పని చేసే క్రమంలో రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండేవారు. 2004లో సునామీ సమయంలో రోజులకు రోజులు తిండి, నిద్ర కూడా లేకుండా పని చేశారామె. ఆ సమయంలో ఓంజెస్‌ ప్రజలకు అత్యవసర వైద్యం, మందులు అందించేందుకు 12-15 కిలోమీటర్లు నడిచారట. అదే సందర్భంలో గర్భవతిగా ఉన్న ఒక మహిళకు అతికష్టం మీద కాన్పు చేశారు. పుట్టిన బిడ్డ 900 గ్రాముల బరువే ఉండటంతో కొన్ని రోజులపాటు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అలా ఆ సమయంలో ఆమె నాలుగైదు కాన్పులను చేశారు. ఆ సునామీ రోజులను గుర్తు చేసిన ప్రతిసారీ ఆమె భావోద్వేగంతో నిండిపోతారు.

‘‘ఓంజెస్ తెగలో పనిచేసిన కొన్నేళ్లకు అడవిలో మరోచోటికి మకాం మార్చారు. దాంతో నేను రోజూ మా ఇంటి నుంచి సముద్ర ఒడ్డున గంటలకొద్దీ నడిచేదాన్ని. కొండలు, గుట్టలు ఎక్కుతూ వాళ్లను చేరి వైద్యం అందించేదాన్ని. అయితే కొన్నేళ్ల తర్వాత నన్ను పోర్ట్ బ్లెయిర్లోని జీబీ పంత్ హాస్పిటల్ కు బదిలీ చేశారు. అక్కడ స్పెషల్ వార్డులో పని చేసేదాన్ని. వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచి రోగులు మా దగ్గరకు వచ్చేవారు. నేను అక్కడ ఉన్నానని తెలుసుకుని మరీ, ఓంజెస్ తెగ ప్రజలు నా దగ్గరకు వచ్చేవారు. అలా నాకూ, ఆ తెగ ప్రజలకు ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది’’ అని 52 ఏళ్ల శాంతి చెబుతున్నారు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత ఆమెను మరెన్నో అవార్డులు వరించాయి. నర్సుగా సేవలందించేందుకు ఆమె తన భర్తతో కలిసి హాస్పిటల్ కు దగ్గర్లోనే ఉంటారు. అయితే తన కొడుకును చూసుకోవడానికి ఆమె కష్టపడుతుండటంతో ఆమె అత్తమామలు, బాబును తీసుకు వెళ్లి వేరే ఊరిలో చదివిస్తున్నారు. ఇలా తన జీవితాన్ని అడవుల్లోని తెగ ప్రజల ఆరోగ్యానికే అంకితం చేసిన శాంతి లక్రా లాంటివాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.

#ShantiTeresaLakra #touchalife #talradio #nurse #mothersday #Mothersday2

Gulmeher… ఇది ఓ అరుదైన సంస్థ

ఎవరి పని వాళ్లకు కష్టమే అన్న మాట మనం తరచుగా వింటుంటాం. కానీ కొన్ని ఉపాధులు మనుషులను అనారోగ్యంలోకి నట్టేస్తాయి. వాటిలో ఒక్కటే చెత్త కుప్పల్లో, పెద్దపెద్ద గార్బేజుల్లో చెత్త ఏరడం. ఇలాంటి పని చేస్తున్న వాళ్లు ఆర్థికంగా కోలుకోకపోగా రోగాల పాలవుతుంటారు. అందుకనే ఈ వృత్తిలో ఉన్న మహిళలకోసం కృషి చేస్తోంది దిల్లీకి చెందిన గుల్మెహర్ అనే సంస్థ. ఘాజీపూర్లో చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్న మహిళలపై దృష్టి పెట్టిందీ సంస్థ. అలాంటి మహిళలను ఒక్కచోటకు చేర్చి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు అందించి వారికి అండగా నిలుస్తోంది.

ఈ గుల్మెహర్ అనే స్వచ్ఛంద సంస్థను 2013లో అనురాగ్ కశ్యప్ స్థాపించారు. చెత్త ఏరుకునే (వేస్ట్ పికర్స్) వాళ్ల జీవితాల్లో కొత్త మార్పును తీసుకురావాలనే ఉధ్దేశ్యంతో ఆయన గుల్మెహర్ స్థాపించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి 120 మంది మహిళలను ఒప్పించి, ఆ పని నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాళ్లందరూ రకరకాల హ్యాండీ క్రాఫ్ట్ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే మరో 40 మంది ప్రస్తుతం వేస్ట్ పికింగ్ నుంచి బయటికొచ్చి వ్యాపారవేత్తలుగా మారారు. దానంతటికీ గుల్మెహర్ సంస్థే కారణమని ఆ మహిళలు చెప్తున్నారు.

‘‘మా సంస్థ ప్రధాన ఉధ్దేశ్యమే మహిళలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసుకుంటూ, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడం. అందుకే వేస్ట్ పికర్స్ కమ్యూనిటీలోని మహిళలను మా సంస్థలో చేర్చుకున్నాం. తర్వాత వాళ్లకు రకరకాల హ్యాండీ క్రాఫ్ట్ ల తయారీలో శిక్షణ ఇప్పించాం. అలాగే వాళ్లు దగ్గర్లోని హోల్ సేల్ ఫ్లవర్ మార్కెట్ లోని పూల వ్యర్థాలను తీసుకొచ్చి, రకరకాల పర్యావరణహిత ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రీసైకిల్డ్ పేపర్లతో వస్తువులు తయారు చేస్తారు. అలా మా దగ్గర ఉన్న మహిళలంతా ఇప్పుడు నిపుణులుగా, కళాకారులుగా మారడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇఫ్పుడు ఆ కుటుంబాలు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాయి. తమ పిల్లలను చదివించుకుంటూ చాలా ధైర్యంగా ఉంటున్నాయ’’ని అనురాగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గుల్మెహర్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు జీతంతోపాటు పాటు పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌలభ్యాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ రకరకాల ఉత్పత్తుల విక్రయాలు చేసి గత ఎనిమిదేళ్లలో నాలుగు కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది. అందులో దాదాపు రెండు కోట్ల రూపాయలు జీతాలుగా మహిళలకు అందడం సంతోషించాల్సిన విషయం. భవిష్యత్తులో తమ సోషల్ స్టార్టప్ ద్వారా మరెంతోమంది మహిళలకు ఇలా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు జరగుతున్నట్లు అనురాగ్ చెబుతున్నారు. ఇలాంటి మంచి పనులు, కొత్త ఆలోచనలు ఇతరులకు తప్పకుండా స్ఫూర్తిదాయకం.

#gulmeher #ragpickers #talblogs #touchalife #talradiotelugu #AnuragKashy

కేన్సర్‌ను జయించి…పదిమందికీ ధైర్యంగా నిలిచి!

కేన్సర్ గురించి ఇప్పటికీ చాలామందిలో పూర్తి అవగాహన లేదు. అందుకే కేన్సర్ ని ఒక ప్రాణాంతక వ్యాధిగానే చూస్తున్నారు. నిబ్బరంగా ఉంటూ, సకాలంలో చికిత్స తీసుకుంటే… కేన్సర్ తగ్గి సంపూర్ణ ఆరోగ్య జీవితం లభిస్తుందని తెలియట్లేదు చాలామందికి. కేన్సర్ పేషెంట్లలో కూడా దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉండట్లేదు. కానీ కొంతమంది మాత్రం కేన్సర్ నుంచి బయటపడి, ఇతర కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అందులో ఒడిషాకు చెందిన 24 ఏళ్ల స్వాగతిక ఆచార్య ఒకరు.

2017 వరకూ హాయిగా, ఆడుతూపాడుతూ తిరిగే టీనేజ్ అమ్మాయి స్వాగతిక. శాస్త్రీయ నృత్యం అంటే ఆమెకి ప్రాణం. అలాగే చదువుపై అమితమైన ఆసక్తి. ఇలా అన్నింట్లో చురుగ్గా ఉంటున్న స్వాగతిక జీవితంలోకి కేన్సర్ పెనుతుఫానులా వచ్చింది. ఇంటిల్లిపాదీ మానసికంగా కుంగిపోయారు. కానీ స్వాగతిక తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తానే అందరికీ ధైర్యం చెప్తూ, కేన్సర్ ని జయించింది. అలాగే 2018లో ‘అవేకన్ కేన్సర్ కేర్’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది ఈ ఒడిస్సీ నృత్యకారిణి. ఈ సంస్థ ద్వారా ప్రజల్లో కేన్సర్ పై అవగాహన కల్పిస్తూ, కౌన్సిలింగ్ ఇస్తూ, కేన్సర్ పేషెంట్లకు చికిత్సలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది. కొంతమంది వైద్య నిపుణులతో కలిసి కేన్సర్ పేషెంట్లకు ఉచితంగా టెలీ కన్సల్టేషన్ కూడా అందిస్తోంది.

17 ఏళ్ల వయసులోనే స్వాగతికకు నాసోఫారింజియల్ కార్సినోమా అనే గొంతు సంబంధ కేన్సర్ వచ్చింది. అప్పుడప్పుడే ఆమె కలలు కన్న ఎల్.ఎల్.బి చదువులో అడుగుపెట్టింది. భువనేశ్వర్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీటు సంపాదించింది. అందరూ అనుకున్నట్లు స్వాగతిక చదువు ఆగిపోలేదు. ఇటు చికిత్స తీసుకుంటూనే లాయర్ కావాలన్న తన కలను సాకారం చేసుకుంది.

మొదటినుంచీ స్వాగతికకు, తండ్రి మనోరంజన్ ఆచార్య అండగా ఉన్నారు. చిన్నప్పుడు చిన్న ఇంజెక్షనుకే ఏడ్చేసిన తన కూతురు, కేన్సర్ చికిత్స సమయంలో ధైర్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారాయన. ‘‘కిమోథెరపీ, రేడియోథెరపీ సమయంలో నేను వందల కొద్దీ సూదులను చూశాను. కేన్సర్ కి ముందు చిన్న ఇంజెక్షన్ కి కూడా భయపడేదాన్ని. కానీ కేన్సర్ చికిత్సతో అన్నివిధాలా దృఢంగా మారాను. ఆ సమయంలో ఎన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానో లెక్కే లేదు’’ అని స్వాగతిక చెబుతోంది.

స్వాగతిక మొత్తం మూడు సైకిళ్ల కిమోథెరపీలు, 37 రేడియో థెరపీ డోసులు తీసుకుంది. రెండున్నర నెలల రేడియోథెరపీ సమయాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చెప్తోంది. నాలుగు నెలలపాటు మాట్లాడటం రాకపోవడంతో నోట్ ప్యాడ్ ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ అయింది. నోటితో తినడం వీలుడిక, ఫుడ్ పైప్ ద్వారా నీళ్లు, బార్లీ నీళ్లు, గంజి ఇచ్చేవాళ్లు కుటుంబ సభ్యులు. దాంతో నోట్లో అల్సర్లు వచ్చాయి. ఇలా ఎన్నోరకాల అవస్థలను ఆమె అనుభవించింది. అయినా ఏనాడూ జీవితంపై ఆశను, తన కలలను సాధించాలన్న పట్టుదలను కోల్పోలేదు.

‘‘ఆ సమయంలో నన్ను చాలామంది నిరుత్సాహ పరిచారు. నాకిష్టమైన డ్యాన్స్, ట్రెక్ మళ్లీ చేయలేనని అన్నారు. జీవితం మళ్లీ సాధారణ స్థితికి రాదని చెప్పారు. కానీ నేను వేటినీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పూర్తిగా సాధారణ జీవితం గడుపుతున్నాను. లా చదువు పూర్తి చేశాను. నచ్చిన డ్యాన్స్ కొనసాగిస్తున్నాను. ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్ కూడా చేస్తున్నాను. కాబట్టి నాలాగే అందరూ క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది స్వాగతిక. అలాగే ఆమె తన అవేకన్ సంస్థతో క్యాన్సర్ బాధితులకు అన్నివిధాలా సాయం చేస్తోంది. ఇలాంటివాళ్ల గురించి తెలుసుకుంటూ జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు భయపడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి.

#swagatikaacharya #touchalife #talradio #awakencancercare #talblogs

చదువు సాగేలా, కుటుంబం గడిచేలా…Earn & Learn

నేటి బాలలే రేపటి పౌరులు. ఈ సంగతి అందరికీ తెలిసినా, అందరూ వింటూనే ఉన్నా… చాలాచోట్లా పిల్లలు చదువుకోలేకపోవడమో, చదువుతూ మధ్యలో మానేయడమో జరుగుతూ ఉంటుంది. ఇందుకు ముఖ్య కారణం కుటుంబ ఆర్థిక ఇబ్బందులే! అలాంటి పిల్లలు బడికి వెళ్లాలంటే, ఆర్థికంగా తోడ్పాటు ఉండాలి. ఆ పని చేస్తోంది గుజరాత్ కు చెందిన ‘మానవ్ సాధన’ అనే స్వచ్ఛంద సంస్థ. ‘ఎర్న్ ఎన్ లర్న్’ పేరుతో స్కూల్ అయిపోయాక మూడు, నాలుగు గంటలు ఆ పిల్లలకు రకరకాల పనులు నేర్పిస్తోందీ సంస్థ.

కొంతమంది పిల్లలు ప్రభుత్వ బడులకు వెళ్లినా, కొన్నిరోజులకే ఆసక్తి చూపించక మానేస్తుంటారు. తల్లిదండ్రులు తిట్టినా, కొట్టినా చదువుకోమని, బడికి వెళ్లమని మారాం చేస్తారు. కానీ ఎప్పుడైతే మానవ్ సాధన సంస్థ, ఎర్న్ ఎన్ లర్న్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందో… పిల్లలు ఒక్కరోజు కూడా బడికి డుమ్మా కొట్టకుండా వెళ్తున్నారట. కారణం, బడి ఆఖరి గంట కొట్టగానే, ఆసక్తికరమైన పనులు నేర్పిస్తూ వాళ్లలో కొత్తకొత్త నైపుణ్యాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మొదటి దశలో పిల్లలకు న్యూస్ కాగితాలతో బ్యాగ్స్ తయారీ నేర్పిస్తారు. వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను ఆయా విద్యార్థుల కోసమే ఖర్చు చేస్తారు.

‘‘ఈ ఎర్న్ ఎన్ లర్న్ ప్రోగ్రామ్ లో మేము స్కూల్ అయిపోయాక కొన్ని గంటలు, పిల్లలకు కొన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుంటాం. అంటే సాయంత్రం ఆరు గంటల వరకు తరచూ క్లాసులు తీసుకుంటాం. అందులో డ్యాన్స్, తబలా, క్రీడలు, పేపర్ బ్యాగ్ తయారీతో పాటు మరికొన్ని క్రాప్టింగ్ పనులు నేర్పిస్తాం. వాటికోసం ఉపయోగించే మెటీరియల్స్ మేమే సమకూర్చుతాం. పేపర్ బ్యాగ్స్ కు ఆర్డర్లు వస్తుంటాయి. ఆ వచ్చిన డబ్బుతో అవసరంలో ఉన్న పిల్లలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు… పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందిస్తాం’’ అని చెబుతున్నారు మానవ్ సాధనలో కీలక పాత్ర పోషించే నీతాబెన్.

ఈ సంస్థ తాము ఎంచుకున్న స్కూళ్ల విద్యార్థులను ఏడాదికి రెండు, మూడుసార్లు విహార యాత్రలకు తీసుకెళ్తుంది. ఆ పిల్లలంతా ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వయసు మధ్య వారే ఉంటారు. వీళ్లంతా పేపర్ బ్యాగ్స్, గ్రీటింగ్ కార్డ్ తయారీ నుంచి మట్టి ప్రమిదల తయారీ వరకు అన్నింట్లోనే ఉత్సాహంగా పాల్గొంటారని నీతాబెన్ చెప్తున్నారు. ఈ పిల్లలకు రెగ్యులర్ గా పోషకాహారం అందిస్తూ, పరిశుభ్రత గురించి అవగాహన కూడా కల్పిస్తారు. ఈ మానవ్ సాధన సంస్థ గత 30 ఏళ్లుగా గాంధీ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నేటి బాలలను రేపటికి బాధ్యత, సమర్థత గల పౌరులుగా తయారు చేసేందుకు ఈ కృషి చేస్తోంది.

#manavsadhana  #touchalife  #talradio  #earnandlearn  #talblog

ఉన్నత ఉద్యోగం వదిలి… ఇష్టమైన రంగంలో అద్భుతం

జీవితంలో ఒకొక్కరు ఒకో దశలో విజయం సాధిస్తారు. కొత్త ఆశయాలు ఏర్పరచుకుని ముందుకు వెళ్లడానికి వయసుతో సంబంధం ఉండదు కదా! అలా రాజస్థాన్ కు చెందిన అంజలి అగర్వాల్ కు అప్పటివరకూ చేస్తున్న ఐటీ ఉద్యోగం నచ్చలేదు. దాంతో తను ఇష్టపడిన వ్యాపారరంగం వైపు అడుగులు వేసింది. భారతదేశానికి ప్రత్యేకమైన చేనేతలో ఒకటి- రాజస్థాన్ కు చెందిన కోటా డోరియా. ఆ నేతతో తన ప్రయాణం మొదలుపెట్టింది అంజలి. ‘కోటా డోరియా సిల్క్’ అనే గార్మెంట్ కంపెనీ ప్రారంభించి దేశమంతటా తన దుస్తులను విక్రయిస్తోంది. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. కోటా డోరియా సాధారణంగా కాటన్ తో తయారవుతుంది. కానీ అంజలి చేస్తున్న వ్యాపారం కోటా డోరియాలో సిల్క్! ఇలా భిన్నంగా ఆలోచించి అందరికీ ఉపయోగకరంగా కోటా డోరియాలో సిల్క్ తీసుకురావడంలోనే అంజలి విజయరహస్యం ఉంది.

రాజస్థాన్ వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి వేడిని తట్టుకునేందుకు ఎక్కువగా కాటన్ దుస్తులనే ధరిస్తారు. అలా కోటా డోరియా కూడా కాటనే. బయటికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కోటా డోరియాపై ఎంత ప్రేమ, ఇష్టం ఉన్నా… తరచూ వాటికి గంజిపెట్టి ఇస్త్రీ చేయాల్సి రావడంవల్ల ఎక్కువగా వాడేవారు కాదు. అంజలి సమస్య కూడా అదే ఉండేదట. అందుకే కోటా డోరియాలో సిల్క్ తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. చేనేత కళాకారులు, కార్మికులతో సంప్రదించి సిల్క్ మిక్సింగ్ తో కోటా డోరియాను తీసుకురావడం సాధ్యమేనని తెలుసుకుంది. అప్పుడు తన అసలు పనిని ప్రారంభించింది. కేవలం రూ.25,000 పెట్టుబడితో మొదలైన కోటా డోరియా సిల్క్ ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తోంది.

‘‘ప్రఖ్యాత ఐటీ కంపెనీలో నేను 12 ఏళ్లు పనిచేశాను. తర్వాత నాకు రొటీన్ జాబ్ మీద ఆసక్తి తగ్గిపోయింది. దాంతో సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నాను. నాకు మొదట్నించీ చీరలంటే చాలా ఇష్టం. అందులోనూ రాజస్థాన్ కే ప్రత్యేకమైన కోటా డోరియాపై ఆసక్తి. అలా నా ప్రయాణం మొదలైంది. సిల్క్ కాంబినేషన్ పనుల్లో చాలా ఫ్యాబ్రిక్ వృధా అయ్యింది. కానీ ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. డిజిటల్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీపై దృష్టి పెట్టాను. అలాగే బంగారు, వెండి పోగులతో కోటా చీరలను తీసుకొచ్చాను. అంతేకాదు నేత ద్వారా బంధేజ్, లెహరియాలను సంప్రదాయ డిజైన్లలో తయారు చేశాం. ఇలా రకరకాల ప్రయోగాలవల్లే మేమిప్పుడు ఈ స్థితిలో ఉన్నాం’’ అని గర్వంగా చెబుతోంది అంజలి అగర్వాల్.

ఆన్ లైన్ వ్యాపారాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్న అంజలికి ప్రస్తుతం దేశ నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలా విభిన్న ఆలోచన, ప్రయోగం… అన్నింటికంటే ముఖ్యమైంది తోటి మహిళలకు ఉపయోగకరంగా ఉండాలనుకున్న ఆలోచనే ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆసక్తి, పట్టుదలకు పదును పెడితే జీవితంలో ఎలాగైనా విజయం సాధించవచ్చిన అంజలి ప్రయాణం రుజువు చేస్తోంది.

#kotadoria #kotadoriasilk #talpodcast #touchalife #talradio